జగన్పై దెబ్బ: ఆ నలుగురు నేతలు ఎవరు?
తన ఇలాకాలోనే జగన్ టిడిపి చేతుల్లో దెబ్బ తిన్నారు. స్వయంగా బాబాయ్ని రంగంలోకి దింపినా ఫలితం దక్కలేదు. దీని వెనక ఉన్న టిడిపి నేతలు నలుగురు, వారెవరు....
అమరావతి: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని తన సొంత ఇలాకాలో దెబ్బ తీయడంలో నలుగురు తెలుగుదేశం పార్టీ నాయకులు కీలక పాత్ర పోషించారు. ఇంచార్జీ మంత్రులు దాంతో వెలుగులోకి వచ్చారు. వారిపై టిడిపిలో ప్రశంసల జల్లు కురుస్తోంది.
తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కడప ఎమ్మెల్సీ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. జగన్ను దెబ్బ కొట్టే వ్యూహరచన కోసం ఆయన మూడుసార్లు సమావేశం నిర్వహించారు. ఆయన తనయుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ గత నెలరోజుల నుంచి గుంటూరు కార్యాలయంలో కడప జిల్లా నేతలతో సమీక్షలు నిర్వహించారు.
కడపకు ప్రభుత్వపరంగా చాలా చేస్తున్నామని, చివరకు కుప్పంను కూడా కాదని ముందు పులివెందులకే నీళ్లిచ్చామని, ఈ ఎన్నికలో వైయస్ కుటుంబాన్ని ఓడించి రాకపోతే, ఇక మీ జిల్లాను వదలిస్తామని చంద్రబాబుతో పాటు నారా లోకేష్ హెచ్చరించారు. అది ఫలించినట్లే ఉంది.
రంగంలోకి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి...
కడప ఎమ్మెల్సీ అభ్యర్థిగా టిడిపి బిటెక్ రవిని ఎంపిక చేసింది. ఈ ఎంపికపై తొలుత పార్టీ నేతల్లోతీవ్ర వ్యతిరేకత ఎదురైంది. కొన్ని వర్గాలు సహాయ నిరాకరణకు కూడా సిద్ధమయ్యాయి. దాంతో పలువురు వైసీపీ నుంచి చేరినప్పటికీ పోలింగ్న క్రాస్ ఓటింగ్ చేస్తారనే భయం పట్టుకుంది. దీనితో సమస్య తీవ్రతను పసిగట్టిన నాయకత్వం అనుభవజ్ఞుడైన మాజీ మంత్రి, సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డిని రంగంలోకి దింపింది. దానితో ఆయన ఒకవైపు తన సొంత నెల్లూరు జిల్లాలో ఎన్నికల వ్యూహం రచిస్తూనే, రోజూ కడప జిల్లాకు వెళ్లి అక్కడి సీనియర్లను బుజ్జగించారు. సీనియర్లను ఏకతాటిమీదకు తీసుకురావడంపై ఆయన దృష్టి సారించారు. వారిని పాండిచ్చేరికి తరలించిన తర్వాత, అక్కడ ప్రజాప్రతినిధులు తప్పులు చేయకుండా రాజ్యసభ ఎన్నికల మాదిరిగా కోడ్ విధానాన్ని తెరపైకి తీసుకువచ్చారు. ఆ సందర్భంలో నిర్వహించిన మాక్ పోలింగ్లో అనుకున్నట్లుగానే కొందరు సభ్యులు పొరపాటు చేసిన క్రమంలో కోడ్ ఆధారంగా ఎవరు తప్పు చేశారో వెల్లడించారు. తద్వారా అందరినీ దారిలోకి తెచ్చారు. అదే సమయంలో ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ అధికార మార్పిడి వ్యవహారం రెండు వర్గాల మధ్య విబేధాలకు దారితీసింది. దాని ప్రభావం ఎన్నికలపై పడుతుందని భావించి ఇరు వర్గాలతో చర్చించి ప్రస్తుత చైర్మన్ రాజీనామా చేయించడం ద్వారా సమస్క పరిష్కరించారు. కడపలో జగన్ బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డిని ఓడించిన కీలక నేతల్లో ఒకరిగా సోమిరెడ్డి పేరు తెచ్చుకున్నారు.
నెల్లూరు జిల్లాలో శిద్ధా రాఘరావు....
ప్రకాశం జిల్లాకు చెందిన మంత్రి శిద్దా రాఘవరావు నెల్లూరు జిల్లా ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. మంత్రి నారాయణ, జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆనం సోదరులు, ఆదాల ప్రభాకరరెడ్డిలతో నెలరోజులు పనిచేసి, పార్టీ అభ్యర్ధి వాకాటిని గెలిపించడంలో కీలకపాత్ర పోషించారు. జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర సహకారంతో ఆయన అటు నెల్లూరు జిల్లా ఇన్చార్జి మంత్రిగా స్థానిక సంస్థలు, టీచర్-గ్రాడ్యుయేట్ ఎన్నికలను సమన్వయపరుస్తూనే, ఇటు తన సొంత ప్రకాశం జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎన్నికలపై సీరియస్గా దృష్టి పెట్టారు. మహాబలిపురంలో నిర్వహించిన శిబిరానికీ హాజరయి, మాక్ పోలింగ్లో తగిన సూచనలిచ్చి నాయకత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు.
మంత్రి గంటా శ్రీనివాస రావు ఇలా...
కడప స్థానిక ఎన్నికల్లో పార్టీ విజయంలో ఇన్చార్జిమంత్రి గంటా శ్రీనివాసరావు కీలకమైన పాత్ర పోషింారు. నెలరోజుల పాటు వ్యూహరచనలో కీలకపాత్ర పోషించారు. ఓటర్లను పార్టీలో చేర్పించడం, చేరిన వారిని సమన్వయపరచడంతోపాటు ముఖ్యమైన అన్ని విభాగాల్లోనూ విశేషమైన కృషి చేశారు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ప్రశంసలు కూడా అందుకున్నారు.
ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి సాయంతో...
ఎమ్మెల్సీ సతీష్రెడ్డి సాయంతో పులివెందులపై గంటా శ్రీనివాస రావు దృష్టి సారించారు. అభ్యర్ధిపై అసంతృప్తితో ఉన్న నేతలను బుజ్జగించడంతోపాటు, మధ్యలో దూరంగా ఉన్న కొన్ని వర్గాలను పిలిపించి మాట్లాడి చురుగ్గా పాల్గొనేలా చేశారు. ఈ విజయంలో కీలకపాత్ర పోషించిన గంటాను సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో అభినందనలతో ముంచెత్తారు. సతీష్ రెడ్డి జగన్పై తీవ్రమైన ఆగ్రహాన్ని పెంచుకున్నారు. దీంతో ఆయన ఎన్నికల్లో చెమటోడ్చి పనిచేశారు.
మంత్రి అచ్చెన్నాయుడు కర్నూలులో...
కర్నూలు జిల్లాలో పార్టీ విజయానికి అక్కడి జిల్లా ఇన్చార్జి మంత్రి అచ్చెన్నాయుడు చేసిన కృషి పార్టీకి విజయాన్ని అందించింది. అక్కడ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బలంగా ఉన్న నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి సహకారం, అనుభవంతో పార్టీని విజయతీరాలకు చేర్చడంలో అచ్చెన్నాయుడు ముఖ్యపాత్ర పోషించారు. దాంతోపాటు ఇటీవల మృతి చెందిన భూమా వర్గీయులను సమన్వయం చేసుకోవడంలోనూ ఆయన విజయం సాధించారు.