నితీష్ వల్లే ఘోరాలు! హత్యలపై లాలూ పార్టీతో తేడాలు
పాట్నా: బీహార్లో నితీష్ కుమార్ - లాలూ ప్రసాద్ యాదవ్ పొత్తులో అప్పుడే చిచ్చు ప్రారంభమైనట్లుగా కనిపిస్తోంది. ఇటీవల ముగ్గురు అధికారులు హత్యకు గురైన విషయం తెలిసిందే. బీహార్లో నేరాలు తిరిగి పెరిగిపోవడంపై ఆర్జేడీ నేతలు నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని తప్పుబడుతున్నారు.
ఆర్జేడీ సీనియర్ నేత రఘువంశ్ ప్రసాద్ సింగ్ గురువారం మాట్లాడుతూ... బీహార్లో నేరాలు పెరుగుతున్నాయని, ఈ విషయంలో నితీష్ కుమార్ ఓసారి దృష్టి సారించాలని హితవు పలికారు. ఇటీవల ఇంజినీరింగ్ అధికారుల హత్య ద్వారా బీహార్లో శాంతిభద్రతలు సరిగా లేవని తెలుస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
నితీష్ కుమార్ డ్రైవర్ (ముఖ్యమంత్రి) సీటులో కూర్చున్నారని, కాబట్టి ఆయన వీటిపై దృష్టి సారించాలని చెప్పారు. వాహనం నడపడం డ్రైవర్ సీటులో కూర్చున్న వ్యక్తి కనీస బాధ్యత అని నితీష్ కుమార్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
ఆర్జేడీ నేత వ్యాఖ్యల పైన సీనియర్ జెడియూ నేత శ్యామ్ రజక్ తీవ్రంగా స్పందించారు. లా అండ్ ఆర్డర్ పైన ఎవరు కూడా నితీష్ కుమార్కు సూచనలు, సలహాలు ఇవ్వవలసిన అవసరం లేదని చెప్పారు.
కాగా, బిజెపి - జెడియూ హయాంలో క్రైం రేటు తగ్గింది. ఇప్పుడు లాలూ - నితీష్ ప్రభుత్వం వచ్చాక ఇటీవల ముగ్గురు ఇంజినీర్ల హత్యలు జరిగాయి. దీనిపై ఇటీవల బిజెపి మాట్లాడుతూ... బీహార్ రాష్ట్రంలో జంగిల్ రాజ్ 2 వచ్చిందని మండిపడింది.