కేసీఆర్ బంపరాఫర్: నటుడు సుమన్ తెరాసలో చేరుతారా?
రైతులకు తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇటీవల వరాలు ప్రకటించారు. రైతులకు ఎరువులు ఉచితంగా ఇస్తామని, రెండు పంటలకు ఇస్తామని చెప్పారు. ఏడాదికి రూ.4 వేలు నేరుగా రైతులకే బ్యాంకు అకౌంట్లలో వేస్తామన్నా
హైదరాబాద్: రైతులకు తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇటీవల వరాలు ప్రకటించారు. రైతులకు ఎరువులు ఉచితంగా ఇస్తామని, రెండు పంటలకు ఇస్తామని చెప్పారు. ఏడాదికి రూ.4 వేలు నేరుగా రైతులకే బ్యాంకు అకౌంట్లలో వేస్తామన్నారు.
దీనిపై ప్రముఖ నటుడు సుమన్ ప్రధానపాత్రలో ఓ షార్ట్ ఫిలిం రూపొందిస్తున్నారు. రైతులకు ఇది కేసీఆర్ ఇచ్చిన బంపరాఫర్ అని తెరాస నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రైతే రాజు అనే షార్ట్ ఫిలిం తీస్తున్నారు.
రైతే రైజు షార్ట్ ఫిలిం
ఇందులో ప్రధాన పాత్రలో నటుడు సుమన్ నటిస్తున్నారు. రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రైతే రాజు షార్ట్ ఫిలిం షూటింగ్ ప్రారంభమైంది. మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించారు.
అయిదు నిమిషాల వీడియో
అయిదు నిమిషాల నిడివి గల రైతే రాజు షార్ట్ ఫిలింను శ్రీధర్ డైరెక్ట్ చేస్తున్నారు. షార్ట్ ఫిలింలో సుమన్ వ్యవసాయ అధికారి పాత్రలో కనిపించనున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయ పథకాలపై షార్ట్ ఫిలిం ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
జూన్లో ప్రతి థియేటర్లో
జూన్ మొదటి వారంలో ఈ షార్ట్ ఫిలిం విడుదల కానుంది. షార్ట్ ఫిలింను అన్ని థియేటర్లలో ప్రదర్శిస్తారు. తెలంగాణ ఉద్యమం సమయంలో నటుడు సుమన్ మద్దతు పలికిన విషయం తెలిసిందే.
అందరికీ చేరాలని..
కేసీఆర్ రైతులకు రూ.17వేల కోట్ల రుణాలను మాఫీ చేశారు. తాజాగా ఎరువులు ఉచితంగా ఇస్తామని చెప్పారు. వీటిని షార్ట్ ఫిలిం ద్వారా చూపిస్తే అది జనాలు, రైతుల్లోకి సులభంగా వెళ్తుందని పార్టీ క్యాడర్ భావిస్తోంది.
తెరాసలో చేరుతారా?
కాగా, సుమన్ కొద్ది రోజుల క్రితం మాట్లాడుతూ తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. కానీ ఎక్కడి నుంచి పోటీ చేస్తానో ఇప్పుడే చెప్పలేనని అన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో మద్దతిచ్చిన సుమన్.. ఇప్పుడు కేసీఆర్ కోసం షార్ట్ ఫిలింలో నటిస్తున్న సుమన్.. తెరాసలో చేరి తెలంగాణ నుంచి పోటీ చేయవచ్చునని అంటున్నారు.