చంద్రబాబుకు ఐడియాలిస్తుందెవరో : గో మూత్రాన్ని వదల్లేదు
ప్రత్యేక హోదాపై సందిగ్ఘం.. వస్తుందో రాదో తెలియదు. ఓవైపు ఖాళీ అవుతున్న రాష్ట్ర ఖజానా. అంతంత మాత్రం ఆర్థిక పరిస్థితితో రాష్ట్రాన్ని నెట్టుకురావడం తలకు మించిన భారం. కేంద్రం మొండిచెయ్యి చూపిన వేళ ఇక మిగిలింది ఒకే ఒక్క అవకాశం. సొంతంగా ఆర్థిక పరిస్థితులను చక్కబెట్టుకోవడం మినహా ఏపీ సర్కార్ కు మరో గత్యంతరం లేదు.
దీంతో ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై దృష్టి సారించిన ఏపీ ప్రభుత్వం, పన్నుల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకునే ప్రయత్నంలో దేశంలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రం అమలు పరచని విధానాల వైపు మొగ్గు చూపుతోంది. ఇందులో భాగంగానే తాజాగా గో మూత్రంపై ఏపీ ప్రభుత్వం పన్ను విధించడం చర్చనీయాంశంగా మారింది.
ఖజానా నింపుకునేందుకు ఏ మార్గాన్ని విడిచిపెట్టొద్దని యోచిస్తున్న ప్రభుత్వం ఇప్పటికే పెట్రోల్, డీజిల్ పై పన్ను రేటును పెంచిన విషయం తెలిసిందే. కాగా.. గో మూత్రాన్ని కూడా కమర్షియల్ వస్తువుల వినియోగంలో విరివిగా వాడుతున్నందు వల్ల గో మూత్రంపై కూడా పన్ను విధించాలని నిర్ణయించుకుంది ప్రభుత్వం.
1940 లో రూపొందించిన డ్రగ్స్ అండ్ కాస్మోటిక్ చట్టం ప్రకారం.. గో మూత్రంతో ఔషధ వస్తువుల తయారీకి అనుమతి పొందిన ఆయుర్వేద, హోమియోపతి కంపెనీలన్ని పన్ను కట్టాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. ప్రస్తుత నిత్యవసరాలైన సబ్బులు, షాంపులు, పినాయిల్ వంటి వాటిలో గో మూత్రాన్ని విరివిగా ఉపయోగిస్తున్నారు. దీంతో గో మూత్రంపై పన్ను విధించడం ద్వారా ఆర్థికంగా ఖజానాకు లాభమేనన్న ధోరణిలో ప్రభుత్వం ఉంది.
అయితే దేశంలో ఇంతవరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో, ప్రభుత్వ నిర్ణయం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. తాజా పన్ను ద్వారా గో మూత్రంపై సగటున నాలుగు రూపాయల వరకు పన్ను విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ప్రభుత్వ పన్నుతో గో మూత్రంతో తయారయ్యే వస్తువుల ధరలు కూడా పెరిగే సూచనలున్నాయి.