తప్పు చేశా, క్షమించండి: రైతు ఆత్మహత్యపై కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా లెఫ్ట్ పార్టీల మార్గంలో నడుస్తున్నట్లుగా కనిపిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. తొలుత పొరపాటు చేయడం, ఆ తర్వాత దానికి క్షమాపణ చెప్పడం కేజ్రీవాల్కు కూడా పరిపాటిగా మారిందని అంటున్నారు. తాజాగా రాజస్థాన్ రైతు గజేంద్ర సింగ్ ఆత్మహత్య విషయంలో కేజ్రీవాల్ తన పొరపాటను అంగీకరించారు.
రైతు ఆత్మహత్య అనంతరం కూడా ర్యాలీలో తాను తన ప్రసంగాన్ని కొనసాగించడం తాను చేసిన తప్పిదమని చెప్పారు. గతంలో 49 రోజుల ముఖ్యమంత్రిగా ఉండి, రాజీనామా చేసిన కేజ్రీవాల్... అనంతరం జరిగిన ఎన్నికల సమయంలో, తాను రాజీనామా చేసి తప్పు చేశానని, ఈసారి అవకాశమిస్తే అలా చేయనని చెప్పారు. తాజాగా రైతు ఆత్మహత్యపై ఆయన తాను పొరపాటు చేశానని చెప్పారు.
ఆయన శుక్రవారం నాడు మాట్లాడుతూ.. గజేంద్ర సింగ్ ఆత్మహత్యకు పాల్పడుతున్న విషయం తెలిసి కూడా తాను తన ప్రసంగాన్ని కొనసాగించడం పొరపాటే అన్నారు. ఇందుకు తాను క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. తన తీరుతో ఎవరి మనోభావాలనైనా గాయపరిస్తే అందుకు తాను క్షమాపణ కోరుతున్నానని అన్నారు. నేను తప్పు చేశానని వ్యాఖ్యానించారు. విషయం తెలియగానే ర్యాలీని ఆపేస్తే బాగుండేదన్నారు.
అయితే, అక్కడ ఏం జరుగుతుందో తాను కచ్చితంగా తెలుసుకోలేకపోయానని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తమ ర్యాలీ వేదిక నుండి ఆ చెట్టు చాలా దూరంలో ఉందని, ఆ చెట్టుకు ఉన్న పలు శాఖల వల్ల అసలేం జరుగుతోందో స్పష్టంగా అర్థం కాలేదని చెప్పారు. అక్కడ తొక్కిసలాటగా కనిపించిందన్నారు. ఈ విషయంలో ఎవరిని నిందించాల్సిన అవసరం లేదని కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. అలాగే పోలీసులను కూడా నిందించలేమన్నారు.