యుద్ధం వస్తే మేం రెడీ, భారత్కు దెబ్బే: పాక్ హెచ్చరిక
కరాచీ: భారత్ తమ పైన యుద్ధానికి దిగితే దానిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, అయితే ఆ దేశం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖావాజా మహమ్మద్ ఆసిఫ్ అన్నాడు. భారత్ భారీ మూల్యం చెల్లించుకుంటుందని, దానిని కొన్ని దశాబ్దాల పాటు మర్చిపోవడం అసాధ్యమన్నాడు.
ఒకవేళ భారత్ కనుక తమ దేశంపై బలవంతంగా యుద్ధాన్ని రుద్దితే అది దశాబ్దాల పాటు మరిచిపోలేనంతగా చావుదెబ్బ తీస్తామని పాక్ రక్షణ మంత్రి ఖావాజా ఆదివారం హెచ్చరించాడు. పాకిస్తాన్ సైన్యాలు ఎన్ని కష్టాలు ఎదురైనా తమ మాతృభూమిలో ప్రతి అంగుళాన్ని కాపాడి తీరుతారన్నాడు.
అంతర్జాతీయ సరిహద్దును ఆనుకుని ఉన్న కుందున్పూర్ గ్రామాన్ని సందర్శించిన సందర్భంగా మీడియాతో మాట్లాడాడు. పాకిస్తాన్లో ఉగ్రవాదాన్ని భారత్ సమర్థిస్తోందని, అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ వెంబడి ఎలాంటి కవ్వింపు లేకుండానే కాల్పులకు పాల్పడ్డం ద్వారా సరిహద్దుల్లో ఉద్రిక్తతలను సృష్టిస్తోందని, ఫలితంగా భారత్ నిజస్వరూపం బట్టబయలయిందని అన్నాడు.
సరిహద్దుల్లో ఉద్రిక్తతలను సృష్టించడం ద్వారా అంతర్గత వైఫల్యాలనుంచి దేశ ప్రజల దృష్టిని మళ్లించడానికే భారత్ ప్రయత్నిస్తోందని ఆరోపించాడు.
తమ దేశ వ్యవహారాల్లో భారత్ జోక్యానికి సంబంధించి పాకిస్తాన్ వద్ద సాక్ష్యాధారాలున్నాయని, ఈ సాక్ష్యాధారాలను ప్రధాని నవాజ్ షరీఫ్ సెప్టెంబర్లో జరగనున్న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో, అక్టోబర్లో తన అమెరికా పర్యటన సందర్భంగా అక్కడి ప్రభుత్వానికి అందజేస్తారన్నాడు.