మోడీపై 'గురుదక్షిణ' ఒత్తిడి: రాష్ట్రపతిగా అద్వానీ?
ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో అద్భుత విజయం సాధించిన బీజేపీ ఇతర రాష్ట్రాలపై దృష్టి సారించింది. అదే సమయంలో రాష్ట్రపతి ఎన్నికలపై కేంద్రీకరించింది.
న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో అద్భుత విజయం సాధించిన బీజేపీ ఇతర రాష్ట్రాలపై దృష్టి సారించింది. అదే సమయంలో రాష్ట్రపతి ఎన్నికలపై కేంద్రీకరించింది.
రాష్ట్రపతి ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు పావులు కదుపుతోంది. అన్నాడీఎంకే, బీజేడీ తదితరుల మద్దతుతో మిత్రపక్షాలు మెచ్చే అభ్యర్థిని బరిలోకి దింపాలని చూస్తోంది.
పార్టీకి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్: 22-16తో విశ్వాస పరీక్షలో నెగ్గిన మనోహర్ పారికర్
ప్రణబ్ ముఖర్జీ జూలై నెలలో రిటైర్ అవుతున్నారు. ఆ సమయంలో ఎన్నికలు జరుగుతాయి. దీంతో బీజేపీకి ఆ పార్టీ అగ్రనేత ఎల్కే అద్వానీ సరైన నేతగా కనిపిస్తున్నారు. ఆద్వానీని బరిలోకి దింపితే నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ కూడా మద్దతు ఇచ్చే విషయాన్ని కొట్టిపారేయలేమని అంటున్నారు.
అద్వానీకే ఛాన్స్
బిజెపి అద్వానీ దక్కే అవకాశాలు మెరుగయ్యాయి. ఆయనకు రాష్ట్రపతి పదవిని బహుమతిగా ఇవ్వడాన్ని గురుదక్షిణగా భావిస్తానని ప్రధాని నరేంద్ర మోడీ తన సన్నిహితుల వద్ద చెప్పినట్లుగా తెలుస్తోందని వార్తలు వస్తున్నాయి.
ఆ సమయంలో హామీ
ప్రధాని మోడీ ఈ నెల 8న గుజరాత్లోని సోమనాథ్ ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు. ఇందులో అద్వానీతో పాటు, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కేశూభాయ్ పటేల్ కూడా పాల్గొన్నారు. ఆ సందర్భంగా వారి మధ్య రాష్ట్రపతి ప్రస్తావన వచ్చిందని, సోమనాథుడి సాక్షిగా అద్వానీని రాష్ట్రపతిగా చేస్తానని ప్రధాని చెప్పారని తెలుస్తోంది.
నాడు మోడీకి అద్వానీకి మధ్య పోటీ
నిజానికి 2014 ఎన్నికల సమయంలో ప్రధాని అభ్యర్థిగా అద్వానీ, మోడీ మధ్య పోటీ కనిపించింది. ఆ సమయంలో ఆరెస్సెస్ జోక్యం చేసుకొని బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రపతి పదవిని అద్వానీకి కట్టబెట్టాలని నిర్ణయించి ఆయనను బుజ్జగించినట్లుగా ప్రచారం జరిగింది.
మోడీపై ఒత్తిడి
ఇప్పుడు యూపీలో 325 సీట్లు గెల్చుకోవడంతో రాష్ట్రపతిగా తనకు నచ్చిన వ్యక్తినే చేసే అవకాశం మోడీకి దక్కనుంది. వాస్తవానికి బీజేపీలో పలువురు నేతలు రాష్ట్రపతి పదవి రేసులో ఉన్నారు. అయినప్పటికీ గతంలో ఇచ్చిన హామీ మేరకు అద్వానీకే ఆ కట్టకట్టబెట్టాలని ఆరెస్సెస్ నేతలు మోడీపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది.
బీజేపీ ఎదుగుదలలో అద్వానీ
పార్లమెంటులో కేవలం రెండు స్థానాలున్న బీజేపీని 200 స్థానాలకు పైగా తీసుకెళ్లడంలో కీలకపాత్ర వహించిన అద్వానీకి దేశ అత్యున్నతపదవి ఇచ్చి సముచితంగా గౌరవించాల్సిన అవసరం ఉందని అనుచరులు గుర్తు చేస్తున్నారు.
అద్వానీకి కృతజ్ఞత
వీటన్నింటి నేపథ్యంలో అద్వానీ ఈ ఏడాది జూలైలో రైజినా హిల్స్లోని రాష్ట్రపతి భవన్లోకి అడుగు పెట్టబోతున్నారని బీజేపీ నేతలు చెబుతున్నారు. బీజేపీలో తన ఎదుగుదలకు నిరంతరం సాయం చేసిన అద్వానీ పట్ల కృతజ్ఞత చూపాల్సిన సమయం వచ్చిందని మోడీ తన అనుయాయుల వద్ద చెబుతున్నట్లుగా తెలుస్తోంది.