ప్రశాంతంగా జగన్: కోర్టు విశ్వసనీయతపై ఆంధ్రజ్యోతి దెబ్బ?
జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ సిబిఐ దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేతపై ఆంధ్రజ్యోతి రాసిన వార్తాకథనం చర్చనీయాంశంగా మారింది.
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ బెయిల్ను రద్దు చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే. అయితే, ఆ విషయం జగన్కు ముందే తెలుసా అంటూ ఆంధ్రజ్యోతి దినపత్రిక ఓ వార్తాకథనం రాసింది. దానిపై ఇప్పుడు చర్చ సాగుతోంది.
పదిహేను రోజుల పాటు న్యూజిలాండ్ పర్యటన చేసేందుకు కూడా కోర్టు జగన్కు అనుమతి ఇచ్చింది. బెయిల్ రద్దుకు దర్యాప్తు అధికారులు సరైన కారణాలు చూపించలేకపోయారంటూ కోర్టు పిటిషన్ను కొట్టేసింది. అక్రమాస్తుల కేసులో జగన్కు న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ను గతంలో మంజూరు చేింది.
అయితే, కోర్టు ఆదేశాలకు భిన్నంగా జగన్ వ్యవహరిస్తున్నారని, బెయిల్ షరతులను ఉల్లంఘించారని ఆరోపిస్తూ ఆయన బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ దర్యాప్తు అధికారుల కొద్ది రోజుల క్రితం సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ను శుక్రవారం కోర్టు కొట్టేసింది.
ఆ సమయంలో ప్రశాంతంగా జగన్
బెయిల్ రద్దు పిటిషన్పై సిబిఐ కోర్టు తన నిర్ణయాన్ని వెలువరించనున్న నేపథ్యంలో జగన్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు విజయసాయి రెడ్డి శుక్రవారం ఉదయమే కోర్టుకు చేరుకున్నారు. కోర్టు ఉత్తర్వులు జగన్కు అనుకూలంగా ఉంటాయా, ప్రతికూలంగా ఉంటాయా అనే ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో అంతా ఆసక్తిగా ఎదురు చూశారని, కానీ జగన్ మాత్రం ప్రశాంతంగా కనిపించారని ఆంధ్రజ్యోతి వార్తాకథనం వ్యాఖ్యానించింది.
ముందే తెలుసా అంటూ...
కోర్టు తన బెయిల్ను రద్దు చేసే అవకాశం లేదని జగన్కు ముందే తెలుసు అన్నట్లుగా జగన్కు ముందే తెలుసా అంటూ ఓ శీర్షికను పెట్టి జగన్కు ఊరట పేరు మీద ఆంధ్రజ్యోతి మీడియా వార్తాకథనాన్ని ఇచ్చింది. అందులో జగన్ ప్రశాంతంగా కనిపించారని మాత్రమే రాసింది. శీర్షికను, ప్రశాంతంగా కనిపించడాన్ని అన్వయించుకుంటే ఆంధ్రజ్యోతి కథనం ఉద్దేశం అర్థమవుతుంది.
అది కోర్టు విశ్వసనీయతను సందేహించడమేనా.....
కోర్టుపై అనుమానాలు వచ్చే విధంగా ఆంధ్రజ్యోతి కథనం సాగిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కోర్టును అకారణంగా, అనవసరంగా, అసమంజసంగా సందేహించడమేనని, కోర్టు విశ్వసనీయతను దెబ్బ తీయడమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏదో జరిగింది... అందుకే బెయిల్ రద్దు పిటిషన్ను కోర్టు కోట్టేసిందని అర్థం వచ్చే విధంగా ఆంధ్రజ్యోతి కథనం సాగిందనే విమర్శలు వినిపిస్తన్నాయి.
రమాకాంత్ రెడ్డి ఇంటర్వ్యూ...
జగన్ అక్రమాస్తుల కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమాకాంత్ రెడ్డి ఇంటర్వ్యూను జగన్ మీడియా సంస్థల్లో ప్రసారం చేశారని, సాక్షులను ప్రభావితం చేసేలా వ్యవహరించారని దర్యాప్తు అధికారులు తమ పిటిషన్లో ఆరోపించారు.. జగన్ తన మీడియాలో ఉద్దేశపూర్వకంగానే రమాకాంత్ రెడ్డి ఇంటర్వ్యూ ఇప్పించారని, దర్యాప్తు సంస్థ ప్రతిష్ఠ దెబ్బతీసేలా, సాక్షుల్ని ప్రభావితం చేసేలా ఆయన ఇంటర్వ్యూలో మాట్లాడారని కోర్టుకు విన్నవించుకున్నారు.
జగన్ తరఫు వాదన ఇలా...
బెయిల్ షరతులను జగన్ అతిక్రమించలేదని, దర్యాప్తు అధికారులు ఉద్దేశపూర్వకంగా బెయిల్ రద్దు కోరుతున్నారని ఆయన తరపు న్యాయవాదులు కోర్టులో వాదించారు. రమాకాంత్ రెడ్డి ఇంటర్వ్యూ ప్రసారం విషయంలో జగన్ ప్రమేయం లేదని, ఎడిటోరియల్ బోర్డు నిర్ణయం మేరకు కార్యక్రమాలు ప్రసారమవుతాయని తెలిపారు.
అలా భావించడం లేదని...
సీబీఐ, జగన్ తరపు న్యాయవాదుల వాదనలు విన్న న్యాయమూర్తి శుక్రవారం తన తుది నిర్ణయాన్ని వెలువరిస్తూ సిబిఐ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయిలో పని చేసిన రమాకాంత్ రెడ్డిని ప్రభావితం చేసి ఇంటర్వ్యూ ఇప్పించి ఉంటారని తాము భావించడం లేదని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. అయినా, బెయిల్ రద్దుకు దర్యాప్తు అధికారులు సరైన కారణాలు చూపలేదని స్పష్టం చేశారు.