చిరంజీవి బాటలోనే పవన్, ఆ భయంతోనే నంద్యాలలో తటస్థ వైఖరి!
నంద్యాల: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాంప్రదాయ రాజకీయాలకు జనసేన చెక్ పెట్టనుందా? రానున్న రోజుల్లో ఇతర పార్టీలకు తమ పార్టీకి ఉన్న తేడాను ప్రజలకు చాటిచెప్పే ఉద్దేశ్యంతోనే జనసేన చీఫ్ పవన్కళ్యాణ్ వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నారు.
జనసేన ఇతర పార్టీల కంటే భిన్నమైందని, అందుకే జనసేనకు ఓట్లు వేయాలనే నమ్మకాన్ని కల్గించే దిశగా పవన్ కళ్యాణ్ స్ట్రాటజీని అమలు చేస్తున్నారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయంతో ఉన్నారు.
మౌనిక ప్రకటించిన 3 రోజులకే, భూమా ఫ్యామిలీకి పవన్ షాక్, టిడిపికి దెబ్బేనా?
దీనికి తోడు నంద్యాల ఉప ఎన్నికల్లో టిడిపి అభ్యర్థికి మద్దతిస్తే ప్రభుత్వానికి అనుకూలంగా నిర్ణయం తీసుకొన్నట్టుగా మారే అవకాశం ఉంది. దీంతో రాజకీయంగా తనకు రానున్న రోజుల్లో ఇబ్బందనే పరిస్థితి వస్తోందని భావించి పవన్ తటస్థ వైఖరిని తీసుకొన్నారనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.
నంద్యాల: 2009లో 'పిఆర్పి' అభ్యర్థికి 35 వేల ఓట్లు, 'పవన్' మద్దతు కీలకం
జనసేన చీఫ్ పవన్ వైఖరి మాత్రం ప్రస్తుతం నంద్యాల ఉప ఎన్నికల్లో చర్చనీయాంశంగా మారింది. పార్టీని క్షేత్రస్థాయి నుండి బలోపేతం చేసిన తర్వాతే ఎన్నికల రంగంలోకి అడుగుపెట్టాలని పవన్కళ్యాణ్ భావిస్తున్నారు. 2019 నాటికి ఎలాంటి ఎన్నికల్లో పోటీచేయబోనని కూడ ప్రకటించారు.
సాంప్రదాయ రాజకీయాలకు చెల్లుచీటి?
సాంప్రదాయ రాజకీయాలకు దూరమనే సంకేతాలను పంపే దిశగా పవన్ అడుగులు వేశారని రాజకీయ విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం టిడిపి, వైసీపీల మధ్య పోటాపోటీ వాతావరణం నెలకొంది. 2019 ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్య తీవ్రమైన పోటీ ఉండే అవకాశం నెలకొంది. అదే సమయంలో రాష్ట్రంలో తృతీయ కూటమి ఏర్పడే అవకాశాలు కన్పిస్తున్నాయి. అయితే వామపక్షాలు, జనసేన కలిసి మూడో ఫ్రంట్ ఏర్పాటు దిశగా చర్చలు సాగుతున్నాయి. ఈ మేరకు జనసేన చీఫ్ పవన్కళ్యాణ్ కూడ సానుకూల సంకేతాలను పంపారు. అయితే రానున్న రోజుల్లో సాంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా తమ పార్టీ వ్యవహరించే దిశగా పవన్ అడుగులు వేస్తున్నారు. రెండు బలమైన పార్టీల మధ్య కొత్తగా రాజకీయ రణక్షేత్రంలోకి అడుగుపెట్టే పార్టీకి ఎందుకు ఓట్లు వేయాలో ప్రజలకు ఇప్పటి నుండే సంకేతాలను ఇచ్చే దిశగా పవన్ చర్యలను తీసుకొంటున్నారు.
Recommended Video
చిరంజీవి దారిలోనే పవన్
2009 ఎన్నికలకు ముందు పిఆర్పిని సినీ నటుడు చిరంజీవి ఏర్పాటు చేశారు. ఈ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లో చిరంజీవి కూడ పోటీ చేయలేదు. సోదరుడు చిరంజీవి చూపిన దారిలోనే పవన్ కూడ పయనించారనిపిస్తోంది. సాధారణ ఎన్నికలే లక్ష్యమని చిరంజీవి ఆ సమయంలో ప్రకటించారు. దాదాపు అదే ప్రకటనను పవన్కళ్యాణ్ చేశాడు. 2019 ఎన్నికల వరకు తమ పార్టీ ఏ ఎన్నికల్లో కూడ పోటీచేయబోదని ప్రకటించారు.
ప్రభుత్వ అనుకూల ముద్ర నుండి తప్పించుకొనేందుకేనా?
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అందరి అంచనాలకు భిన్నంగా నంద్యాలలో తటస్థ వైఖరిని ప్రకటించారు. నంద్యాల ఉప ఎన్నికలో ఏ అభ్యర్థిని బలపరిస్తే ఏ సమస్య వస్తుందోనన్న సందేహంతోనే ఆయన తటస్థ వైఖరిని ఎంచుకొన్నారన్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వినవస్తున్నాయి. జనసేన పార్టీ ఏర్పాటు తర్వాత తనది భిన్నమైన పంథా అని చాటడానికి పవన్ గట్టి ప్రయత్నం చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చిన ఆయన ఆ తర్వాత అవే ప్రభుత్వాలపై నిరసన గళం విప్పడానికి వెనకాడలేదు. ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంపై విరుచుకుపడ్డారు. మూడేళ్ళుగా ప్రభుత్వంపై విరుచుకుపడిన పవన్...నంద్యాల ఎన్నికల్లో టిడిపి అభ్యర్థికి మద్దతిస్తే తీవ్రమైన నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని భావించి తటస్ఠ వైఖరిని తీసుకొన్నారని విశ్లేషకుల అంచనా.
బంధుత్వాలు, మిత్రుత్వాలకు చెక్
ప్రజల పక్షాన తాను ప్రశ్నిస్తానని జనసేన చీఫ్ పవన్కళ్యాణ్ పార్టీ ఏర్పాటు చేసిన సందర్భంగా ప్రకటించారు. మూడేళ్ళ టిడిపి పాలనలో ప్రజల ఆందోళనకు తాను కూడ గొంతు కలిపారు. రాజధానికి భూముల సేకరణ విషయంలో ప్రభుత్వ వైఖరికి భిన్నంగా ఆ ప్రాంతంలో పర్యటించి భూములు ఇవ్వడానికి నిరాకరించిన రైతులకు మద్దతు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో రొయ్యల ప్రాసెసింగ్ పరిశ్రమ ఏర్పాటు విషయంలో కూడా ప్రభుత్వ వైఖరితో విభేదిస్తూ వామపక్షాల పోరాటానికి మద్దతు తెలిపారు. ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలపైనా ఒత్తిడి పెంచారు. ఆయా అంశాల్లో రాజకీయ మిత్రత్వాలతో సంబంధం లేకుండా తన అభిప్రాయాలను భావోద్వేగంతో మిళితం సూటిగా చెప్పారు. పవన్ ఏం చెప్పినా ఒక ఎమోషన్తో బలంగా చెబుతారని... దాగుడుమూతలు ఉండవన్న అభిప్రాయాన్ని కలిగించారు.ప్రజలకు నష్టం కలిగితే మిత్రులైనా, బంధువులైనా తాను చెప్పాల్సింది చెప్పేస్తాడనే అభిప్రాయాన్ని పవన్ కల్గించాడు. పిఆర్పిని కాంగ్రెస్లో విలీనం చేసే సమయంలో పవన్ తీవ్రంగా వ్యతిరేకించాడని చెబుతారు. ఈ కారణంతోనే చిరంజీవితో విబేధించారని పవన్ సన్నిహితులు చెబుతారు. మరో వైపు నంద్యాలలో టిడిపి తరపున పోటీలో ఉన్న భూమా కుటుంబానికి తనతో ఉన్న సాన్నిహిత్యాన్నికూడ పవన్ పక్కన పెట్టారని అంటున్నారు విశ్లేషకులు.