జూ. ఎన్టీఆర్ ఔట్: సీనియర్లూ నారా లోకేష్ పాటే
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ గత మహానాడుకు బుధవారంనాడు హైదరాబాదులో ప్రారంభమైన మహానాడుకు మధ్య కొట్టొచ్చినట్లు కనిపించే ప్రత్యేక ఒకటుంది. రాష్ట్ర విభజన తర్వాత జరుగుతున్న తొలి మహానాడు ఇది. దానికితోడు, నందమూరి వంశానికి ప్రాధాన్యత పూర్తిగా తగ్గిపోవడం ఈ మహానాడు ప్రత్యేకత. గత మహానాడులోనే చంద్రబాబు తన తనయుడు నారా లోకేష్కు కీలక బాధ్యతలు అప్పగిస్తారని భావించారు. కానీ, లోకేష్ ఫ్లెక్సీల పట్టనే అప్పట్లో ఎన్టీ రామారావు తనయుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దాంతో చంద్రబాబు తనయుడి విషయంలో వెనక్కి తగ్గారు.
అయితే, ఈసారి నారా లోకేష్కు ఎటు నుంచి కూడా వ్యతిరేకత కనిపించడం లేదు. జూనియర్ ఎన్టీఆర్, నారా లోకేష్లకు మధ్య పార్టీ పగ్గాలు చేపట్టే విషయంలో తీవ్ర సమరం సాగినట్లు అప్పట్లో అనిపించింది. కానీ, జూనియర్ ఎన్టీఆర్ పూర్తిగా దూరం కావడమే కాకుండా నందమూరి వంశానికి పార్టీపై పట్టు కూడా లేని స్థితి వచ్చేసింది. ఎన్టీ రామారావు తనయుడు నందమూరి బాలకృష్ణ పార్టీలో ఉన్నా ఆయన పార్టీని తన చేతుల్లోకి తీసుకోవడానికి ఏ విధమైన ప్రయత్నాలు సాగించడం లేదని అర్థమవుతూనే ఉన్నది.
ఆయన పూర్తిగా చంద్రబాబుకు, తన అల్లుడు నారా లోకేష్కు అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తున్నారు. బుధవారంనాడు నందమూరి హరికృష్ణ మహానాడు ప్రాంగణానికి వచ్చినప్పటికీ సాధారణమైన స్థితిలోనే ఉండిపోయారు. జూనియర్ ఎన్టీఆర్ను పూర్తిగా పక్కకు తప్పించి, నారా లోకేష్ను పార్టీ తెర మీదికి తేవడంలో చంద్రబాబు విజయం సాధించారనే అంటున్నారు. ఈ స్థితిలో పార్టీ సీనియర్ నాయకులు కూడా లోకేష్ పాటే పాడుతున్నారు. పార్టీలో లోకేష్కు కీలకమైన బాధ్యతలు అప్పగించాలని వారు కోరుతున్నారు.
తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్కు పార్టీ కేంద్రకమిటీ జనరల్ సెక్రటరీ పదవి ఇవ్వాలని ఏపీ టీడీపీ నేత కళా వెంకట్రావు అన్నారు. రెండు రాష్ర్టాల్లో పార్టీని నడిపించేలా లోకేష్కు బాధ్యతలు అప్పగించాలని ఆయన తెలిపారు. సీఎం చంద్రబాబు ఆశిస్తే ఏ పదవినైనా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కళా వెంకట్రావు స్పష్టం చేశారు. లోకేష్కు పార్టీలో కీలకమైన బాధ్యతలు అప్పగించాలని ఆంధ్రప్రదేశ్ పార్టీ మరో నాయకుడు పయ్యావుల కేశవ్ కూడా అన్నారు.
తెలుగుదేశం పార్టీ తెలంగాణ నాయకులు కూడా అదే పాట పాడుతున్నారు. పార్టీలో నారా లోకేష్కు కీలకమైన బాధ్యతలు అప్పగించాలని తెలుగుదేశం తెలంగాణ సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు ఇప్పటికే అన్నారు. ఆ రకంగా నారా లోకేష్కు అనుకూలంగా పార్టీ నాయకుల అభిప్రాయాన్ని కూడగట్టడంలో చంద్రబాబు విజయం సాధించారని అంటున్నారు. తాను ఏకపక్షంగా చేసినట్లు కాకుండా నాయకుల అభిప్రాయం మేరకే లోకేష్కు బాధ్యతలు అప్పగించానని అనిపించుకోవడానికి ఆయన తగిన వ్యూహాన్ని ఖరారు చేసి అమలు చేస్తున్నట్లు భావిస్తున్నారు.
కాగా, తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీగా మారనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నించడానికి టిడిపిని జాతీయ పార్టీగా మారుస్తున్నారు. పార్టీ జాతీయాధ్యక్షుడిగా చంద్రబాబు నియమితులు కావడం లాంఛనమే అయినప్పటికీ లోకేష్కు ఏ విధమైన బాధ్యతలు అప్పగిస్తారనేది ఆసక్తిగా మారింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు విడివిడిగా అధ్యక్షులను నియమించే అవకాశం ఉంది. మొత్తం మీద, తెలుగుదేశం పార్టీ పగ్గాలు పూర్తిగా నందమూరి వంశం నుంచి జారిపోయి, నారా వంశం చేతుల్లోకి వచ్చినట్లే.
నారా లోకేష్ రెండు రాష్ట్రాల పార్టీ బాధ్యతలను తీసుకోవాల్సి ఉంటుంది. ఈ స్థితిలో ఆయనను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమిస్తారా, లేదంటే కళా వెంకట్రావు చెప్పినట్లు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి పదవిలో నియమిస్తారా అనేది తేలాల్సి ఉంది. పదవి పేరు ఏదైనప్పటికీ పార్టీ కార్యకలాపాలు, నిర్వహణా బాధ్యతను పూర్తిగా నారా లోకేష్కు ఈ మహానాడులో అప్పగించే అవకాశం ఉంది.