కాశ్మీర్పై కలలు వద్దు, అది జరగదు: పాక్కు అమిత్ షా
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా పాకిస్థాన్ పైన తీవ్రంగా మండిపడ్డారు. కేరళలోని కోజికోడ్లో జరుగుతున్న చివరి రోజు బిజెపి జాతీయ మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. కాశ్మీర్ మాది అని, దానిని తీసుకోవాలని కలలు కనవద్దన్నారు.
బిజెపి ఉండగా అది జరగదన్నారు. అన్ని పార్టీలు ఏకమై ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని ఆయన పిలుపును ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్లోని యూరి సెక్టార్ సైనిక స్థావరంపై జరిగిన ఉగ్రదాడిని అమిత్ షా తీవ్రంగా ఖండించారు.
కాశ్మీర్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ కామని చెప్పారు. పాకిస్తాన్ బహిరంగంగా ఉగ్రవాదానికి మద్దతు పలుకుతోందన్నారు. తీవ్రవాదాన్ని సహించమని చెప్పారు. తమ నుంచి గట్టి సమాధానం ఉంటుందన్నారు.
ఐక్య రాజ్య సమితి సమావేశంలో పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీష్.. హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది బుర్హాన్ వానిని ప్రశంసించడాన్ని ఈ సందర్భంగా ఆయన తప్పుబట్టారు. నవాజ్ షరీఫ్ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నారన్నారు.
పాక్ ఏకాకి
ఐక్య రాజ్య సమితిలో కాశ్మీర్ను అంతర్జాతీయ సమస్య చేయడానికి పాకిస్తాన్ నెలలుగా చేసిన ప్రయత్నాలకు ఐరాసలో ప్రపంచ దేశాల నుంచి ఎలాంటి ప్రతిస్పందనా లభించలేదని, పెరిగిపోతున్న ఉగ్రవాదం పైనే ప్రపంచ దేశాలన్నీ దృష్టి పెట్టాయని ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ వేరుగా అన్నారు.
భారత్ ఎదుర్కొంటున్న ఉగ్రవాదానికే ప్రపంచ దేశాలు ప్రతిధ్వనించాయే తప్ప పాకిస్తాన్ ప్రధాని తన ప్రసంగంలో ప్రస్తావించిన అంశంపై కాదన్నారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో జరిగిన చర్చల్లో ఇప్పటివరకు 131 దేశాలు మాట్లాడితే 130 దేశాలు పాకిస్తాన్ లేవనెత్తిన ప్రధాన సమస్యను ప్రస్తావించలేదని, అంటే దాని అర్థమేమిటని అక్బరుద్దీన్ అన్నారు.
ఐక్య రాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 71వ సమావేశంలో మాట్లాడిన దేశాల్లో 90 శాతం దేశాలు ఉగ్రవాదమే తమకు ప్రధాన సమస్య అని చెప్పాయని, ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో భారత్కు అండగా నిలుస్తున్న దేశాల సంఖ్య రానురాను పెరుగుతుండడంపై భారత్ ఆ దేశాలకు ఎంతగానో రుణపడి ఉందన్నారు.