సింధు కోసం ఏపీ ఇలా, తెలంగాణ అలా: అదే తేడా!
విజయవాడ/హైదరాబాద్: రియో ఒలింపిక్స్లో బ్యాడ్మింటన్లో రజతం సాధించిన తెలుగు తేజం పీవీ సింధు ఒక్కసారిగా స్టార్ అయ్యారు. ఆమెకు దేశం యావత్తు నీరాజనాలు పలుకుతోంది. ఆమెతో పాటు పతకం సాధించిన సాక్షి మాలిక్, అద్భుత ప్రతిభ కనబర్చిన దీపా కర్మాకర్ వంటి వారిని జాతి పొగుడుతోంది.
పీవీ సింధు తెలుగు అమ్మాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలు ఆమెను క్యాష్ చేసుకునేందుకు పోటి పడుతున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. నిన్న (సోమవారం) తెలంగాణ ప్రభుత్వం, నేడు (మంగళవారం) ఏపీ ప్రభుత్వం సింధుకు గ్రాండ్ వెల్కం చెప్పాయి.
పీవీ సింధు రియో ఒలింపిక్స్లో సత్తా చాటి భారత పతాకాన్ని ఎగురవేసింది. అయితే, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మాత్రం పైచేయి కోసం పోటాపోటీగా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లుగా కనిపిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి.
రివార్టులు
ఇరు ప్రభుత్వాలు కూడా పీవీ సింధుకు, కోచ్ గోపీచంద్కు పెద్ద ఎత్తున రివార్డులు ప్రకటించాయి. ఏపీ ప్రభుత్వం సింధుకు రూ.3 కోట్లు, గోపీచంద్కు రూ.50 లక్షలు నజరానా ఇవ్వగా, తెలంగాణ ప్రభుత్వం సిందుకు రూ.5 కోట్లు, గోపీచంద్కు రూ.1కోటి నజరానా ఇచ్చింది. అదేవిధంగా ఇరు ప్రభుత్వాలు తమ తమ రాజధానుల్లో (హైదరాబాద్, అమరావతి) సింధుకు 1000 గజాల స్థలం కేటాయించాయి.
భారీ ర్యాలి, ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాదులో, విజయవాడలో సింధుకు, గోపిచంద్కు గ్రాండ్ వెల్ కం లభించింది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు వీరిని భారీ మేళతాళాలతో తీసుకెళ్లారు. గచ్చిబౌలి స్టేడియంలో కళాకారులు నృత్య ప్రదర్శనలు చేశారు. ఏపీలోను మేళతాళాలు, కళాకారుల నృత్యాలు కనిపించాయి.
రోడ్డుపై ఘన స్వాగతం
తెలంగాణలో శంషాబాద్ విమానాశ్రయం నుంచి గచ్చిబౌలి వరకు ర్యాలీలో, ఏపీలో గన్నవరం నుంచి విజయవాడ వరకు ర్యాలీలో భారీగా విద్యార్థులు, క్రీడాభిమానులు రోడ్లకు ఇరువైపుల నిలబడి పూలజల్లు కురిపించారు.
మా ప్రభుత్వం వల్లే..
పీవీ సింధును, గోపిచంద్ను సత్కరించే సమయంలో ఇటు తెలంగాణ, అంటు ఏపీ నేతలు తమ తమ ప్రభుత్వాలు క్రీడలకు ఏం చేస్తున్నాయో చెప్పాయి. అంతేకాదు, పీవీ సింధు విజయం వెనుక ఎవరికి వారు... తామే ఉన్నామనే అభిప్రాయాలు వ్యక్తం చేయడం గమనార్హం.
ఇదే తేడా!
తెలంగాణలో పీవీ సింధు, గోపిచంద్లకు మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆధ్వర్యంలో సన్మానం జరిగితే, ఏపీలో మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు సన్మానం చేస్తున్నారు. ఇదొక్కటే తేడా. రియోలో భారత జాతి పతాకాన్ని ఎగురవేసిన పీవీ సింధును ఎవరికి వారు క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
భారతీయురాలు
పీవీ సింధు తెలంగాణ అమ్మాయి, ఏపీ అమ్మాయా అనే చర్చ సాగుతోందని, దీనిపై ఏమంటారని విలేకరులు ప్రశ్నిస్తే.. కోచ్ గోపీచంద్ ధీటైన సమాధానం ఇచ్చారు. ఆమె భారతీయురాలు అని స్పష్టం చేశారు.