కెసిఆర్ వ్యూహం: రాజయ్యకు తిరుగులేని దెబ్బ
హైదరాబాద్: మంత్రి పదవి నుంచి టి. రాజయ్యను తొలగించే విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పకడ్బందీ వ్యూహాన్ని రచించినట్లు అర్థమవుతోంది. దళిత వర్గానికి చెందిన రాజయ్యను తొలగించడం మాటలు కాదనే సంకేతాలను గతంలోనే అందుకున్న కెసిఆర్ పక్కా వ్యూహం ప్రకారం ఆయనను తొలగించారని అంటున్నారు. గతంలో రాజయ్యపై చేసిన వ్యాఖ్యకు దళిత వర్గాలు కెసిఆర్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయాలని కెసిఆర్ వరంగల్ సభలో గతంలో రాజయ్యను ఉద్దేశించి అన్నట్లు వార్తలు వచ్చాయి. వెంటనే దళిత వర్గాలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశాయి.
రాజయ్యను అంటుకుంటే దళిత వర్గాల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తుందని గమనించిన కెసిఆర్ పార్లమెంటు సభ్యుడు అయిన కడియం శ్రీహరిని అడ్డం పెట్టి, ఆ వ్యతిరేకత రాకుండా చూసుకున్నారని అంటున్నారు. నిజానికి, ఒక మంత్రిని తొలగించినప్పుడు లేదా మంత్రితో రాజీనామా చేయించినప్పుడు, ఆ ఖాళీని వెంటనే భర్తీ చేయాల్సిన అవసరం లేదు. అయితే, ఆఘమేఘాల మీద ఇటు రాజయ్యను మంత్రివర్గం నుంచి తొలగించి, కడియం శ్రీహరితో కెసిఆర్ ప్రమాణ స్వీకారం చేయించారు.
మరొకరికి ఆ మంత్రి పదవి ఇవ్వడానికి అవకాశం ఉన్నప్పటికీ కెసిఆర్ కడియం శ్రీహరినే ఎందుకు ఎంచుకున్నారనేది పలువురికి ఆశ్చర్యం కలిగించే విషయమే. పైగా, ఒకానొక సందర్భంలో ఉప ముఖ్యమంత్రి పదవికి కొప్పుల ఈశ్వర్ పేరు ముందుకు వచ్చింది. కొప్పుల ఈశ్వర్ కెసిఆర్కు సన్నిహితులు కూడా. కానీ, కొప్పుల ఈశ్వర్ను కాదని, కడియం శ్రీహరిని తీసుకు రావడంలోనే కెసిఆర్ వ్యూహమంతా ఉందని అంటున్నారు. రాజయ్యకు గానీ, దళిత వర్గాలకు కూడా గానీ మాట్లాడే అవకాశం లేకుండా పోయింది.
కడియం శ్రీహరి దళిత వర్గాల్లో అంటే ఎస్సీల్లో బైండ్ల వర్గానికి చెందినవారు. రాజయ్య మాదిగ వర్గానికి చెందిన నేత. కొప్పుల ఈశ్వర్ మాలవర్గనికి చెందిన నేత. రాజయ్యను తొలగించడం ద్వారా ఏర్పడిన ఖాళీని కొప్పుల ఈశ్వర్ ద్వారా భర్తీ చేస్తే మాదిగవర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఉద్యమంలో మాదిగలను మాలలకు వ్యతిరేకంగా ఉన్నారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకుడు మందకృష్ణ మాదిగ వంటి నాయకుల నుంచే కాకుండా ప్రతిపక్షాల నుంచి కూడా తీవ్ర విమర్శలు వచ్చే ప్రమాదం ఉంది. ఇటువంటి సంకేతాన్నే వరంగల్ సంఘటన సందర్భంలో కెసిఆర్కు ఇచ్చారు. దాంతో రాజయ్యను తొలగించడం ద్వారా ఏర్పడిన ఖాళీని మాదిగ వర్గానికి చెందిన నాయకుడితో భర్తీ చేయాల్సిన అవసరం ఉంది.
పొతే, కడియం శ్రీహరి మాదిగ వర్గానికన్నా దిగువ స్థాయిలో ఉన్న వర్గానికి చెందిన వారు. పైగా, ఆయన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు తొలి నుంచీ మద్దతు ఇస్తున్న నాయకుడు. మందకృష్ణ మాదిగ వంటి నాయకులకు ఆయనపై గౌరవం కూడా ఉంది. పైగా, రాజకీయాల్లో సీనియర్. గతంలో మంత్రిగా చేసిన అపార అనుభవం ఉంది. వివాదరహితుడనే పేరు కూడా ఉంది. ఏ రకంగా చూసినా కడియం శ్రీహరిని మంత్రివర్గంలోకి తీసుకోవడం వల్ల విమర్శలు వచ్చే అవకాశం లేదు.
రాజయ్యకు సంబంధించి అన్ని తలుపులూ మూసేయడానికి కడియం శ్రీహరి కెసిఆర్కు బ్రహ్మాస్త్రంలా పనికి వచ్చారు. రాజయ్య బర్తరఫ్పై దళిత వర్గాలు గానీ రాజయ్య వర్గం గానీ మాట్లాడకుండా చేయడంలో కెసిఆర్ విజయం సాధించారు. రాజయ్య బర్తరఫ్పై ఒత్తిడి రాకుండా ఆయన ఆ రకంగా జాగ్రత్త పడ్డారు. నిజానికి, రాజయ్యను మంత్రివర్గం నుంచి తప్పించడం లేదా ఆయన చేత రాజీనామా చేయించడం అనేది కెసిఆర్కు కత్తి మీద సాము వంటిది. ఆయన ఆ కత్తి మీద సాము చేయడానికి కడియం శ్రీహరి అస్త్రాన్ని ప్రయోగించారు.