ఎపి ల్యాంకో విద్యుత్తు: ఎపి నో, తెలంగాణ ఓకే
హైదరాబాద్: ల్యాంకో నుంచి విద్యుత్తును కొనుగోలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విముఖత వ్యక్తం చేయడంతో తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్కు చెందిన ల్యాంకో సంస్థ నుంచి 353 మెగావాట్ల విద్యుత్తును కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం సుముఖతను కనబరుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈమేరకు ల్యాంకో సంస్థ కూడా ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచినట్లు సమాచారం.
మీడియాలో వచ్చిన వార్తాకథనాల ప్రకారం - కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ గ్యాస్ సరఫరా కోసం ఇటీవల నిర్వహించిన ఈ-బిడ్డింగ్లో ల్యాంకో సంస్థ, కొండపల్లిలోని రెండు మర్చంట్ ప్లాంట్ల నుంచి 353 మెగావాట్ల విద్యుత్తు ఉత్పాదనకు అవసరమైన గ్యాస్ను సాధించింది. ల్యాంకోతో పాటు జీవీకే, జీఎంఆర్, వేమగిరిలు కూడా 147 మెగావాట్ల విద్యుదుత్పాదనకు గ్యాస్ను ఈ-బిడ్డింగ్లో పొందాయి. కానీ ఈ సంస్థలు ఇప్పటికే డిస్కంలతో కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు విద్యుత్తును సరఫరా చేస్తున్నారు. ఇందులో తెలంగాణకు కూడా 80 మెగావాట్ల విద్యుత్తు వస్తోంది.
ల్యాంకో సంస్థకు డిస్కంలతో ఎలాంటి పీపీఏలూ లేవు. పైగా ఈ సంస్థకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్టాలకు మాత్రమే సరఫరా చేసే విద్యుత్తు వ్యవస్థ ఉంది. బయటి రాష్ట్రాలకు అమ్ముకునే పరిస్థితి లేదు. తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ విద్యుత్తును కొంటుందని ఆశించిన ల్యాంకో సంస్థ ఆశించింది. అయితే ఆ రాష్ట్రం సుముఖత వ్యక్తం చేయలేదు. తక్షణమే తెలంగాణ ప్రభుత్వంలో సంప్రదింపులు ప్రారంభించింది.
ఆర్ఎల్ఎన్జీ/నాఫ్తాలతో విద్యుదుత్పత్తి విషయంలో తెలంగాణ ప్రభుత్వంతో ఏర్పడిన సన్నిహిత సంబంధాలను ఉపయోగించుకుంటూ తన విద్యుత్తు కొనాలంటూ ఒత్తిడి పెంచింది. రాష్ట్ర అవసరాల కోసం ప్రభుత్వం, నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలోని ప్రైవేటు మర్చంట్ విద్యుదుత్పత్తి సంస్థలు సింహపురి, మీనాక్షి, థర్మల్ పవర్టెక్ల నుంచి దాదాపు వెయ్యి మెగావాట్ల విద్యుత్తును, యూనిట్కు 5.99 చొప్పున కొనుగోలు చేస్తోంది. దీనికంటే ల్యాంకో మర్చంట్ విద్యుత్ ధర తక్కువ(యూనిట్కు రూ 4.70) కాబట్టి ఈ ప్రతిపాదన పట్ల సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
ల్యాంకో విద్యుత్తును కొనడం వల్ల, కేంద్రం నుంచి ప్రతి యూనిట్కూ రూ.1.80లు సబ్సిడీ రూపంలో లభిస్తుండడం కూడా తెలంగాణ ప్రభుత్వం ఆసక్తి చూపడానికి కారణమంటున్నారు. అయితే, ల్యాంకో మర్చంట్ విద్యుత్తు కొనుగోలుకు ‘వ్యాట్' అడ్డు కానున్నట్లు తెలిసింది. ఈ-బిడ్డింగ్ ద్వారా దక్కిన గ్యాస్తో ఉత్పత్తి చేసే విద్యుత్తును ఏరాష్ట్రం కొన్నా వ్యాట్ నుంచి మినహాయింపు ఇవ్వాలన్నది కేంద్రం విధించిన నిబంధన. సబ్సిడీ గ్యాస్ను పొందే విద్యుత్ ప్లాంట్లు ఏపీలో ఉన్నందున వ్యాట్ నుంచి మినహాయింపును ఇవ్వలేమని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ప్రస్తుతం వ్యాట్ మినహాయింపు నకు సన్నద్ధమైనట్లు తెలిసింది. విద్యుత్తుకు డిమాండ్ పెరుగుతుండడం కూడా ల్యాంకో విద్యుత్తు కొనుగోలుకు తెలంగాణ ప్రభుత్వం సుముఖత ప్రదర్శించడం కారణమని అంటున్నారు.