తెలంగాణ ప్రభుత్వ వాదన: ఆడంబరమైన పెళ్లిళ్ల వల్ల కూడా రైతుల ఆత్మహత్యలు
హైదరాబాద్: రైతుల ఆత్మహత్యలపై తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు వింతైన కారణాన్ని చెప్పింది. ఆడంబరంగా పెళ్లిళ్లు, ప్రైవేట్ పాఠశాలల్లో పిల్లలను చదివించడానికి చేస్తున్న భారీ ఖర్చులు రైతుల ఆత్మహత్యలకు కారణమని వాదించింది. కాగా, రైతు ఆత్మహత్యలపై పిటిషనర్లు వాస్తవాలు వెల్లడించడం లేదని, గత ఏడాది 1347 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నది నిజం కాదని చెప్పింది.
నిరుడు జూన్-అక్టోబర్ మధ్య 782 మంది ఆత్మహత్యలు చేసుకుంటే వారిలో 342 మంది మాత్రమే రైతులుని, జాతీయ క్రైం బ్యూరో రికార్డుల ప్రకారం నిరుడు 989 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని, వారిలో 295 మంది మాత్రమే వ్యవసాయంపై ఆధారపడినవారని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తేల్చి చెప్పింది.
హైకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు కౌంటర్ దాఖలు చేసింది. లెక్కకు మించి బోర్లు వేయడం భూముల లీజు, కుటుంబంలో మనస్పర్థలు. అనారోగ్యం. ప్రైవేటు రుణాలు కూడా రైతుల ఆత్మహత్యలకు కారణాలని చెప్పింది.
ఈ ఏడాది సెప్టెంబర్లో 154 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడినట్లు పత్రికల్లో వచ్చిందని, వాటిపై ప్రభుత్వం అధ్యయనం చేయించిందని, వాటిలో 94 మంది సాగు కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడినట్లు తేలిందని, 41 మంది ఇతరత్రా కారణాలతో ఆత్మహత్యలు చేసుకున్నారుని, 12 కేసులు సహజ మరణాలని చెప్పింది.
మరో ఏడు కేసుల్లో ఫోరెన్సిక్ నివేదికలు అందాల్సి ఉందని, రైతు ఆత్మహత్యలపై త్రిసభ్య కమిటీ విచారణ చేపడుతోందని, బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు జిల్లాలకు సంబంధిత అధికారులను పంపుతున్నామని కౌంటర్లో వివరించింది. రైతుల ఆత్మహత్యలను నివారించడానికి ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని, అయినా ఆత్మహత్యల పరంపర కొనసాగుతోందని తెలిపింది. బాధ్యతల నుంచి తప్పించుకోవాలని చూడడం లేదని, రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తోందని వివరించింది.
అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు లబ్ధి చేకూర్చేందుకు తమ ప్రభుత్వం రుణమాఫీ పథకాన్ని అమలు చేసిందని, ఇప్పటికే అమల్లో ఉన్న పథకాలు సమర్థంగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటోందని తెలిపింది. రైతులు ఆత్మహత్యలకు పాల్పడకూడదని భావించిన ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు విస్తృత ప్రచారం చేస్తోందని, రైతుల అవసరాలను తీర్చేందుకు ‘గ్రామజ్యోతి' కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని వివరించింది.
రైతుల ఆత్మహత్యలను నివారించడానికి తాము తీసుకుంటున్న చర్యలను, రుణమాఫీ చేస్తూ విడుదల చేసిన మొత్తాలను ప్రభుత్వం కౌంటర్లో వివరించింది. ఆత్మహత్యల నివారణకు తగిన సూచనలు, సలహాలు ఇస్తే ప్రభుత్వం వాటిని పరిశీలిస్తుందని, అలా చేయకుండా కేవలం ప్రచారం కోసమే పిటిషనర్లు ప్రభుత్వంపై నిందలు మోపుతున్నారని, వారి అభియోగాలు సత్యదూరమని వ్యాఖ్యానించింది. గతంలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలకు లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందించే వారని, దానిని తమ ప్రభుత్వం ఐదు లక్షలకు పెంచిందని తెలిపింది.