ఫ్యాషన్గా రుణ మాఫీ: వెంకయ్య వివాదాస్పద వ్యాఖ్యలు, ఇదీ అసలు కథ
కర్ణాటకలో సహకార బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న రైతులందరికీ రూ.50 వేల దాకా రుణమాఫీ చేస్తున్నట్టు ఆ రాష్ట్ర సీఎం సిద్దరామయ్య చేసిన ప్రకటనపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పందన ఇది.
హైదరాబాద్ : 'ఇటీవల రుణమాఫీ ఒక ఫ్యాషన్ అయిపోయింది. రుణాలు మాఫీ చేయాల్సిందే.. కానీ తీవ్ర పరిస్థితుల్లో మాత్రమే చేయాలి. అదేమీ తుది పరిష్కారం కాదు. వ్యవస్థల గురించి కూడా ఆలోచించాలి. ఇబ్బందుల్లో ఉన్న రైతులను ఆదుకోవాలి' అని కేంద్ర పట్టణాభివ్రుద్ధి, సమాచార, ప్రసారాలశాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు ముంబైలో అన్నారు.
కర్ణాటకలో సహకార బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న రైతులందరికీ రూ.50 వేల దాకా రుణమాఫీ చేస్తున్నట్టు ఆ రాష్ట్ర సీఎం సిద్దరామయ్య చేసిన ప్రకటనపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పందన ఇది. తీవ్ర పరిస్థితులంటే దానికి సరైన నిర్వచనం ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఆయనదే. వ్యవస్థలను గురించి కూడా ఆలోచించాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యకు అర్థం కూడా చెప్పాలని అంతా డిమాండ్ చేస్తున్నారు.
రుణ మాఫీ అంటే ఫ్యాషన్ వెంకయ్య నాయుడు అనగానే కాంగ్రెస్ పార్టీ సహా విపక్ష పార్టీలన్నీ సహజంగానే మండిపడ్డాయి. సీనియర్ రాజకీయ వేత్త కూడా అయి ఉండి వెంకయ్య నాయుడు చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు స్పందించడమూ సబబే. అయితే నాలుగు నెలల క్రితం ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఏ ఆలోచన ప్రకారం రైతుల పంట రుణాలు మాఫీ చేస్తామని బీజేపీ హామీ ఇచ్చిందన్న సంగతి మాట్లాడరు.
మహారాష్ట్ర సీఎం ఇలా.. మధ్యప్రదేశ్ లో అలా
తర్వాత యూపీలో చారిత్రక విజయం సాధించిన మీదట రాష్ట్ర రైతుల పంట రుణాలు మాఫీ చేస్తామని పార్లమెంట్ సాక్షిగా వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ ప్రకటించి నాలిక్కర్చుకున్నారు. ఆ వెంటనే మాట మార్చారు. రాష్ట్ర ప్రభుత్వాలే ‘రుణ మాఫీ' భారం భరిస్తాయని నర్బగర్భ వ్యాఖ్యలు చేస్తూ దాట వేశారు. తొలుత యూపీ ప్రభుత్వం, తర్వాత మహారాష్ట్రలోని దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం పంట రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించాయి. మున్ముందు మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు పంట రుణ మాఫీ ప్రకటన చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇప్పటివరకు బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలే రుణ మాపీ ప్రకటించాయి.
కర్ణాటకలో గెలుపు కోసం బీజేపీ ఇలా
కానీ తాజాగా రూ.50 వేల లోపు పంట రుణాలు మాఫీ చేస్తామని కర్ణాటక సీఎం సిద్ధ రామయ్య చేసిన ప్రకటన కంటగింపుగా మారింది. వచ్చే ఏడాది మే నెలలో కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని కల కమలనాథులది. బీజేపీ సీనియర్ నేత బీఎస్ యెడ్యూరప్పనే సీఎం అభ్యర్థిగా కమలనాథులు ప్రకటించేశారు. వర్షాభావ పరిస్థితులు, కరువు కారణంగా రైతులు సమస్యలను ఎదుర్కొంటున్నారు. వారి కష్టాలు తీర్చి దిశగా.. వచ్చే ఏడాది ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యూహం అమలు చేస్తోంది.
ఇదే కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడికి ఇబ్బందికరంగా మారిందన్న మాటలు వినిపిస్తున్నాయి. పండించిన పంటకు మార్కెట్ లేక, ఉన్నా గిట్టుబాటు ధర రాక, ఒకే రోజు ఎనిమిది మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో వెంకయ్య చేసిన వ్యాఖ్యలపై పెను దుమారం రేగింది. వెంకయ్య వ్యాఖ్యలు చూస్తే ఆయన ధనవంతుల వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ‘ఇక రైతుల ఆత్మహత్యలను కూడా ఫ్యాషన్ అని కేంద్ర ప్రభుత్వం అంటుందా' అని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ సంపన్నులకు, కార్పొరేట్లకు ఇచ్చిన రుణాలు ఫ్యాషన్ కిందకు రావా? అని నిలదీశారు.
సంపన్నుల రుణ మాఫీ ఇలా ఫ్యాషన్
గత మూడేళ్లలో 36 వేల నుంచి 40 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని.. రుణమాఫీని ఫ్యాషన్ అంటే అన్నదాతలను అవమానించినట్లేనని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మండిపడ్డారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడికి రైతుల సమస్యలన్నా, పంట రుణాలన్నా బీజేపీ వైఖరేమిటో బయట పెట్టిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సూర్జేవాలా అన్నారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో వివరణ ఇచ్చారు.
రైతులకు వసతులపై కేంద్ర మంత్రి వెంకయ్య ఇలా
తాను ఫ్యాషన్ అన్నది రాజకీయ పార్టీల విషయంలోనని, రుణమాఫీ విషయంలో పార్టీలు ఒకదాంతో ఒకటి పోటీ పడుతున్నాయని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చెప్పారు. రైతుల సమస్యలకు కేవలం రుణమాఫీ మాత్రమే పరిష్కారం కాదని, అది తాత్కాలిక పరిష్కారం మాత్రమే అవుతుందని అన్నారు. అదే తాత్కాలిక పరిష్కారమైతే ఎందుకు యూపీ, మహారాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయ బూనుకున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది. రాజకీయ పార్టీలు దీర్ఘకాల పరిష్కారాల గురించి ఆలోచించాలని, మౌలిక వసతులు మెరుగుపరచడం, గ్రామీణ రోడ్లను బాగుచేయడం, నాణ్యమైన విద్యుత్ సరఫరా, గోడౌన్లు, కోల్డ్ స్టోరేజీ సదుపాయాలు, రైతులకు తక్కువ వడ్డీలకు రుణాలు, ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాలని ఆయన పేర్కొన్నారు.
మొక్కుబడిగా కేంద్రం మిర్చి మద్దతు ధర ప్రకటన
కానీ ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల మిర్చి రైతులు గిట్టుబాటు ధర కోసం రోడ్డెక్కినా.. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు గిట్టుబాటు ధరగా క్వింటాల్కు రూ.7000 ప్రకటించాలని కోరితే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ మొక్కుబడిగా రూ.5000 ప్రకటించి చేతులు దులిపేసుకున్నారు. గమ్మత్తేమిటంటే మార్కెట్ లో ఫస్ట్ క్లాస్ మిర్చికి రూ.7000 పలుకుతున్నది. ఇదీ కేంద్ర ప్రభుత్వానికి అన్నదాత పట్ల శ్రద్ధ, రైతుల పట్ల ద్వంద్వ వైఖరికి అద్ధం పడుతున్నది. ఇటీవల కనీసం గిట్టుబాటు ధర కల్పించాలని మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మాంద్సౌర్ రైతులు ఉద్యమ బాట పడితే పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆరుగురు రైతులు మరణించిన నేపథ్యం అందరికీ విదితమే. పంట రుణాల మాఫీ అంశం రాష్ట్రాల అంశమని, ద్రవ్య లక్ష్యాలకు అనుగుణంగా కేంద్రం నడుచుకుంటుందని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు.
కార్పొరేట్ సంస్థల రుణ మాఫీపై ఇలా
దేశ ప్రజలందరికీ అవసరమైన ఆహార ధాన్యాలు పండించే అన్నదాత, వ్యవసాయం రాష్ట్రాల అంశమైతే, పరిశ్రమలు కూడా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పరిధిలోకి వస్తాయి. పబ్లిక్ అక్కౌంట్స్ కమిటీ (పీఏసీ) అంచనా ప్రకారం ప్రభుత్వ బ్యాంకుల రుణాలు అందునా మొండి బకాయిలు రూ.6.8 లక్షల కోట్లని తేలింది. బ్యాంకులు వివిధ వర్గాల వారికి ఇచ్చిన రుణాల్లో కార్పొరేట్లది 70 శాతమైతే.. అన్నదాతల రుణాలు కేవలం ఒక్క శాతమే. క్రెడిట్ రేటింగ్ సంస్థ ‘ఇండియా రేటింగ్స్' అంచనా ప్రకారం రూ.4 లక్షల కోట్ల కార్పొరేట్ రుణాలు మాఫీ కానున్నాయని తెలుస్తున్నది.
కేంద్ర ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం మాటల్లో చెప్పాలంటే కార్పొరేట్ రుణాలు ఆర్థిక కోణంలో మాఫీ చేశారట. మరి దేశమంతటికి అన్నం పెట్టే అన్నదాతలు తీసుకునే రుణాలకు ఆ పాటి విలువ లేదా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. 2012 నుంచి 2015 వరకు 1.14 లక్షల కోట్ల రూపాయల రుణాలు (మొండి బకాయిలు) మాఫీ చేసిన కేంద్రం.. వాటిలో కొంతైనా భరించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరిన దాఖలాలు లేవు. ప్రత్యేకించి స్టీల్ జెయింట్స్ తీసుకున్న రుణాలే అధికమని పీఎంవో నిర్ధారణకు వచ్చింది. టాప్ 40 కార్పొరేట్ సంస్థల ఖాతాలు ఒత్తిడికి గురవుతున్నాయి. దివాళా చట్టానికి సవరణలు తెస్తూ ఆర్డినెన్స్ ఆమోదించడంతో సుమారు రూ.2.5 లక్షల కోట్ల విలువైన 12 సంస్థల భరతం పట్టేందుకు ఆర్బీఐ సిద్ధమవుతున్నది.
విద్యుత్ చార్జీలు తగ్గించమంటే పోలీసు కాల్పులు
అధికారంలో ఉన్న పార్టీలు, మంత్రులు, ముఖ్యమంత్రులకు వ్యవసాయాన్ని, రైతులను అపహస్యం పాల్జేయడం కొత్తేమి కాదు. 2004కు ముందు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ మీడియాతో మాట్లాడుతూ రైతులు తిన్నది అరగక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నాటి ఉమ్మడి ఏపీ, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కూడా వ్యవసాయం దండుగ అని వ్యాఖ్యానించారు. అంతా ఐటీ మయమని ఎదురు దాడికి దిగారు. అంతెందుకు విద్యుత్ చార్జీలు తగ్గించాలని ఆందోళనకు దిగితే బాబు జగ్జీవన్ రాం సాక్షిగా పోలీసు కాల్పులు జరిపించారు. ఈ కాల్పుల్లో ముగ్గురు మరణించారు.
ఇక చేవెళ్లలో విత్తనాలు పంపిణీ చేయమన్న రైతులపైనా కాల్పులు జరిపించిన నేపథ్యం చంద్రబాబుది. అదే టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ప్రస్తుత కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కూడా 2014 అసెంబ్లీ, లోక్సభ జమిలీ ఎన్నికల్లో రుణ మాఫీకి ఇచ్చిన ఘనత సాధించారు. తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు రుణ మాఫీ వాయిదాల పద్దతిలో అమలు చేయాల్సి వచ్చినా కేంద్రం పట్టించుకున్న దాఖలాలు లేవన్న విమర్శలు ఉన్నాయి. అవసరం ఉన్నంత సేపు ‘ఓడమలయ్య' తీరిన తర్వాత బోడి మల్లయ్య అన్నట్లు అవసరమైనప్పుడు ప్రజల అనుకూల నిర్ణయాలు అమలు చేయడం.. తర్వాత వారిని విస్మరించడమేమిటన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.