రాజకీయ ఎన్నికల్లా 'మా': చిచ్చుపెట్టారని రోజా, ఎవర్నీ?
హైదరాబాద్: 'మా' (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో రాజేంద్ర ప్రసాద్, జయసుధలు పోటీ పడుతున్నారు. మధ్యాహ్నం రెండు గంటల వరకు పోలింగ్ జరగనుంది. అయితే, ఈ ఎన్నికలు రాజకీయమయమయ్యాని ఇరువర్గాలు ఆరోపించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మా ఎన్నికలు తొలిసారి సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి.
రాజేంద్ర ప్రసాద్కు మద్దతుగా నాగబాబు తదితరులు ఉన్నారు. జయసుధ ప్యానల్కు మద్దతుగా మురళీ మోహన్ తదితరులు ఉన్నారు. ఇటీవలి వరకు జయసుధ ప్యానెల్, రాజేంద్రప్రసాద్ ప్యానెల్లు పరస్పరం విమర్శలు గుప్పించుకున్నారు. మా ఎన్నికలను రాజకీయ కంపు చేశారని రాజేంద్ర ప్రసాద్ మండిపడటం గమనార్హం. కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల ప్రక్రియ మొత్తం వీడియో రికార్డింగ్ చేస్తున్నారు.
ఎప్పుడు లేని విధంగా మాలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయని చాలామంది భావిస్తున్నారు. దీంతో ఈ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. సాధారణ ఎన్నికలను (రాజకీయ ఎన్నికలు) తలపిస్తున్న ఈ ఎన్నికల పైన సినీ ఇండస్ట్రీతో పాటు సామాన్యులు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు.
విభేదాల్లేవ్
తమ మధ్య ఎలాంటి విబేధాల్లేవని మురళీ మోహన్ అన్నారు. ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయని, సాయంత్రానికి మళ్లీ అందరం కలిసిపోతామని అన్నారు. ఎన్నికల వెనుక ఎటువంటి అదృశ్య శక్తి లేదన్నారు.
రోజా మాట్లాడుతూ... అధ్యక్షుడిని పెద్దలంతా ఒకరిని డిసైడ్ చేస్తే బాగుండేదని అన్నారు. మా ఎన్నికల్లో కొందరు చిచ్చు పెట్టారని ఆరోపించారు. తన మొదటి హీరోకే తన మద్దతు అని ప్రకటించారు. మా అంటే అందర్నీ అక్కున చేర్చుకునేలా ఉండాలని అన్నారు. కాగా, కొందరు చిచ్చు పెట్టారన్న రోజా.. మురళీ మోహన్ తదితరులను ఉద్దేశించి అని ఉంటారని భావిస్తున్నారు.