శ్రీశైలం నీరు: ఈనాడు వర్సెస్ నమస్తే తెలంగాణ
హైదరాబాద్: మీడియా వార్ కొత్త రూపం తీసుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలకూ సాక్షి దినపత్రికకు మధ్య మీడియా వార్ నడుస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈనాడుకు, నమస్తే తెలంగాణ పత్రికకు మధ్య వార్ ప్రారంభమైన సూచనలు కనిపిస్తున్నాయి. శ్రీశైలం జలాశయంలో నీటిపై ఈనాడు ప్రచురించిన వార్తాకథనాన్ని ఏకేస్తూ సోమవారం నమస్తే తెలంగాణ దినపత్రిక సోమవారం ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది.
దాహం పేరుతో ఈనాడు ద్రోహం పతాక శీర్షికతో ఈనాడు దినపత్రిక వార్తాకథనంపై ఈనాడు తీవ్రంగా ధ్వజమెత్తింది. నమస్తే తెలంగాణ దినపత్రిక తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు చెందిందనే విషయం అందరకీ తెలిసిందే. ఈనాడు వార్తాకథనంపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ - ఆంధ్ర మీడియా తెలంగాణను ప్రశాంతంగా బతకనివ్వదలుచుకోలేదని, ఆత్మగౌరవంతో పరిపాలనను చేసుకోనివ్వదలుచుకోలేదని నమస్తే తెలంగాణ దుమ్మెత్తిపోసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్తు కేంద్రంలో విద్యుదుత్పత్తిని నిలిపేయాలని ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు తెలంగాణ మంత్రి టి. హరీష్ రావుకు చేసిన విజ్ఞప్తిని ప్రస్తావిస్తూ ఈనాడు దినపత్రిక వెంటనే దేవినేని ఉమ పాటకు పల్లవి కడుతూ తెలంగాణ ప్రభుత్వం విద్యుదుత్పత్తి చేస్తే శ్రీశైలం రిజర్యావయర్ అడుగంటుందని, తాగునీటికి కటకట ఏర్పడుతుందని ఈనాడు బాధపడిందని నమస్తే తెలంగాణ దినపత్రిక వార్తాకథనం విమర్శించింది.
శ్రీశైలం అడుగంటిపోయి మంచినీళ్లకు కూడా కటకట ఏర్పడుతుందని ఈనాడు దినపత్రిక అవసరం ఉన్న అంకెలను మాత్రమే చేర్చిందని విమర్శించింది. తెలంగాణ ఒక్కటంటే ఒక్క టిఎంసి నీటిని కూడా వాడుకోకుండా చేశారని, ఆ నీళ్లు వెళ్లడమంటూ జరిగితే ఆంధ్రకే వెళ్తాయని మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదని తప్పు పట్టింది. ప్రతి ప్రాజెక్టుకు ఏయే సమయాల్లో ఎంత నీటి మట్టం ఉంచాలో నిబంధనలున్నాయని, ఆ నిబంధనలను పాటిస్తూనే ఇక్కడ విద్యుదుత్పత్తి జరగుతోందని ఈనాడు ఎక్కడా చెప్పలేదని విమర్శించింది.
కుడి ఎడమ దగా అనే పతార శీర్షిక కింద తెలంగాణలోనే ఎడమగట్టు అంటూ ఆదివారంనాడు ఈనాడు దినపత్రిక వార్తాకథనం ప్రచురించింది. దానిపైనే నమస్తే తెలంగాణ భగ్గుమంది. శ్రీశైలం రిజర్వాయర్ అడుగంటలేదని నమస్తే తెలంగాణ వార్తాకథనం చెబుతూ ఆదివారంనాడు రిజర్వాయర్లో ఉన్న నీటిమట్టాన్ని, టిఎంసిల నీటిని తదితర వివరాలను అందించింది. ఆదివారంనాడు 861 అడుగుల నీటి మట్టం ఉందని, 834 అడుగుల వరకు విద్యుదుత్పత్తికి నీటిని తీసుకోవచ్చునని 1996 జూన్లో జీవో 69 జారీ అయిందని, అది జారీ చేసింది కూడా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని, అప్పుడు అది వారి అవసరం కాబట్టి ఇచ్చారని నమస్తే తెలంగాణ పత్రిక వివరించింది.
ఎప్పుడెప్పుడు ఏం జరిగిందనే వివరాలను కూడా నమస్తే తెలంగాణ అప్పుడెందుకు ఈనాడు వార్తాకథనాలు రాయలేదని ప్రశ్నించింది. హక్కులేమిటి, లెక్కలేమిటి అంటూ కృష్ణానది ప్రాజెక్టులపై వివరణ ఇచ్చింది. కృష్ణపట్నం మాటేమిటని, సాగునీటికి నీరెందుకు ఆపరని, సముద్రంలోకి పోయే వేల క్యూసెక్కుల మాటేమిటని అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తూ వార్తాకథనాన్ని ప్రచురించింది. మొత్తం మీద, ఇరు రాష్ట్రాల మధ్య మీడియా వార్ ఇప్పటికే ప్రారంభమైనప్పటికీ అది మరో రూపం తీసుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి.