కేసీఆర్కు ఆయన రక్తంతో లేఖ రాశారు!: రియాక్షన్ ఎలా ఉండబోతుంది?..
జీఎస్టీకి అనుసంధానంగా పునర్ వ్యవస్థీకరించుకోవాలని లేఖలో ముజాహిద్ సూచించారు.
హైదరాబాద్: జీఎస్టీ ప్రవేశంతో రాష్ట్ర ప్రభుత్వాలన్ని ఆ నెట్ వర్క్కు అనుగుణంగా పన్నుల శాఖను పునర్ వ్యవస్థీకరించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖను కూడా జీఎస్టీకి అనుసంధానంగా పునర్ వ్యవస్థీకరించుకోవాలని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మహమ్మద్ ముజాహిద్ సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు.
ఆదివారం నాడు ఈ లేఖను ముజాహిద్ మీడియాకు విడుదల చేశారు. కేంద్రం ప్రవేశం పెట్టిన జీఎస్టీ పన్ను విధానాన్ని స్వాగతిస్తున్నామని, అదే సమయంలో దానికి అనుగుణంగా రాష్ట్ర పన్నుల శాఖను రీ-ఆర్గనైజ్ చేయాలని ఆయన కోరారు. పునర్ వ్యవస్థీకరణతోనే రాష్ట్ర పన్నుల శాఖ బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే దీనికి సంబంధించిన చర్యలు తీసుకోవాలన్నారు.
అయితే ఈ విషయాన్ని తెలియపరిచేందుకు రక్తంతో లేఖ రాయాల్సిన అవసరం ఏమొచ్చిందనేది చాలామందిలో తలెత్తిన ప్రశ్న. చూడాలి మరి ఈ రక్తం లేఖ పట్ల సీఎం కేసీఆర్ రియాక్షన్ ఎలా ఉండబోతుందో!