గుండెకోత: ధోని తొలి ప్రేయసి ఇలా మృత్యువాత
హైదరాబాద్: భారత క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ జీవితం ఆధారంగా తీసిన ఎంఎస్ ధోనీ - అన్టోల్డ్ స్టోరీలో ఓ విషాదకరమైన సంఘటన ఉందని అంటున్నారు. సినిమాలో ధోనీ పాత్రను పోషించిన సుశాంత్ సింగ్ ఆ వివరాలను వెల్లడించాడు. ధోనీ తొలి ప్రేయసి రోడ్డు ప్రమాదంలో చనిపోయింది.
ఆ ప్రస్తావన సినిమాలో ఉందని చెబుతున్నారు. వివాహానికి ముందు ధోనీ ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన సంఘటనలు ఉంటాయా, లేదా అనే చర్చ సాగుతున్న తరుణంలో ఆ చర్చ ముందుకు వచ్చింది. వివాహానికి ముందు ధోనీ ప్రేమ వ్యవహారం సినిమాలో ఉంటుందని అంటున్నారు.
ధోనీ ప్రేమ కథనకు సంబంధించిన దృశ్యాల్లో నటించినప్పుడు తన గుండె భారమైపోయిందని సుశాంత్ సింగ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ధోనీ 20 ఏళ్ల వయస్సులో ఉన్నప్పటి ప్రేమ కథ అది. ధోనీ తొలి ప్రేయసి పేరు ప్రియాంక ఝా.
ఓ వైపు ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడుతూ జాతీయ జట్టులో స్థానం కోసం ప్రయత్నాలు సాగిస్తున్న రోజుల్లో ధోనీకి ఆమెతో పరిచయం ఏర్పడిందట. ధోనీ క్రికెట్ క్రీడలో ఒక్కొక్క మెట్టే పైకి ఎక్కుతున్న సమయంలో ప్రియాంక 2002లో రోడ్డు ప్రమాదంలో చనిపోయింది.
ప్రియాంక పాత్రలో దిశ నటించినట్లు తెలుస్తోంది. 2003 - 2004లో ఇండియా ఎ జట్టులో స్థానం పొందిన ధోనీ కెన్యా, జింబాబ్వే పర్యటనలు చేశాడు. క్రికెట్ క్రీడలో తన సత్తా చాటుతున్న సమయంలోనే ధోనీ ప్రియాంకను కోల్పోయాడు. దీని నుంచి బయటపడడానికి ధోనీకి ఏడాది పట్టిందట.