నంద్యాలకు నారా లోకేష్ దూరం: చంద్రబాబు సందేహమే....
వచ్చే సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సారథ్యం వహిస్తారని భావిస్తున్న ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడి తనయుడూ మంత్రి నారా లోకేష్ నంద్యాల ఉప ఎన్నికలకు దూరంగా ఉండిపోయారు.
విజయవాడ: వచ్చే సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సారథ్యం వహిస్తారని భావిస్తున్న ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడి తనయుడూ మంత్రి నారా లోకేష్ నంద్యాల ఉప ఎన్నికలకు దూరంగా ఉండిపోయారు.
నంద్యాల ఉప ఎన్నికల్లో ఆయన పాత్ర ఏ మాత్రం కనిపించలేదు. నిజానికి, నారా లోకేష్ నంద్యాల ఉప ఎన్నికలో పెద్ద యెత్తునే సందడి చేస్తారని భావించారు. కానీ అదేదీ లేకుండానే నంద్యాల ఉప ఎన్నిక జరిగిపోయింది. తన వారసుడిగా చంద్రబాబు నారా లోకేష్ను ముందుకు తేవడానికి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు.
అటువంటి స్థితిలో నంద్యాల క్రెడిట్ నారా లోకేష్కు దక్కకుండా ఎందుకు చేశారనేది సందేహం సర్వత్రా వ్యక్తమవుతూ వచ్చింది. నిజానికి, నంద్యాల ఉప ఎన్నిక బాధ్యతను ఆయనకు అప్పగించినట్లు వార్తలు వచ్చాయి. కానీ, అందులో నిజం లేదని తేలిపోయింది.
అంత మంది పాలు పంచుకున్నా....
నంద్యాల ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి టిడిపి విజయం కోసం ఆరుగురు మంత్రులు, 60 మంది పార్టీ శాసనసభ్యులు పాటుపడుతూ వచ్చారు. వీరందరూ పూర్తిగా నంద్యాలలోనే ఉండిపోయారు. దానికితోడు, మిగతా మంత్రులు కొంత మంది, ఎమ్మెల్యేలు మధ్య మధ్యలో వస్తూ వెళ్లిపోతూ వచచారు.
Recommended Video
రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని....
నారా లోకేష్ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నారా లోకేష్ను నంద్యాల ఎన్నికకు దూరంగా ఉంచినట్లు చెబుతన్నారు. అంతా సజావుగా ఉంటే ఆయనకే బాధ్యతలు అప్పగించి ఉండేవారు. కొన్ని సామాజిక వర్గాలు వ్యతిరేకంగా ఉండడంతో టిడిపి గెలుపు అంత సులభంగా కనిపించలేదు. ఫలితం వ్యతిరేకంగా వస్తే దాని ప్రభావం లోకేష్ రాజకీయ భవిష్యత్తుపై పడుతుందని భావించి ఆయనను దూరంగా ఉంచినట్లు చెబుతున్నారు.
ఒక్కసారి ఇలా....
నంద్యాల ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైన తర్వాత జులై 14వ తేదీన నారా లోకేష్ నంద్యాలను సందర్శించారు. ఆ తర్వాత ఆయన ఊసే లేదు. టిడిపికి విజయం నల్లేరు మీద నడక అయి ఉంటే నారా లోకేష్కు బాధ్యతలు అప్పగించి ఉండేవారని తెలుగుదేశం పార్టీ నాయకులే అంటున్నారు.
అలా చేశారు....
తొలుత అమరావతి నుంచి లోకేష్ నంద్యాల ఎన్నిలో పార్టీ వ్యవహారాలను సమన్వయం చేసే బాధ్యతను తీసుకున్నారు. టిడిపి విజయం సాధిస్తే ఆ క్రెడిట్ ఆయనకు ఇవ్వవచ్చుననేది ఆలోచన. కానీ పరిస్థితులు అంత సజావుగా కనిపించకపోవడంతో, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ స్వయంగా రంగంలోకి దిగడంతో ఆయనను పూర్తిగా దూరం పెట్టినట్లు చెబుతున్నారు.