చట్టం.. నేనేంటో చూపిస్తా: ఛానళ్లకు భయపడ్డ మోడీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం టైమ్స్ నౌ ఇంగ్లీష్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా పలు అంశాలు వెల్లడించారు.
నల్లధనం, ఉద్దేశ్యపూర్వకంగా డబ్బు ఎగ్గొట్టే వారి విషయమై, అగస్టా కుంభకోణం, రఘురాం రాజన్ అంశం, పొరుగు దేశాలతో సంబంధాలు, జీఎస్టీ బిల్లు తదితర అంశాలపై మాట్లాడారు.
పాకిస్తాన్ పైన మోడీ
భారత్ ఎల్లవేళలా పాకిస్తాన్ పట్ల అప్రమత్తంగా, జాగరూకతతో ఉండాల్సి ఉంటుందన్నారు. ఈ విషయంలో ఎలాంటి ఉదాసీనతకు, నిర్లక్ష్యానికి తావు ఉండవద్దన్నారు. సీమాంతర ఉగ్రవాదం విషయంలో భారత్ వాదనను ప్రపంచం అంగీకరిస్తోందన్నారు.
పాకిస్తాన్ పైన మోడీ
ఈ విషయంలో భారత్ పట్టువీడకుండా తన వాదనను వినిపిస్తూ పోవడం వల్లనే ఇది సాధ్యమయిందన్నారు. తాను లాహోర్ను సందర్శించడం, పాకిస్తాన్ ప్రధానిని ఇక్కడికి ఆహ్వానించడం వంటి చర్యలతో కూడిన స్థిరమైన ప్రయత్నాలతో ఉగ్రవాదానికి సంబంధించి తన వాదనను భారత్ చాలా బలంగానే చాటిచెప్పగలిగిందని, ఆ విధంగా ప్రపంచ దేశాలను ఒప్పించగలిగిందన్నారు.
పాకిస్తాన్ పైన మోడీ
ఉగ్రవాద నిర్మూలనపై భారత్ చేస్తున్న వాదనను ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో బలపరుస్తున్నాయని, ఈ పరిస్థితి పాకిస్తాన్కు ఇబ్బందిగా మారిందన్నారు. ప్రస్తుత వాస్తవ పరిస్థితులను మొత్తం ప్రపంచ దేశాలన్ని గమనిస్తున్నాయన్నారు.
పాకిస్తాన్ పైన మోడీ
శాంతే పరమోద్దేశంగా పాక్తో భారత్ వ్యవహరిస్తుందనీ, అయితే తగిన రీతిలో సమాధానం చెప్పే పూర్తిస్వేచ్ఛ మన బలగాలకు ఉందనీ మోడీ చెప్పారు. పాక్లో రకరకాల శక్తులు పనిచేస్తుంటాయనీ, భారత్ మాత్రం ప్రజాస్వామ్యయుత వ్యవస్థతోనే సంప్రదింపులు జరుపుతుందని తెలిపారు.
ఎన్ఎస్జీ సభ్యత్వంపై మోడీ
అణు సరఫరా దేశాల కూటమి (ఎన్ఎస్జి)లో భారత్ సభ్యత్వానికి సంబంధించి బలమైన సానుకూల పరిణామాలు ప్రారంభమయ్యాయన్నారు. ఈ విషయంలో చైనా నుంచి అభ్యంతరం వస్తున్నప్పటికీ ఎన్ఎస్జీలో భారత్కు సభ్యత్వం లభించగలదన్న ధీమా వ్యక్తం చేశారు. ఇందుకు అమెరికా సహా అన్ని దేశాల నుంచి వస్తున్న సానుకూల ప్రతిస్పందనలే నిదర్శనమన్నారు.
భావోద్వేగాలను రెచ్చగొట్టే వారిని హీరోలను చేయవద్దని మోడీ
భావోద్వేగాలను రెచ్చగొట్టే వారిని హీరోలుగా చేయవద్దని ప్రధాని మోడీ అన్నారు. యూపీ అభివృద్ధే అక్కడి ఎన్నికల్లో తమ ప్రధాన అజెండా అన్నారు. మా పార్టీలో అయినా, బయట అయినా.. అసందర్భ మాటలు సరికాదన్నారు. ప్రచారం కోసం పాకులాట వల్ల దేశానికి ఎలాంటి మంచి జరగదన్నారు. ఎవరికి వారు తమ బాధ్యతలెరిగి ప్రవర్తించాలన్నారు. ఎవరూ వ్యవస్థ కంటే అతీతం కాదని హితవు పలికారు.
చట్టమంటే చూపిస్తానన్న మోడీ
దేశంలో ఆర్థిక నేరగాళ్లు, ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు చట్టమంటే ఏమిటో చూపిస్తానని ప్రధాని మోడీ హెచ్చరించారు. దీనినొక సవాల్గా తీసుకుని, ఒక తార్కిక ముగింపు తీసుకువచ్చేందుకు తాము కట్టుబడి ఉన్నామన్నారు. ఇలాంటివి చేయగలిగేవారెవరైనా ఉన్నారంటే అది నరేంద్ర మోడీ మాత్రమేనని దేశ ప్రజల్లో పూర్తి విశ్వాసం ఉందని, అది మేం చేసి తీరుతామన్నారు.
ఎవరి పేర్లు వస్తాయో చూద్దాం.. అగస్టా స్కాంపై మోడీ
అగస్టా వెస్ట్ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణం కేసులో రాజకీయ ప్రతీకార కోణమేదీ ఉండదనీ, దర్యాప్తు సంస్థలు నిష్పాక్షికంగా విచారణ సాగిస్తాయన్నారు. దీనిలో ఎవరి పేర్లు బయటకు వస్తాయో చూద్దామన్నారు. అయితే దీనిలో పాపం దాగిందనీ, దానిని ఎవరు ఎలా చేశారో దర్యాప్తులో తేలుతుందనీ చెప్పారు. దాని వెనుక ఉన్నవారికి పెద్ద రక్షణ కవచం లభించిందని చెప్పారు. అయితే ఎంతో అనుభవంతో, చాకచక్యంతో తప్పుడు పనులు చేశారనీ, అసలు దోషులు ఆరితేరిన వ్యక్తులన్నారు.
చానళ్లకు భయపడ్డనన్న మోడీ
తనలో చాలా హాస్య చతురత ఉందని, గతంలో నా ప్రసంగాలూ అలాగే ఉండేవని, ఈ రోజుల్లో హాస్యమూ ప్రమాదాన్ని తెస్తోందని, 24 గంటల వార్తాఛానెళ్లు కారణంగా ఏదో ఒక పదాన్ని పట్టుకుని పెద్ద అంశంగా చేయవచ్చునని, ఆ భయంతోనే నేను హాస్యానికి దూరంగా ఉంటున్నానని, అందువల్లనే ప్రజా జీవితంలో హాస్యాన్ని వదిలేయాల్సి వచ్చిందని, పార్లమెంటులోనూ ఇది కరువయిందని, ఇది ఆందోళన కలిగించే అంశమన్నారు.