ఉప రాష్ట్రపతిగా వెంకయ్య: పురంధేశ్వరికి లైన్ క్లియర్, బాబుతో ఢీ!
వెంకయ్య ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో బిజెపి నాయకత్వం ఎపిపై దృష్టి పెట్టవచ్చు. నారా చంద్రబాబు నాయుడిని ఢీకొనడమే లక్ష్యంగా పార్టీ పునర్నిర్మాణం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
విజయవాడ: సీనియర్ నేత వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో బిజెపి నాయకత్వం ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే చర్యలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడిని ఢీకొనడమే లక్ష్యంగా పార్టీ పునర్నిర్మాణం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తూ రాష్ట్రంలో పార్టీ విస్తరణకు అడ్డంకిగా ఉన్నారనే తలంపుతోనే వెంకయ్య నాయుడికి పార్టీతో సంబంధం లేకుండా, తగిన గౌరవం ఇస్తూ ఉప రాష్ట్రపతి పదవికి బిజెపి నాయకత్వం ఎంపిక చేసినట్లు భావిస్తున్నారు.
బిజెపికి సైద్దాంతిక భూమికను అందించే ఆర్ఎస్ఎస్ సలహా మేరకే ప్రధాని మోడీ, బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా వెంకయ్య నాయుడిని ఉప రాష్ట్రపతి పీఠంపై కూర్చోబెట్టినట్లు చెబుతున్నారు. ఈ స్థితిలో దగ్గుబాటి పురంధేశ్వరిని పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలిగా నియమించే అవకాశాలున్నట్లు చెెబుతున్నారు.
వెంకయ్య నాయుడి వల్ల....
ఎం.వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ బిజెపిలో మార్పులకు చేర్పులకు అవకాశం ఏర్పడింందని అంటున్నారు. ఇంత వరకు వెంకయ్య నాయుడి మాటను తీసేయలేక పార్టీలో ఎపిలో బలోపేతం చేసే చర్యలు తీసుకోలేదని అంటున్నారు. ఇప్పుడు వెంకయ్య నాయుడి జోక్యం తగ్గుతుందని కాబట్టి పార్టీ నాయకత్వాన్ని పునర్వ్యస్థీకరించే అవకాశాలుంటాయని అంటున్నారు.
కేంద్ర మంత్రిగా హరిబాబు
రాజ్యసభకు వేరే రాష్ట్రం నుంచి ఎంపికైనప్పటికీ వెంకయ్య నాయుడిని ఆంధ్రప్రదేశ్కు ప్రాతినిధ్యం వహించినట్లుగానే ఇప్పటికీ భావిస్తూ వచ్చారు. వెంకయ్య నాయుడు మంత్రివర్గం నుంచి వైదొలిగిన నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గంలో ఎపికి ప్రాతినిధ్యం కల్పించే అవకాశాలున్నాయి. ఈ నెలాఖరును మోడీ తన మంత్రివర్గాన్ని విస్తరిస్తారని అంటున్నారు. అప్పుడు విశాఖ పార్లమెంటు సభ్యుడు హరిబాబును మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలున్నాయని సమాచారం.
ఈ పరిస్థితిలో ఇలా...
ప్రస్తుతం హరిబాబు బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు. ఆయనకు కేంద్రంంలో మంత్రి పదవి లభిస్తే అనివార్యంగా బిజెపికి కొత్త అధ్యక్షుడిని నియమించాల్సి ఉంటుంంది. దాంతో రానున్న ఒకటి రెండు నెలల్లోనే బిజెపికి కొత్త అధ్యక్షుడిని నియమిస్తారని సమాచారం. అది అమిత్ షా వ్యూహంలో భాగంగానే జరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో అవసరమైతే ఒంటరిగా పోటీ చేయడానికి వీలైన ప్రజాకర్షణ గల నేతకు అధ్యక్ష పదవి అప్పగిస్తారని అంటున్నారు.
రేసులో వీరున్నారు....
బిజెపి అధ్యక్ష పదవికి సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ, దగ్గుపాటి పురంధేశ్వరి రేసులో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. రాయలసీమ నుంచి చల్లపల్లి నరసింహారెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. అయితే, పార్టీని ప్రజల వద్దకు తీసుకెళ్లగలగే సత్తా ఉన్న నేతకు అవకాశమివ్వాలని బిజెపి అగ్ర నాయకత్వం భావిస్తోంది. అటు పార్టీలోను, ఇటు ప్రభుత్వంలోను రాయలసీమకు ఎలాంటి ప్రాతినిధ్యం, ప్రాధాన్యం లేదు. ఈ విషయాన్ని బిజెపి నాయకత్వం పరిగణనలోకి తీసుకుంటుందా, మరో విధంగా ఆలోచిస్తుందా అనేది చూడాల్సి ఉంటుంది. ఆర్ఎస్ఎస్ భావజాలంతో బీజేపీలో చేరి కొనసాగుతున్న చల్లపల్లె నరసింహారెడ్డి గతంలో కూడా రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవిని ఆశించిన వారి జాబితాలో ఒకరుగా ఉన్నారు.
పురంధేశ్వరికే చాన్స్
పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి పనిచేస్తున్న సోము వీర్రాజు, చల్లపల్లె నరసింహారెడ్డి వంటి సీనియర్లకు అవకాశం కల్పిస్తుందా అనేది సందేహమే. అమిత్ షా వ్యూహం మరో విధంగా ఉంది. ఆయన ఏ రాష్ట్రంలోనైనా సరే, పార్టీని అధికారానికి చేరువగా తీసుకుని వెళ్లడమే వ్యూహంగా పనిచేస్తున్నారు. అందువల్ల దగ్గుబాటి పురంధేశ్వరిని అధ్యక్షురాలిగా నియమిస్తే చంద్రబాబును ఎదుర్కోవడం సులభమవుతుందని ఆయన భావిస్తూ ఉండవచ్చు.