నాగ్పూర్ కీలకం: తేల్చేసిన అద్వానీ, మరెవరు?
క్యాబినెట్ లో మంత్రిగా ఉన్న థావర్ చంద్ గెహ్లట్ను బీజేపీ ప్లస్ ఎన్డీయే తమ అభ్యర్థిగా ముందుకు తెచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి.
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వారసుడిగా ఎవరు ఎన్నికవుతారన్న విషయమై రాజకీయ పండితుల అంచనాలు తారుమారవుతున్నాయి. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రజాకర్షక విధానాన్ని ప్రధాని నరేంద్రమోడీ అనుసరిస్తున్నారని భావిస్తున్నారు.
ప్రస్తుతం తన క్యాబినెట్ లో మంత్రిగా ఉన్న థావర్ చంద్ గెహ్లట్ను బీజేపీ ప్లస్ ఎన్డీయే తమ అభ్యర్థిగా ముందుకు తెచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి. తద్వారా వచ్చే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ తదుపరి 2019 లోక్ సభ ఎన్నికల్లో దళితుల ఓట్లు కొల్లగొట్టాలని కమలనాథుల వ్యూహంగా కనిపిస్తున్నది.
గతంలో ఒకరిద్దరు అభ్యర్థుల పేర్లు పరిశీలించడంతోనే కీలక నిర్ణయాలు జరిగేవి. కానీ ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి.
2002లో కలాం ఎన్నిక
కానీ 2002లో వాజ్పేయి సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం గానీ.. ప్రస్తుతం నరేంద్రమోడీ సారథ్యంలోని ప్రభుత్వం గానీ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. వాజ్ పేయి హయాం నాటికి ఉపరాష్ట్రపతిగా ఉన్నవారే రాష్ట్రపతిగా నియమితులు కావడం సంప్రదాయంగా వచ్చేది. కానీ నాటి ఉపరాష్ట్రపతిగా ఉన్న క్రుష్ణకాంత్ పేరు పరిశీలనకే రాకపోగా అనునిత్యం పలు మార్పులు, చేర్పులతో చివరకు శాస్త్రవేత్త డాక్టర్ అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా కొలువు దీరారు.
ముందే తేల్చేసిన మోహన్ భగవత్
ప్రస్తుతం ప్రధాని నరేంద్రమోడీకి గురువుగా భావించే ఎల్ కే అద్వానీతోపాటు పార్టీలో సీనియర్లుగా ఉన్న మురళీ మనోహర్ జోషి, కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ తోపాటు బాలీవుడ్ ప్రముఖుడు అమితాబ్ బచ్చన్ పేర్లు... అలాగే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘ్ సంచాలక్ మోహన్ భగవత్ పేరునూ శివసేన ప్రతిపాదించడమూ జరిగింది. కానీ భగవత్ ముందే మేల్కోని తానూ ఆ పదవి రేసులో లేనని తేల్చేశారు. తాజాగా అద్వానీ సైతం రాష్ట్రపతి పదవి కోసం పోటీ పడటం లేదని ప్రకటించడంతో బీజేపీ తదుపరి అభ్యర్థి ఎవరన్నది చర్చనీయాంశంగా మారింది.
నాగ్పూర్లో ప్రధాని మోదీ ఇలా..
ఈ క్రమంలో ఈనెల 14న ప్రధాని నరేంద్ర మోదీ నాగ్పుర్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకున్నది. భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నాగ్పూర్ నగరంలోని దీక్షభూమిలో అంబేడ్కర్కు ప్రధాని నివాళులు అర్పిస్తారు. అంబేద్కర్ బౌద్ధమతాన్ని స్వీకరించిన ప్రదేశంగా నాగ్పుర్లోని దీక్షభూమికి ఓ ప్రత్యేకత ఉంది. అంబేద్కర్ 126వ జయంతి సందర్భంగా ప్రధాని ఇక్కడ అయనకు నివాళులు అర్పిస్తారు.
మారుతున్న బీజేపీ వ్యూహం
సమాజంలోని బడుగువర్గాల అభ్యున్నతి కోసం అంబేద్కర్ సాగించిన అవిరళ కృషిని ప్రధాని తన ప్రసంగంలో వివరిస్తారని బీజేపీ వర్గాలు తెలిపాయి. అంబేద్కర్తో ప్రత్యేక అనుబంధమున్న దీక్షభూమి అభివృద్ధి విషయమై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. తద్వారా దళితులు, ముస్లిం వర్గాల్లో పాబల్యం పెంచుకోవటం ద్వారా రాబోయే ఎన్నికల్లో విజయాలు సాధించాలని ప్రయత్నిస్తున్న ప్రతిపక్ష పార్టీల ఎత్తుగడను దెబ్బతీసి ఆ వర్గాలను తమవైపు తిప్పుకునే వ్యూహంతో బీజేపీ ఉందని అంటున్నారు.
ఆరెస్సెస్తో సంప్రదింపుల తర్వాతే..
ఈ నేపథ్యంలోనే రాష్ట్రపతి ఎన్నికల్లో ఆ వర్గానికే చెందిన కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి థావర్చంద్ గెహ్లాట్ను తమ అభ్యర్థిగా ముందుకు తేవచ్చని భావిస్తున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి పార్లమెంట్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ దళిత నేతకు దీర్ఘకాలంగా ఆరెస్సెస్తో సంబంధాలున్నాయని కమలనాథులు చెప్తున్నారు. 14న నాగ్ పూర్ లోని అంబేద్కర్ దీక్షాభూమి వద్ద నివాళులర్పించిన తర్వాత ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్తో ప్రధాని భేటీ అవుతారని సమాచారం. ఈ సందర్భంగా ఎన్డీయే తరఫున రాష్ట్రపతి అభ్యర్థి ఖరారు అంశం చర్చకు వచ్చే అవకాశం ఉంది.
ఎన్డీయే భేటీలో ఇలా...
నాగ్పుర్లో ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్తో భేటీకి ముందే ఈ నెల 10న ఎన్డీయే భాగస్వామ్య పక్షాలతో దిల్లీలోని తన నివాసంలో ప్రధాని మోదీ భేటీ కానున్నారు. ఎన్డీయేకు చెందిన అగ్రనేతలందరూ హాజరయ్యే ఈ సమావేశంలో రాష్ట్రపతి అభ్యర్థి, కేంద్ర కేబినెట్లో మార్పు అంశాలు చర్చకు వచ్చే అవకాశముంది. మార్చి 29నే ఈ భేటీ జరగాల్సి ఉన్నా శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే హాజరుకాబోనని తెలపటంతో వాయిదాపడింది.