మోడీ ఏడాది: వివాదాలు-విజయాలు, నాటి వ్యాఖ్య
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఏడాది పాలన పైన మిశ్రమ స్పందన లభిస్తోంది. ఈ ఏడాది కాలంలో బీజేపీ ఓటు బ్యాంక్ స్వల్పంగా పెరిగింది. మోడీ పాలన పైన ప్రజలు కోటి ఆశలు పెట్టుకున్నారు. అయితే, ఆ స్థాయిలో రాణించలేకపోయారని విపక్షాల విమర్శిస్తున్నాయి.
అదే సమయంలో కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ.. తమ ఏడాది పాలనలో సాధించిన విజయాల గురించి చెప్పారు. రానున్న ఏడాది మరింత ముందుకు దూసుకెళ్తామని చెప్పారు. యూపీఏ పదేళ్ల పాటు చేసిన తప్పులను సరిదిద్దేందుకు సమయం తీసుకుంటుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
ఆ మాటకు వస్తే అది నిజమేనని మోడీ అభిమానులు చెబుతున్నారు. కాంగ్రెస్ చేసిన పాపులు కడిగేందుకే సమయం పడుతుందని అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా భారత దేశం ప్రతిష్టను మరింత పెంచే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. అదే విధంగా పలు పథకాలు ప్రవేశ పెట్టారని గుర్తు చేస్తున్నారు.
స్వచ్ఛ భారత్, ముద్ర బ్యాంక్, ప్రధాని జన్ ధన్ యోజన, పేదలకు పలు బీమా పథకాలు వంటివి ప్రవేశ పెట్టారు. అచ్చే దిన్ దిశగా ఎన్డీయే దూసుకుపోతోందని అంటున్నారు. విపక్షాలు మాత్రం.. మోడీ విదేశీ పర్యటనలకే ప్రాధాన్యమిస్తున్నారని, ఏడాది కాలంలో చేసిందేమి లేదని అంటున్నారు.
మోడీ సాధించిన విజయాల్లో.. అవినీతి, ధరలు తగ్గు ముఖం పట్టడం, స్వచ్ఛ భారత్, మైనార్టీలకు భద్రత పెరగడం, మత ఘర్షణలు తగ్గటం, జన్ ధన్ యోజన వంటివి అని చెప్పవచ్చు. రైతులకు ఏం చేయలేకపోవడం, అంచనాలు అందుకోకపోవడం వైఫల్యాలుగా చెబుతున్నారు. అయితే, ఏడాదికో కోటి ఆశలు తీరాలనుకోవడం కూడా సరికాదంటున్నారు. మేకిన్ ఇండియా, స్మార్ట్ సిటీలు ఎన్డీయే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు.
వివాదాలు...
కేంద్రం తెచ్చిన భూసేకరణ బిల్లు పైన విపక్షాలు ఆగ్రహం చెందాయి. పారిశ్రామికవేత్తలకు ప్రయోజనం చేకూర్చేందుకే మోడీ ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. అయితే, తాము తెచ్చిన ఈ బిల్లు ద్వారా రైతులకు ప్రయోజనం చేకూరుతుందని బీజేపీ చెబుతోంది.
దేశవ్యాప్తంగా 24 హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకాలు, పదోన్నతులు, బదిలీలకు సంబంధించి 22 ఏళ్లుగా అమల్లో ఉన్న కొలీజియం వ్యవస్థను రద్దు చేసి దాని స్థానంలో జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (ఎన్జేసీఏ)ను ఏర్పాటు చేశారు.
ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి నీతి అయోగ్ ఏర్పాటు చేశారు. కొందరు బీజేపీ ఎంపీలు, కేంద్రమంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కేంద్రాన్ని ఇబ్బందుల్లోకి నెట్టారు. కాగా, ప్రధాని అయ్యాక మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం గుర్తుంచుకోవాలని కొందరు అంటున్నారు.
కాంగ్రెస్ పదేళ్ల పాలన వల్ల భ్రష్టు పట్టిందని ఆయన అప్పుడు అభిప్రాయపడ్డారు. దీనిని బయటపడేసే క్రమంలో తొలి ఏడాది తనను ప్రజలు తిట్టుకుంటారని, మూడో ఏడాదికి ఫలితం వస్తుందని మోడీ వ్యాఖ్యానించినట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి.