అసెంబ్లీ రద్దు: కేసీఆర్కు మాట మీద నిలబడతారా?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రెండు రోజుల క్రితం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీకి చెందిన అయిదుగురు అభ్యర్థులు గెలుస్తారని, ఒక్కరు ఓడినా తాను అసెంబ్లీని రద్దు చేస్తానని సవాల్ చేశారు.
దీనిపై కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ధీటుగా స్పందించాయి. కేసీఆర్ వ్యాఖ్యలను ఇరు పార్టీలు స్వాగతించాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐదు స్థానాలు గెలవకుంటే అసెంబ్లీని రద్దు చేస్తానన్న సీఎం కేసీఆర్ ఆలోచనను కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర ప్రజలు స్వాగతిస్తున్నారని షబ్బీర్ అలీ అన్నారు.
ఏడాది కాలంలోనే మంత్రులు, ఎమ్మెల్యేల పైన కేసీఆర్కు నమ్మకం పోయిందా అని ప్రశ్నించారు. అధికారంలోకి వస్తామనే నమ్మకం లేకనే కేసీఆర్ అమలుకు సాధ్యం కానీ హామీలు ఇచ్చారన్నారు. ఇప్పుడు వాటిని ఎలా అమలు చేయాలో తెలియక హైరానా పడుతున్నారన్నారు.
తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా కేసీఆర్ వ్యాఖ్యలను స్వాగతించింది. అయితే, అదే సమయంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలతో పాటు తెరాస వ్యతిరేక వర్గాలు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.
సార్వత్రిక ఎన్నికలకు ముందు.. తాము అధికారంలోకి దళితులను ముఖ్యమంత్రి చేస్తామని కేసీఆర్ ప్రతి సమావేశంలో చెప్పారని, ఆ తర్వాత దానిని పక్కన పెట్టారని ఇప్పుడెలా నమ్మేదని అంటున్నారు. అంతేకాకుండా, ఓయు ఉద్యమంతో తెలంగాణ ఉద్యమానికి ఊపు వచ్చిందని, దాని వల్లే తెలంగాణ వచ్చిందని, ఇప్పుడు అలాంటి ఓయు భూములనే తీసుకుంటామని చెబుతున్నారని అంటున్నారు.
కేసీఆర్ సంచలనాల కోసమే అలాంటి ప్రకటనలు చేస్తుంటారనే వారు కూడా లేకపోలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో... ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే టీడీపీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డి కంటే తెరాస అభ్యర్థి గట్టెక్కే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
కొందరు ఇతర పార్టీల ఎమ్మెల్యేలు తెరాసకు మద్దతు పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహానాడు మరుసటి రోజే కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెరాసలోకి వెళ్లారు. మరికొందరు క్యూలో ఉన్నారని అంటున్నారు.
పరిస్థితి చూస్తుంటే తెరాస అభ్యర్థులు 5గురు గెలవవచ్చునని చెబుతున్నారు. అయితే, టీడీపీ కూడా తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో నిజంగానే తెరాస ఐదో అభ్యర్థి ఓడితే.. కేసీఆర్ అసెంబ్లీని నిజంగానే చేస్తారా? అనేది ఎంత వరకు నమ్మదగిందని అంటున్నారు.