టైం: మోడీకి పవన్ కళ్యాణ్ హెచ్చరిక, జగన్కు ఛాన్స్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా పైన తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలను విపక్షాలు లక్ష్యంగా చేసుకుంటున్నాయి. ముఖ్యంగా గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ-టీడీపీ కూటమికి మద్దతు పలికి జోరుగా ప్రచారం చేసిన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆ పార్టీలను హెచ్చరించడం గమనార్హం. ఏపీకి ప్రత్యేక హోదా ఆలస్యమవుతోందని కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు దుమ్మెత్తిపోస్తున్నాయి.
ప్రత్యేక హోదా గురించి టీడీపీ, బీజేపీలను విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఐదేళ్లు ప్రత్యేక హోదా అంటే.. బీజేపీ పదేళ్లు అని డిమాండ్ చేసిందని, ఇప్పుడేం చేస్తోందని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా నిలదీశారు. ఏపీ కాంగ్రెస్ ప్రత్యేక హోదా కోసం కోటి సంతకాల సేకరణ చేపట్టింది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజు మహాత్ముడి విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు.
ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయని కేంద్రం చెబుతోంది. ఏపీకి ప్రత్యేక హోదా ఎలా ఇస్తారని, ఏపీకి ఇస్తే కొత్తగా ఏర్పడిన తెలంగాణ(తెలంగాణ కొత్త రాష్ట్రమైనప్పటికీ, లోటు బడ్జెట్లో ఉంది మాత్రం ఏపీ)తో పాటు తమకు ఇవ్వాలని మరికొన్ని రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇది కేంద్రాన్ని చిక్కుల్లో పడేసింది. రాష్ట్రాలను ఒప్పించి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోందని కేంద్రమంత్రులు చెబుతున్నారు.
ప్రత్యేక హోదా కాకపోయినప్పటికీ.. ఆ పేరులో లేకుండా ఏపీకి సహకరిస్తామని మరికొందరు అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. ఒకవిధంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం పట్ల అసంతృప్తితోనే ఉన్నారు. ఏపీకి నెరవేర్చవలసిన హామీలను కేంద్రం నుండి నెరవేర్చుకునే దిశలో వెళ్దామని పార్టీ ఎంపీలకు ఇటీవల సూచించారు.
ప్రత్యేక హోదా, విభజన హామీలు కేంద్రం నెరవేర్చడం లేదని, వాటిని గట్టిగా అడగటంలో చంద్రబాబు విఫలమవుతున్నారని విపక్షాలు మండిపడుతున్న విషయం తెలిసిందే. మాజీ కేంద్రమంత్రి జైరామ్ రమేష్ కూడా దీని పైన సోమవారం నిలదీశారు. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ ద్రోహం చేస్తే, టీడీపీ వైఫల్యం చెందిందని విమర్శించారు. తెలంగాణకు అనుకూలం, ఏపీకి న్యాయం అని చెప్పిన బీజేపీ ఇప్పుడు ఏం చేస్తోందని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది.
అదే సమయంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా పైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు హెచ్చరిక చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, కొత్త రాజధానిలో రైతు కంటతడి పెట్టవద్దని పవన్ హితవు పలికారు. ప్రజలు బీజేపీని విశ్వసించి మద్దతిచ్చారని, ఇప్పుడు ప్రజల ఆకాంక్షల పైన వెనక్కి పోవద్దని సూచించారు.
పవన్ కళ్యాణ్ టైం చూసుకొని బీజేపీ, టీడీపీని టార్గెట్ చేశారని, తద్వారా విపక్షాలకు ఇది ఆయుధంగా మారిందని అంటున్నారు. కీలకమైన బడ్జెట్ సమావేశాల సమయంలో పవన్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరిక చేయడం గమనార్హం. మరోవైపు, కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఏపీకి ప్రత్యేక హోదా పైన పార్లమెంటులో నిలదీసేందుకు సిద్ధమయ్యాయి.