బాబుపై కెసిఆర్ మార్క్ డైలాగులు (పిక్చర్స్)
హైదరాబాద్: మాటలను ఈటెల్లా విసిరే నేర్పున్న ఆధునిక రాజకీయ నాయకుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఒకరు. ఆ మాటలు తిరగబడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా ఆయన తన మార్కు డైలాగులను వదిలిపెట్టలేదు. దాన్నే గిట్టనివారు నోరు చేసుకోవడమంటారు. ఆయన నోరు మంచిది కాదని కూడా అంటారు.
తాజాగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం రాత్రి ఆయన శ్రీశైలం వివాదంపై, విద్యుత్తు సమస్యపై సుదీర్ఘంగా మాట్లాడారు. శ్రీశైలం ఎడమగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తిని ఆపించడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శ్రీశైలం నీ అయ్య జాగీరా అంటూ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.
చంద్రబాబు తెలంగాణ సైతాన్లా వ్యవహరిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణకు పట్టిన దెయ్యానవంటూ దూషించారు. నీది దొంగ చూపు, అబద్ధాలు అడడానికి సిగ్గూ లజ్జ ఉండాలంటూ దుయ్యబట్టారు. తెలంగాణలో కరెంటు కష్టాలకు ‘నెంబర్ 1 దోషి చంద్రబాబే' అని ఆయన అన్నారు.
చంద్రబాబు దొంగ చూపు
చంద్రబాబు దొంగ చూపు కారణంగానే తెలంగాణకు అన్యాయం జరుగుతోందని కెసిఆర్ వ్యాఖ్యానించారు. ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచే తెలంగాణకు మోసం చేయాలని చూస్తున్నారు.
బెజవాడైనా సరే..
కరెంటు, నీటి వివాదాల విషయంలో ఎక్కడైనా చర్చకు సిద్ధమని, కాగితాలు తీసుకురావాలని చంద్రబాబుకు కేసీఆర్ సవాల్ విసిరారు. హైదరాబాద్లోని ఆబిడ్స్లోనైనా లేదా విజయవాడలో బ్యారేజీపైన అయినా సరే... వస్తానని తెలిపారు.
ముక్కు నేలకు రాస్తా..
కరెంట్ విషయంలో ‘నాది తప్పని తేలితే ముక్కు నేలకు రాయడానికి కూడా వెనుకాడను' అని కేసీఆర్ అన్నారు.
బండారం బయట పెడ్తాం
చంద్రబాబు బండారాన్ని ఆధారాలతో సహా బయటపెడుతామని, రావాల్సిందంతా ముక్కు పిండి వసూలు చేస్తామని, కోర్టులో జరిమానా కూడా వేస్తారని, అప్పుడు చంద్రబాబు తలకాయ ఎక్కడ పెట్టుకుంటాడో ఆలోచించుకోవాలని కెసిఆర్ అన్నారు.
ముక్కు పిండి వసూలు
ఎట్టి పరిస్థితిలోనూ తెలంగాణకు రావాల్సిన విద్యుత్తును వదిలిపెట్టేది లేదని, ముక్కు పిండి వసూలు చేస్తామని కెసిఆర్ అన్నారు.
దేశంలోనే నీచాతినీచంగా..
దేశంలోనే నీచాతినీచంగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబేనని, చంద్రబాబు చేసిన అన్యాయానికి సాక్ష్యాలున్నాయని కెసిఆర్ అన్నారు.
నాలుకా తాటిమట్టా..
చంద్రబాబూ, నీది నాలుకా, తాటిమట్టానా అని కెసిఆర్ అడిగారు. వైయస్ హయాంలో జీవో 107 ప్రకారం శ్రీశైలం జలాశయంలో నీటి మ్టటాని్ని 834 నుంచి 854కు పెంచితే వ్యతిరేకించింది చంద్రబాబేనని ఆయన గుర్తు చేశారు.