రాష్ట్రపతి ఎవరో తేలేది నేడే: సాయంత్రానికల్లా పూర్తి ఫలితాలు..
తొలుత పార్లమెంటు భవనంలోని బ్యాలెట్ పెట్టెను తెరుస్తామని రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన లోక్సభ సెక్రటరీ జనరల్ అనూప్ మిశ్రా తెలిపారు.
న్యూఢిల్లీ: భారత అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతికి ఎవరు ఎన్నికవుతారన్నది నేడే తేలిపోనుంది. ప్రణబ్ వారసుడిగా రాష్ట్రపతి పీఠాన్ని కైవసం చేసుకోబోయెదెవరు? అన్న దానిపై ఈ సాయంత్రానికల్లా తేలిపోనుంది.
ఈ మేరకు గురువారం ఉదయం 11 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. తొలుత పార్లమెంటు భవనంలోని బ్యాలెట్ పెట్టెను తెరుస్తామని రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన లోక్సభ సెక్రటరీ జనరల్ అనూప్ మిశ్రా తెలిపారు. తదనంతరం అల్ఫాబెట్ ఆర్డర్ ప్రకారం.. మిగతా రాష్ట్రాల పెట్టెలను తెరిచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
గెలిస్తే.. తొలి బీజేపీ రాష్ట్రపతిగా 'ఆయన'.. ఓడిన రెండో కాంగ్రెస్ అభ్యర్థిగా 'ఆమె'
మొత్తం 8 రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ పూర్తవుతుందని, సాయంత్రానికల్లా పూర్తి ఫలితం వస్తుందని అన్నారు. కాగా, రాష్ట్రపతి ఎన్నికల్లో ఈ దఫా ఇద్దరు దళిత అభ్యర్థులే బరిలో దిగడం తెలిసిన విషయమే. ఎన్డీఏ పక్షాల తరపున రామ్నాథ్ కోవింద్, ప్రతిపక్షాల అభ్యర్థిగా మీరా కుమార్ బరిలో నిలిచారు.
రాష్ట్రపతిని ఎన్నికల్లో మొత్తం 4896 మందికి ఓటుహక్కు ఉండగా సోమవారం జరిగిన పోలింగ్లో 99 శాతం మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. గెలిచిన అభ్యర్థి 14వ రాష్ట్రపతిగా ఈనెల 25 ప్రమాణ స్వీకారం చేయనున్నారు.