కాజీపేట టు బెజవాడ! తెలుగు రాష్ట్రాల్ని పట్టించుకోలేదు
హైదరాబాద్: ఎన్డీయే అధికరంలోకి వచ్చిన తర్వాత తొలిసారి ప్రవేశ పెట్టిన రైల్వే బడ్జెట్ పైన తెలుగు రాష్ట్రాలు (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. అయితే, ఈ బడ్జెట్ తమను తీవ్రంగా నిరాశపరిచిందని విపక్షాలు చెబుతున్నాయి.
కొత్త ప్రాజెక్టులు, కొత్త రైళ్లు లేకుండా రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు బడ్జెట్ ప్రవేశపెట్టారు. దీనిపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఈ బడ్జెట్ పైన ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. కానీ నిరాశపరిచిందని చెబుతున్నారు.
విశాఖ ప్రత్యేక జోన్ ప్రస్తావన లేదు. తెలంగాణ రాష్ట్రం కూడా కోటి ఆశలు పెట్టుకుంది. కాజీపేట - విజయవాడ మధ్య మాత్రం మూడో లైన్ నిర్మాణానికి పచ్చ జెండా ఊపారు. ఒకటి ఆరాలతోనే చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారని విమర్శిస్తున్నారు. విభజన హామీల్లో ఒకటైన ఏపీకి ప్రత్యేక జోన్ హామీని పట్టించుకోలేదంటున్నారు.
కొత్త రైళ్లు, లైన్ల కోసం తెలుగు రాష్ట్రాల ఎంపీలు చేసిన ప్రతిపాదనలు బుట్టదాఖలు అయ్యాయి. విశాఖ, తిరుపతి రైల్వే జోన్ల ఏర్పాటు చేయాలన్న డిమాండ్కు స్పందన లేకుండా పోయిందంటున్నారు. పెండింగ్ ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తామన్నప్పటికీ ఆ ఊసు లేదు. కానీ వైపై, టెక్నాలజీ, భద్రత, మౌలిక సదుపాయాలకే పెద్ద పీట వేశారు.
కొత్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కు ఒక్క ప్రాజెక్టు ప్రకటించక పోవడం బాధాకరమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత మైసరా రెడ్డి అన్నారు. ఈ రైల్వే బడ్జెట్ పూర్తిగా నిరాశపరిచిందని, ఆశ్చర్యం కలిగించిందని తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనంద భాస్కర్ అన్నారు.
ఈ బడ్జెట్లో భద్రతకు, రవాణాకు, మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేశారని బీజేపీ నేత చింతల రామచంద్రా రెడ్డి అన్నారు. ఎన్డీయే ప్రభుత్వం మొదటి నుండి పాత ప్రాజెక్టులను పూర్తి చేసే అంశాలపై దృష్టి సారించిందని, పాతవి అలాగే ఉంచి, కొత్త వాటిని ప్రకటిస్తే లాభమేమిటని కొందరు అంటున్నారు.
కొత్త ప్రాజెక్టుల ఊసులేకుండా బడ్జెట్ తొలిసారి కావడం గమనార్హం. ఇదిలా ఉండగా, పార్లమెంటు సమావేశలు ముగిసే లోగా కొత్త రైళ్ల ప్రకటన చేస్తామని చెప్పడం కొంత ఊరట కలిగిస్తోంది. అయితే తెలుగు రాష్ట్రాలకు అందులో ఏమాత్రం న్యాయం చేస్తారో చూడాలి.