పీకల్లోతు కష్టాలు: బాధపడ్డ అనీల్ అంబానీ, జియోతో చిక్కులు, అన్నతో ఓకే
రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్) ఛైర్మన్ అనీల్ అంబానీ పీకల్లోతు కష్టాల్లో ఉన్నారు.
ముంబై: రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్) ఛైర్మన్ అనీల్ అంబానీ పీకల్లోతు కష్టాల్లో ఉన్నారు. సంస్థ పొందిన రుణాలు 45,000 కోట్ల రూపాయలకు చేరిన నేపథ్యంలో వివిధ గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీలు ఆర్కామ్ క్రెడిట్ రేటింగ్ను దారుణంగా తగ్గించాయి.
కాగా, ఈ పరిణామం తనను చాలా బాధించిందంటూ రిలయన్స్ కమ్యూనికేషన్స్ అధినేత అనిల్ అంబానీ వ్యాఖ్యానించారు. శుక్రవారం ఇక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డిసెంబర్ 31 వరకు రుణ దాతలు (బ్యాంకర్లు) సమయం ఇచ్చారని తెలిపారు.
దిద్దుబాటు చర్యలు
రుణ చెల్లింపులకు సంబంధించి బ్యాంకర్ల నుంచి ఏడు నెలల(డిసెంబర్ 31వరకు) ఉపశమనం లభించిందని, అందువల్ల ఆందోళన చెందనక్కర్లేదని మదుపర్లలో భరోసా నింపారు అనీల్ అంబానీ. ‘మా ప్రణాళికను బ్యాంకర్లు, సంయుక్త రుణ సంస్థల ఫోరమ్లు అంగీకరించాయి. వ్యూహాత్మక రుణ పునర్వ్యవస్థీకరణ నిబంధనలో భాగంగా రిలయన్స్ కమ్యూనికేషన్స్కు ఏడు నెలల పాటు అంటే 2017 డిసెంబరు వరకు గడువు లభించింది' అని అనిల్ స్పష్టం చేశారు.
ఆ పరిస్థితి రానివ్వం
ఒకవేళ అప్పటిలోపు చెల్లించకుంటే రుణ పునర్వ్యవస్థీకరణలో భాగంగా రుణాలను ఈక్విటీ కిందకు బ్యాంకులు మారుస్తాయి. అయితే బ్యాంకులు ఇచ్చిన డిసెంబరు గడువు కంటే ముందే, బ్రూక్ఫీల్డ్, ఎయిర్సెల్ లావాదేవీల ద్వారా వచ్చే రూ.25,000 కోట్లతో సెప్టెంబరు కల్లా అప్పు భారం రూ.20,000కి తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఏడు నెలల సమయంలో రుణాన్ని ఈక్విటీగా మార్చే ప్రక్రియకు బ్యాంకులు పూనుకోవని అన్నారు. ‘గడువు లోపు మా ప్రణాళిక అనుకున్న విధంగా నెరవేరకుంటే డిసెంబరు చివర్లో రుణ పునర్వ్యవస్థీకరణ కింద బ్యాంకులు వాటికి ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చు' అని పేర్కొన్నారు. అయితే ఈ పరిస్థితి రానివ్వమని అనీల్ చెప్పారు.
జియోతో లాభాలు తలకిందులు
అయితే అనిల్ అంబానీ అన్నయ్య ముకేశ్ అంబానీ.. రిలయన్స్ జియోతో దేశీయ టెలికామ్ రంగంలోకి చేసిన ప్రవేశంతో రిలయన్స్ కమ్యూనికేషన్స్సహా అన్ని టెలికామ్ సంస్థల ఆదాయం తలకిందులైంది. ఉచిత 4జి సేవలతో లాభాలు హరించుకుపోయాయి. రిలయన్స్ కమ్యూనికేషన్స్ తాజా పరిస్థితికి జియో ప్రధాన కారణమని ఆ సంస్థ సిఎఫ్ఒ పునిత్ గార్గ్ వ్యాఖ్యానించడమే దీనికి నిదర్శనం. ప్రస్తుతం దేశీయ టెలికామ్ రంగం ఇబ్బందుల్లో ఉందన్న ఆయన ప్రతికూల పరిస్థితుల కారణంగా ఈ ఏడాది 40,000 ఉద్యోగాలు పోయే ప్రమాదముందనీ హెచ్చరించారు.
దేశ చరిత్రలో తొలిసారి
కెనడాకు చెందిన బ్రూక్ఫీల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు రిలయన్స్ ఇన్ఫ్రాటెల్లో వాటాను విక్రయించడం ద్వారా రూ.11,000 కోట్లు వస్తాయని అనిల్ పేర్కొన్నారు. దీంతో పాటు ఆర్కామ్ వైర్లెస్ వ్యాపారాన్ని ఎయిర్సెల్లో విలీనం చేసి ఎయిర్కామ్ అనే కొత్త సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ లావాదేవీ వల్ల సుమారు 60 శాతం అప్పు తగ్గుతుందని వెల్లడించారు. మరికొంత రుణాన్ని తగ్గించుకునేందుకు విదేశాల్లోని వ్యాపారాల్లో వాటా విక్రయాన్ని కూడా ఆర్కామ్ పరిశీలిస్తోందని తెలిపారు. డీటీహెచ్ వ్యాపారం, స్థిరాస్తులను విక్రయించే యోచనలో ఉన్నట్లు కూడా తెలిపారు. దేశ చరిత్రలోనే ఒక కంపెనీ ఈ స్థాయిలో రుణాన్ని తగ్గించుకోవడం ఎప్పుడు జరగలేదని తెలిపారు. ‘ఎయిర్సెల్, ఆర్కామ్ల విలీనం ద్వారా ఎయిర్కామ్ అనే కొత్త సంస్థను ఏర్పాటు చేయనుండటం, కెనడాకు చెందిన బ్రూక్ఫీల్డ్కు రిలయన్స్ ఇన్ఫ్రాటెల్లో వాటాను విక్రయించనుండటం లాంటి ప్రతిపాదనల విషయంలో గణనీయ పురోగతి ఉండటాన్ని బ్యాంకర్లు పరిగణనలోకి తీసుకున్నాయని అనిల్ వెల్లడించారు. మరోవైపు రేటింగ్ ఏజెన్సీలు ఆర్కామ్ రేటింగ్ను తగ్గించడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. సాధ్యమైనంత త్వరగా తిరిగి రేటింగ్ పెంచుకోవడంపై దృష్టి సారిస్తామని పేర్కొన్నారు.
అన్నయ్యతో సత్సంబంధాలు
తనకు, అన్నయ్య ముకేశ్ అంబానీకి మధ్య సుహృద్భావ వాతావరణం ఉందని అనిల్ అంబానీ వెల్లడించారు. ఆయనపై నాకు పూర్తి గౌరవం ఉందని అన్నారు. అందువల్ల ఇరువురి మధ్య సంబంధ బాంధవ్యాలపై వస్తోన్న వార్తలు వూహాగానాలేనని అన్నారు. వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకున్నప్పటికీ మా ఇద్దరి సంస్థలు వేర్వేరు సంస్థలుగానే కొనసాగుతాయని పేర్కొన్నారు. ‘స్పెక్ట్రమ్, ఫైబర్, సరిళ్ల రోమింగ్, టవర్ తదిరతరాల వినియోగం విషయంలో మా ఇద్దరి కంపెనీలు వ్యూహత్మక సహకారాన్ని అందించుకుంటున్నాయి. దీని వల్ల వ్యయాలు తగ్గడం సహ పలు ప్రయోజనాలున్నాయి. అందువల్ల పరస్పర సహకారం మున్ముందూ కొనసాగుతుంది' అని ఆయన అన్నారు. తండ్రి ధీరుభాయ్ అంబానీ వ్యాపార సామ్రాజ్యాన్ని అన్నదమ్ములు ముకేశ్, అనిల్ అంబానీలు పంచుకున్న విషయం తెలిసిందే.