‘రిషికేశ్వరి కేసు నీరుగారుస్తున్నారు’: ఆందోళన
గుంటూరు: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో విద్యార్థిని రిషికేశ్వరి ఆత్మహత్య కేసును నీరుగార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కీలక నిందితుల పట్ల అధికారులు, పోలీసులు మెతకవైఖరి అవలంబిస్తున్నట్లు విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ కేసులో తన ఆత్మహత్యకు కారణమైన వ్యక్తుల పేర్లను రిషికేశ్వరి తన రెండవ డైరీలో స్పష్టంగా పేర్కొన్నా.. ఇంతవరకు వారిపై చర్యలు తీసుకోవడంలో పోలీసుశాఖ విఫలమైనట్లు తెలుస్తోంది. రిషికేశ్వరి మృతికి కారణాలను వివరిస్తూ ప్రభుత్వం నియమించిన సుబ్రమణ్యం కమిటీ ఇచ్చిన నివేదిక కూడా బుట్టదాఖలైనట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సీనియర్ విద్యార్థులతో అర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపాల్ బాబూరావు చెట్టాపట్టాలేసుకుని తిరగడం, వారితో కలసి మద్యం తాగి చిందులేయడం వల్లే సీనియర్లు రెచ్చిపోయి రిషికేశ్వరి పట్ల అనుచితంగా ప్రవర్తించారని నివేదికలో కమిటీ స్పష్టం చేసింది. అయినా ప్రిన్సిపాల్పై ఇంతవరకు కఠిన చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
విశ్వవిద్యాలయంలో క్రమశిక్షణ లోపించిందని, వర్సిటీలో మద్యం తాగడం సర్వసాధారణంగా మారిందని కమిటీ తెలిపింది. మరికొన్ని కీలక అంశాలను కూడా వెల్లడించింది. వర్సిటీ నియమించిన నిజనిర్ధారణ కమిటీ సైతం బాబూరావు చర్యలను తప్పుపడుతూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
విద్యార్థి సంఘాల నాయకులు బాబూరావును ప్రథమ నిందితునిగా చేర్చి అరెస్ట్ చేయాలని కోరుతూ ఆందోళన చేస్తుంటే.. అధికారులు వారిపై నిషేధం విధించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సమస్యలపై పోరాడే తమపై ఈ విధంగా వేటు వేయడం భావ ప్రకటనా స్వేఛ్చను హరించడమే అవుతుందని విద్యార్థి సంఘాల నాయకులు మండిపడ్డారు.
రిషికేశ్వరి ఆత్మహత్యకు బాధ్యులను శిక్షించలేని ప్రభుత్వం ఈ విషయమై నిలదీస్తున్న తమ గొంతునొక్కాలని చూస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిషికేశ్వరి ఆత్మహత్య కేసులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా నిందితులను కఠినంగా శిక్షించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రభుత్వ హయాంలో యూనివర్సిటీల్లో కూడా విద్యార్థులకు రక్షణ లేకుండా పోతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.