శశికళ వ్యూహాలు ఇవే: పన్నీరు వర్గంపై దెబ్బ, పీఠం కోసం..
శశికళ ముఖ్యమంత్రి పీఠం అధిష్టించి, పన్నీర్ సెల్వం వర్గాన్ని దెబ్బ తీయడానికి పకడ్బందీ వ్యూహంతో ముందుకు నడుస్తున్నట్లు చెబుతున్నారు. ఆమె వ్యూహమేమిటి..
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకుని, పన్నీరు సెల్వం మద్దతుదారులను దెబ్బ కొట్టడానికి అన్నాడియంకె ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్ పకడ్బందీ వ్యూహరచన చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి పీఠం దక్కించుకోవడానికి ఆమె బహుముఖ వ్యూహాలను అనుసరిస్తున్నారు. తాజాగా ఆమె కోర్టు మెట్లు ఎక్కారు.
శాసనసభ్యుల పరేడ్కు గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర రావు అనుమతి ఇవ్వకపోవడంతో ఆమె రాష్ట్రపతి భవన్ మెట్లు ఎక్కాలని కూడా ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. ఎమ్మెల్యేలు చేజారకుండా ఆమె ప్రతి నిత్యం అత్యంత జాగరూకతతో వ్యవహరిస్తున్నారు. గత రెండు రోజులుగా ఆమె గవర్నర్ తీరుపై మండిపడుతున్నారు. వెనక్కి తగ్గేది లేదని అత్యంత స్పష్టంగా చెబుతున్నారు.
పన్నీరుకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలపై ఇలా..
ముఖ్యమంత్రి పన్నీర్సెల్వంకు మద్దతు ప్రకటించిన అన్నాడీఎంకే శాసనసభ్యులపై చర్యలు తీసుకోవడానికి శశికళ వ్యూహరచన చేసినట్లు సమాచారం. ఆ శాసనసభ్యులను ఇప్పటికిప్పుడు పార్టీ నుంచి బహిష్కరించకుండా శాసనసభలో జరిగే బలపరీక్షలో వారు తీసుకునే నిర్ణయాన్ని బట్టి చర్య తీసుకోనున్నట్టు తెలుస్తోంది. మెజారిటీ శాసనసభ్యులు తన చెంతనే ఉండడం శశికళకు ఊరట కాగా, వారు జారిపోతారేమోననే ఆందోళన కూడా పట్టిపీడిస్తోంది.
సినియర్ నెతలపై శశికళ ఇలా..
తనపై తిరుగుబాటు చేసిన పన్నీర్సెల్వంకు పార్టీ సీనియర్ నాయకులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు మద్దతు ిస్తున్నారు. తొలుత పార్టీపై తిరుగుబాటు చేసిన పన్నీర్సెల్వం నిర్వర్తిస్తున్న పార్టీ కోశాధికారి పదవి నుంచి శశికళ తొలగించారు. ఆ తర్వాత పన్నీర్కు మద్దతునిచ్చిన పార్టీ ప్రిసీడియం చైర్మన్ మధుసూదన్ను ఆ పదవి నుంచి తొలగించారు. పన్నీర్ వర్గంలో చేరిన పార్లమెంట్ సభ్యులను సైతం పార్టీ నుండి తొలగిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే ముఖ్యమంత్రి పన్నీర్సెల్వంను గానీ, ఆయనకు మద్దతునిస్తున్న శాసనసభ్యులను గానీ పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించలేదు. ప్రస్తుతం పన్నీర్ వర్గంలో మంత్రి మాఫాయ్ పాండ్యరాజన సహా మొత్తం ఆరుగురు అన్నాడీఎంకే శాసనసభ్యులు ఉన్నారు.
పార్టీ పరంగా చర్యలు తీసుకుంటే ఇబ్బందులొస్తాయని..
ఇప్పుడే పార్టీ పరంగా చర్యలు తీసుకుంటే తాను ముఖ్యమంత్రి కావాలనే లక్ష్యానికి అడ్డంకులు ఎదురవుతాయని శశికళ భావిస్తున్నారు. ఒక వేళ రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర రావు శాసనసభలో బలపరీక్షకు ఆదేశాలిస్తే అదే అదనుగా ముఖ్యమంత్రి పన్నీర్సెల్వం, ఆయనకు మద్దతునిచ్చే శాసనసభ్యులను పార్టీ విప్ ఆదేశాలు జారీ చేసి వారిని అనర్హులుగా చేయాలని ఆలోచిస్తున్నారు.
శశికళ ఇలా చేస్తారు..
శాసనసభలో బలపరీక్ష చేసుకోవడానికి గవర్నర్ అవకాశం కల్పిస్తే అన్నాడీఎంకే పార్టీ విప్ శశికళకు మద్దతు నివ్వాలని విప్ జారీ చేస్తారు. ఆ విప్ను ఉల్లఘించి పార్టీ శాసనసభ్యులు ఓటువేస్తే వారిపై అనర్హత వేటు పడుతుంది. దాంతో వారంతా శాసనసభ్యత్వాన్ని కోల్పోతారని శశికళ భావిస్తున్నారు. అందుకే ఆమె వేచి చూస్తున్నారు. ఎలాగైనా ముఖ్యమంత్రి పీఠం దక్కించుకుని బలపరీక్షకు సిద్ధం కావాలనే యోచనలో శశికళ ఉన్నట్లు తెలుస్తోంది.
పన్నీరు సెల్వం ధీమా ఇదే..
శశికళ తీసుకోబోయే చర్యలపై పన్నీర్సెల్వం న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఓ పార్టీ నుంచి మరొక పార్టీలో చేరితేనే పార్టీ ఫిరాయింపుల కింద శాసనసభ్యత్వాన్ని కోల్పోయేందుకు అవకాశం ఉందని, అయితే ప్రస్తుతం ఒకే పార్టీలో ఇరువర్గాలు రెండు రకాల నిర్ణయాలు తీసుకోవాల్సి ఉండటంతో అనర్హత వేటు పడే అవకాశం లేదని న్యాయనిపుణులు పన్నీర్సెల్వంకు స్పష్టం చేశారని అంటున్నారు.