ఎవరూ రావడం లేదేం!: సొంత నేతలపై శశికళ గుర్రు
పరప్పన అగ్రహార జైలులో ఉన్న అన్నాడీఎంకే అధినేత్రి శశికళ సొంత పార్టీ నేతలపై గుర్రుగా ఉన్నారా? అంటే అవుననే అంటున్నారు.
చెన్నై/బెంగళూరు: పరప్పన అగ్రహార జైలులో ఉన్న అన్నాడీఎంకే అధినేత్రి శశికళ సొంత పార్టీ నేతలపై గుర్రుగా ఉన్నారా? అంటే అవుననే అంటున్నారు. సీఎం పీఠం ఎక్కాల్సిన సమయంలో శశికళ జైలుకు చేరారు. ఆమె స్థానంలో పళనిస్వామి సీఎం అయ్యారు. ఇప్పుడు అదే శశికళ పార్టీ నేతలపై అసంతృప్తితో ఉన్నారట.
శశికళ బెంగళూరు అగ్రహారం జైలుకు వెళ్లి నెల రోజులు దాటింది. ఈ సందర్భంగా ఆమె జైలు జీవితం మళ్లీ వెలుగులోకి వచ్చింది. మొదట్లో ఆమెను పరామర్శించడానికి అన్నాడీఎంకే నేతలు క్యూ కట్టారు. క్రమంగా అసలు అక్కడికి రావడమే మానేశారు.
సరస్వతి సహా వీరు కలిశారు..
ఇప్పటివరకు సెంగొట్టయ్యన్, దిండుగల్లు శ్రీనివాసన్, సెల్లూరు రాజా, ఆర్ కామరాజ్ తదితర మంత్రులు, పార్టీ నేతలు ఆమెను కలిసి పరామర్శించారు. శశికళను కలుసుకున్నవారిలో మాజీ మంత్రులు వలర్మతి, గోకుల ఇందిర, ఏఐఏడీఎంకే నేతలు సరస్వతి, దినకరన్ తదితరులు కూడా ఉన్నారు.
శశికళ వారించారు
శశికళ స్థానంలో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన పళనిస్వామి, మరికొందరు మంత్రులు బెంగళూరు వెళ్లాలనుకున్నారు. తొలుత శశికళనే వారిని వద్దని వారించారు.
ఆ తర్వాత శశికళ దర్శనం లేదు
విశ్వాస పరీక్ష నెగ్గిన తర్వాతే తనను పరామర్శించేందుకు రావాలని దినకరన్తో కబురు పెట్టారు. అయితే ఆ తర్వాత ఆమె విషయమే పట్టనట్టుగా ముఖ్యమంత్రి, సహచర మంత్రులు వ్యవహరిస్తూ వచ్చారు. ఇప్పటి వరకు అగ్రహారం జైలువద్దకు వెళ్లి శశికళ దర్శనం చేసుకోలేదు. దీంతో శశికళ తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నట్టు చెబుతున్నారు.
ఆర్కే నగర్పై శశికళ ఉత్కంఠ!
మరోవైపు జయ మృతితో ఖాళీ అయిన ఆర్కే నగర్ ఎమ్మెల్యే స్థానంపై పార్టీ అసమ్మతి వర్గీయులు, శశికళ వర్గానికి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ ఉపఎన్నికలో ప్రజలు శశికళ వైపు మొగ్గు చూపుతున్నారా లేదా అన్నది తేలనుండడంతో, శశికళ ఇక్కడి రాజకీయ పరిణామాలపై కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారని తెలుస్తోంది.