తమిళనాట చిచ్చు: రజినీని అడ్డుకుంటానన్న శరత్ కుమార్
రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే ఎదిరించేవారిలో మొదట తానే ఉంటానని సమత్తవ మక్కల్ కట్చి అధ్యక్షుడు, నటుడు శరత్ కుమార్ చెప్పారు.
చెన్నై: తమిళనాట మరోసారి రాజకీయాలు చిచ్చు రగులుకుంది. తమిళనాడు సీఎం జయలలిత మరణంతో సూపర్ స్టార్ రజనీ కాంత్ రాజకీయాల్లోకి రావాలంటూ పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వస్తున్న విషయం తెలిసిందే. అంతేగాక, పలు పార్టీల నేతలు కూడా తమ పార్టీలో చేరాలంటూ స్వాగతం పలుకుతున్నారు.
అయితే, ఇప్పటి వరకు కూడా రజినీకాంత్ తన రాజకీయ రంగ ప్రవేశంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కాగా, జల్లికట్టు క్రీడను కొనసాగించాలని, ఇది తమిళ సాంప్రదాయక క్రీడ అని రజినీకాంత్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారితీశాయి. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రజల్లోకి వెల్లడంతో పలు రాజకీయ నేతలు ఆయన రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నట్లు భావిస్తున్నాయి.
అసాధారణ పరిస్థితి: జల్లికట్టుపై రజినీ షాకింగ్ కామెంట్స్
ఈ నేపథ్యంలో రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే ఎదిరించేవారిలో మొదట తానే ఉంటానని సమత్తవ మక్కల్ కట్చి అధ్యక్షుడు, నటుడు శరత్ కుమార్ పేర్కొనడం తమిళనాడులో రాజకీయ వేడిని రాజేసింది. కాగా, శరత్ కుమార్ వ్యాఖ్యలు తమిళనాట తీవ్ర దుమారం రేపుతున్నాయి.
శరత్ కుమార్కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు తీవ్రమయ్యాయి. వేలూరులో శరత్ కుమార్ దిష్టి బొమ్మలను దగ్ధం చేసిన రజనీ అభిమానులు.. రోడ్లపై ఆందోళనలకు దిగారు.
ఈ సందర్భంగా రజినీకాంత్ రాజకీయాల్లోకి రావాలంటూ అభిమానులు ఆకాంక్షించారు. అయితే, గతంలో తనకు నచ్చిన పార్టీలకు మద్దతిచ్చినట్లు సంకేతాలిచ్చిన రజినీకాంత్.. తాను నేరుగా మాత్రం రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఎక్కడా స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం.