టీఆర్ఎస్కు ఎదురుగాలి: టీడీపీ పుంజుకుంటుందా?
హైదరాబాద్: తెలంగాణలో 9 ఎంపీటీసీ స్ధానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్ఎస్కు పెద్ద షాక్ తగిలింది. టీఆర్ఎస్ పార్టీకి ఎంతో పట్టున్న జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్ధులు విజయం సాధించారు. రంగారెడ్డి జిల్లాలో రెండు ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో రాజేంద్రనగర్ మండలం వట్టినాగులపల్లిలో టీడీపీ విజయం సాధించగా, సరూర్నగర్ మండలం జల్పల్లి స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు.
ఖమ్మం జిల్లాలో ఒకే ఒక్క ఎంపీటీసీ స్ధానానికి జరిగిన ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. జిల్లాలోని కారేపల్లి మండలం రేలకాయపల్లి ఎంపీటీసీ ఉపఎన్నికలో టీడీపీ అభ్యర్ధి మట్కు 166 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. మహబూబ్నగర్ జిల్లాల్లో నిర్వహించిన రెండు ఎంపీటీసీ స్థానాల ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి అసెంబ్లీ నియోజకవర్గమైన కొడంగల్లో టీడీపీ హవా కొనసాగింది.
మద్దూరు మండలం బూనీడు ఎంపీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఘన విజయం సాధించారు. టీఆర్ఎస్ అభ్యర్ధి నరేందర్రెడ్డిపై టీడీపీ అభ్యర్థి విజయలక్ష్మీ 692 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. ఇక్కడ మూడు నెలల క్రితం టీడీపీ ఎంపీటీసీ పద్మ అనారోగ్యంతో చనిపోవడంతో ఉప ఎన్నిక వచ్చింది.
టీఆర్ఎస్కు గట్టి పట్టున్న వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం ఊరట్టం ఎంపీటీసీకి జరిగిన ఉప ఎన్నికల్లో 75 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి రాజు విజయం సాధించారు. ఇక్కడ కాంగ్రెస్ ఎంపీటీసీ రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక వచ్చింది. ఇదే జిల్లా బచ్చన్నపేట మండలం కేశిరెడ్డిపల్లి ఎంపీటీసీ ఎన్నికలో టీఆర్ఎస్ విజయం సాధించింది.
పాలమూరులోని నవాబ్పేట మండలం కూచూరు ఎంపీటీసీ స్థానాన్ని టీఆర్ఎస్ కైవశం చేసుకుంది. ఇక సీఎం కేసీఆర్ సొంత జిల్లా మెదక్లో సదాశివపేట మండలం పెద్దాపూర్ ఎంపీటీసీ ఎన్నికలో టీఆర్ఎస్ గెలుపొందింది. నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం ముసిపట్ల ఎంపీటీసీ స్థానాన్ని టీఆర్ఎస్ అభ్యర్థి గెలుచుకున్నారు.
ఇలా తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా 9 ఎంపీటీసీ స్ధానాలకు ఉప ఎన్నికలు జరిగితే, అందులో ఆరు స్ధానాలకు పోటీ చేసిన టీడీపీ నాలుగు స్ధానాలు గెలుచుకోవడంతో ఆ పార్టీ వర్గాల్లో సంతోషం వ్యక్తం అవుతోంది. ఇదంతా చూస్తుంటే, తెలంగాణలో క్రమేపీ టీడీపీ పుంజుకుంటుందా అని అనిపిస్తోంది?
ఉప ఎన్నికల ఫలితాల విజయానంతరం టీడీపీ పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయడం మానేసి టీడీపీ నాయకుల కేసులపైనే దృష్టి పెట్టిందని మండిపడ్డారు.
త్వరలో తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసేందుకు గాను 30 వేల మంది పార్టీ కార్యకర్తలకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ను ఇష్టారాజ్యంగా మార్చివేసి సీఎం కేసీఆర్ దక్షిణ తెలంగాణ నోరు కొడుతున్నారని టీడీపీ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి ఆరోపించారు.