సిద్ధూ వివాదం: ఎన్టీఆర్ లాగే, అప్పుడు కోర్టు ఇలా....
ప్రస్తుతం సిద్ధూ ఎదుర్కుంటున్న పరిస్థితినే ఎన్టీఆర్ 1989లో ఎదుర్కున్నారు. అప్పుడు హైకోర్టు ఏం చెప్పింది, ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయం ఏమిటి....
హైదరాబాద్: పంజాబ్ సాంస్కృతిక శాఖ మంత్రి నవజోత్ సింగ్ సిద్ధూ వివాదం ఒకప్పటి ఎన్టీ రామారావు విషయంలో చెలరేగిన వివాదాన్ని తలపిస్తోంది. టీవీ షోలో తాను పాల్గొనడం తప్పదని సిద్ధూ మొండికేస్తున్న విషయం తెలిసిందే. మంత్రిగా తన విధులకు సంబంధం లేని మరో పని సిద్ధూ చేయవచ్చునా, లేదా అనే ప్రశ్న ఉత్పన్నమైంది.
తన సొంత ఖర్చుల కోసం తాను టీవీ షోలో పాల్గొంటానని, దాంతో మంత్రులకు సంబంధించిన ప్రవర్తనా నియమావళి కూడా చర్చలోకి వచ్చింది. అది మంత్రుల ప్రవర్తనా నియమావళికి విరుద్ధమనే మాట వినిపిస్తోంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీ రామారావు విషయంలోనూ అటువంటి వివాదమే చెలరేగింది. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1989లో బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రంలో నటించాలని ఎన్టీఆర్ నిర్ణయించుకున్నారు. ఆయన నిర్ణయాన్ని ఎపి హైకోర్టులో సవాల్ చేశారు.
అప్పుడు హైకోర్టు ఇలా....
బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలో నటించాలనే ఎన్టీఆర్ నిర్ణయంపై హైకోర్టు స్పష్టమైన తీర్పు ప్రకటించింది. తాను ఉన్న పదవికి సంబంధించిన బాధ్యతలనే కాకుండా ఇతర బాధ్యతలను ముఖ్యమంత్రి గానీ, మంత్రి గానీ నిర్వహించకూడదని ఏ చట్టమూ చెప్పలేదని అప్పటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి యోగేశ్వర్ దయాళ్ స్పష్టం చేశారు.
వారే నిర్ణయించుకోవాలి, హైకోర్టు కాదు..
బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలో నటిస్తూ ఆ సినిమాకు దర్శకత్వం వహించాలనే ఎన్టీఆర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేస్తూ సుదీర్ఘమైన తీర్పును రాసింది. ఇటువంటి సందర్భాల్లో మంత్రుల ప్రవర్తనా నియమావళిని ఎన్ఫోర్సింగ్ అథారిటీ చర్య స్వభావాన్ని నిర్ణయించాలి గానీ హైకోర్టు కాదని తేల్చి చెప్పింది.
అప్పుడు పరాశరన్ ఇలా...
అప్పటి అటార్నీ జనరల్ పరాశరన్ అమికస్ క్యూరీ హోదాలో ఆ విషయంపై వాదించారు. ఏ విధమైన కార్యకలాపాన్నైనా ముఖ్యమంత్రి చేపట్టవచ్చుననే విషయాన్ని కాదనలేమని అంటూ సాధారణ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ఆ విధమైన పదవిలో ఉన్న వ్యక్తి నేరుగా వ్యక్తిగత ప్రయోజనాల కోసం పదవి హందాతనాన్ని తగ్గించే పనిలో పాల్గొనడం సరి కాదని అన్నారు.
సిద్ధూ నిర్ణయం ఇలాంటిది....
మంత్రుల ప్రవర్తనా నియమావళికి విరుద్ధమైనందున టీవీ షో ద్వారా డబ్బులు సంపాదించాలనే సిద్ధూ నిర్ణయం వివాదంగా మారింది. అయితే, సిద్ధూ టీవీ షోలో పాల్గొనవచ్చునని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్కు ఎజి సూచించారు. ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా ఉన్నందువల్లనే ఇతర కార్యకలాపాల్లో ముఖ్యమంత్రి గానీ మంత్రి గానీ పాల్గొనకూడదు గానీ అలా పాల్గొనడాన్ని ఏ చట్టం కూడా నిరోధించలేదనేది స్పష్టంగా ఉంది.