దినకరన్ కేసులో అరెస్ట్: నటి లీనాతో కలిసి సుకేష్ ఇలా...
దినకరన్ కేసులో పట్టుపడిన సుకేష్ చంద్రశేఖర్ మామూలోడు కాడు. నటి లీనా పాల్తో సహజీవనం చేస్తూ ఆమెతో కలిసి పలు మోసాలకు పాల్పడినట్లు ఫిర్యాదులున్నాయి.
బెంగళూరు: అన్నాడియంకె బహిష్కృత నేత టిటీవీ దినకరన్కు రెండాకుల చిహ్నాన్ని ఇప్పిస్తానని చెప్పి పట్టుబడిన సుకేష్ చంద్రశేఖర్ నేర చరిత్ర చాలా పెద్దదే. పట్టుమని మూడు పదుల వయస్సు దాటని సుకేష్ తన నేర ప్రపంచంలో అవాక్కయ్యే నేరాలకు పాల్పడ్డాడు. కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు కూడబెట్టాడు.
అతని నేర చరిత్ర కర్ణాటక రాజధాని బెంగళూరులోనే ప్రారంభమైంది. చిన్ననాడే అతను నేరాల బాట పట్టాడు. అతను 19 ఏళ్ల వయస్సులోనే జైలుకు వెళ్లాడు. అన్నాడియంకె అధికారిక చిహ్నం రెండాకులను తమకే కేటాయించేలా చేయడానికి శశికళ మేనల్లుడు దినకరన్ సుకేష్ ద్వారా ఎన్నికల కమిషన్కు లంచం ఇవ్వజూపారని కేసు నమోదైన విషయం తెలిసిందే.
ఆ కేసులో ఢిల్లీ పోలీసులు సుకేష్ను అరెస్టు చేశారు కూడా. బెంగళూరులోని చంద్రప్ప లేఔట్కు చెందిన సుకేష్ 19 ఏళ్ల వయస్సులో జైలుకు వెళ్లి వచ్చి మోసాలు చేయడంలో మునిగిపోయాడు. ముఖ్యమంత్రులకు, ఎంపీలకు తాను అత్యంత సన్నిహితుడిని అంటూ ఖరీదైన కార్లలో తిరుగుతూ పెద్ద పెద్ద వాళ్లను కూడా బుట్టలో వేశాడని అంటారు.
కర్ణాటక ముఖ్య కార్యదర్శిగా...
సుకేష్ 2011లో కర్ణఆటక ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిగా తమిళనాడుకు చెందిన ఓ కంపెీ ఎండి పొన్నుదురైతో పరిచయం చేసుకున్నాడు. కర్ణాటకలోని బడి పిల్లలకు రూ.5 లక్షల విలువ చేసే ఖర్జూరాలను కొనాలని చెప్పాడు. ఈ కాంట్రాక్టు ఇవ్వాలంటే తనకు కమిషన్ ఇవ్వక తప్పదని చెప్పాడు. దాంతో పొన్నుదురై రూ.80 వేలను సుకేష్ ఖాతాలో జమ చేశాడు. కొద్ది రోజుల తర్వాత మరో రూ.2 లక్షలు ఇవ్వాలని పొన్నుదురైని అడిగాడు.
దాంతో తప్పించుకు తిరిగాడు...
జాగ్రత్త వహించిన పొన్నుదురై ప్రభుత్వ లెటర్ హెడ్పై వివరాలను అందించాలని సుకేష్కు చెప్పాడు. దాంతో సుకేష్ తప్పించుకుని తిరగడం ప్రారంభించాడు. మోసపోయానని గుర్తించిన పొన్నుదురై అప్పటి బెంగళూరు నగర పోలీసు కమిషనర్ జ్యోతి ప్రకాష్ మిర్జీకి ఫిర్యాదు చేశారు. ఆయన ఆ కేసును విధాన సౌద పోలీసులకు బదిలీ చేశారు. దీంతో సిసిబి సుకేష్ను విచారించంది. కొన్ని రోజుల తర్వాత ఆ కేసులో అతని బెయిల్ వచ్చింది.
కన్నడ నటి లీనాతో సహజీవనం...
సుకేష్ కన్నడ వర్ధమాన నటి లీనా పాల్తో స్నేహం చేశాడు. ఆ స్నేహం సహజీవనం వరకు వెళ్లింది. ఇద్దరు కలిసి చెన్నై, ముంబై వ్యాపారవేత్తలను కోట్ల రూపాయల మేరకు ముంచినట్లు కేసులు నమోదయ్యాయి. ఇద్దరు ఓ ఫామ్ హౌస్లో ఉండగా చెన్నై పోలీసులు వారిద్దరిని అరెస్టు చేశారు. అక్కడ వారికి అత్యంత ఖరీదైన మెర్సీడీస్ కార్లు లభించాయి. తాను జెడిఎస్ నేత కుమార స్వామి కుమారుడు నిఖిల్ గౌడకు సన్నిహిత మిత్రుడినని నమ్మించి మోసాలకు పాల్పడినట్లు కూడా ఫిర్యాదులు వచ్చాయి.
సామాన్యులను కూడా వదలలేదు...
సుకేష్ సామాన్యులను కూడా వదలలేదు. బిడిఎల్లో పనులు పూర్తి చేయిస్తానని, ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని వ్యాపారవేత్తలను, సాధారణ ప్రజలను మోసం చేసినట్లు, వారి నుంచి కోట్లాది రూపాయలు రాబట్టుకున్నట్లు కూడా వివిధ పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. అతను బాలాజీ పేరు మీద కూడా చెలామణి అయినట్లు తెలుస్తోంది.
కన్నడ తారలతో పరిచయాలు...
ఫేస్బుక్ ద్వారా 2013లో కన్నడ చలనచిత్ర రంగానికి చెందిన తారలను పరిచయం చేసుకుని పెద్ద చిత్రాల్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ మోసం చేసినట్లు కూడా ఫిర్యాదులు అందాయి. సుకేష్ వందకు పైగా మోసాలకు పాల్పడినట్లు ఫిర్యాదులు అందాయని, వాటిలో 25 నుంచి 30 వరకు కేసులు నమోదయ్యాయని తెలుస్తోంది. ఈ స్థితిలో సుకేష్ ఆగడాలను తెలుసుకునేందుకు ఢిల్లీ పోలీసులు బెంగళూరు వస్తారని సమాచారం.
అతనికే గుండెపోటు..
సుకేష్ ముంబైలో పొంజీ కుంభకోణంలో అరెస్టయినపుడు గుండె నొప్పి అంటూ ఆస్పత్రిలో చేరాడు. ఆ తర్వాత డిశ్చార్జి చేసినా కూడా ఇంటికి వెళ్లడానికి నిరాకరించాడు. ఈ విషయంలో ఏకంగా ఆస్పత్రి సూపరింటెండెంట్కు గుండె పోటు వచ్చింది. ఆయనను ఐసీయూలో చేర్చాల్సి వచ్చింది. అదే విధంగా ఓ ఆస్తి వేలం కేసులో బోంబే హైకోర్టు జడ్జికి ఇతను ఫోన్ చేశాడు. తాను కేంద్ర మంత్రినని, ఆ వేలాన్ని నిలిపి వేయాలని కోరాడు. తర్వాత విచారణ చేస్తే అది చంద్రశేఖర్ అని.. కేంద్ర మంత్రి కాదని తేలింది. పొంజీ కుంభకోణం ద్వారా 500 మంది వద్ద రూ.19 కోట్లు మోసం చేశాడు. ఇతను దేశ వ్యాప్తంగా వందల మందిని మోసం చేసి రూ.50 కోట్లుకుపైగా స్వాహా చేసి ఉంటారని పోలీసులు తెలిపారు. ఇతనిపై 48 కేసులు ఉన్నాయి.