విజయమో, వీరస్వర్గమో: పవన్ కల్యాణ్ ఫార్ములా, బాబుకు వర్రీ
పవన్ కల్యాణ్ చేయించిన తాజా సర్వే ప్రకారం టిడిపి కన్నా జనసేనకే తక్కువ సీట్లు వస్తాయని తేలింది. అయినప్పటికీ విజయమో, వీరస్వర్గమో అనేది తేల్చుకోవాలని ఆయన అనుకుంటున్నారు.
విజయవాడ: విజయమో, వీరస్వర్గమో అనే పద్ధతిలోనే జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకుంటున్నారు. గెలిస్తే గెలవడం, లేదంటే ఓడిపోవడం అనేది పవన్ కల్యాణ్ ఉద్దేశంగా కనిపిస్తోంది.
2019 ఎన్నికల్లో తన ఎజెండాను స్పష్టం చేస్తూ పవన్ కల్యాణ్ బిజెపికి స్పష్టమైన సంకేతాలను పంపించారు. ఎన్డీఎతో ఎటువంటి పరిస్థితిలోనూ పొత్తు ఉండదనేది చెప్పేశారు. గెలిచి తీరాలి, లేదంటే పడిపోవాలి అనే ఫార్ములాతో ఆయన ముందుకు సాగాలని భావిస్తున్నారు. ఆ కారణంగానే ఆయన వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని ప్రకటించారు.
పవన్ కల్యాణ్ ఫార్ములా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్రబాబు నాయుడిని ఆందోళనకు గురి చేస్తుందని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన నేపథ్యంలో టిడిపికి ఆందోళన పెరుగుతోంది. తన అన్నయ్య చిరంజీవి జనసేన పార్టీలో ఉండబోరని కూడా పవన్ కల్యాణ్ తేల్చేశారు.
యువతకు 60 శాతం సీట్లు అంటూ...
వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ యువతకు 60 శాతం సీట్లు ఇస్తుందని పవన్ కల్యాణ్ ప్రకటించారు. అదే తెలుగుదేశం పార్టీ ఆందోళనకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. దానివల్ల తమ క్యాడర్ జనసేన వైపు మళ్లే ప్రమాదం ఉందని టిడిపి నాయకులు ఆందోళన చెందుతున్నారు. యువత ఎక్కువగా టిడిపి వైపు ఉంది.
టిడిపి కన్నా తక్కువ జగన్ కన్నా...
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందనే విషయంపై అంచనాకు రావడానికి పవన్ కల్యాణ్ సర్వే నిర్వహించినట్లు తెలుస్తోంది. జనసేనకు టిడిపి కన్నా తక్కువ సీట్లు వస్తాయని, జగన్ పార్టీ కన్నా ఎక్కువ సీట్లు వస్తాయని ఆ సర్వేలో తేలింది. జనసేనకు 69, టిడిపికి 71, వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి 39 అసెంబ్లీ స్థానాలు వస్తాయని సర్వే ఫలితాలు తెలియజేస్తున్నాయి.
ఏ జిల్లాలో ఎన్ని సీట్లు....
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే జనసేనకు శ్రీకాకుళం జిల్లాలో ఐదు, విజయనగరం జిల్లాలో నాలుగు, విశాఖపట్నంలో 9, తూర్పు గోదావరి జిల్లాలో 15, పశ్చిమ గోదావరి జిల్లాలో 12, కృష్ణా జిల్లాలో ఆరు, గుంటూరు జిల్లాలో ఐదు, ప్రకాశం.. నెల్లూరు... చిత్తూరు జిల్లాల్లో మూడేసి వస్తాయని సర్వేలో తేలింది. రాయలసీమలోని కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో జనసేన పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకునే అవకాశాలు లేవని తేలింది. నిజానికి ఉభయగోదావరి జిల్లాల్లో అత్యధిక సీట్లు గెలుచుకునే పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని నమ్ముతుంటారు. తెలుగుదేశం పార్టీ విషయంలో అదే జరిగింది. ఆ రెండు జిల్లాలు తమ చేతి నుంచి జారిపోయే ప్రమాదం ఉందనే ఆందోళన కూడా టిడిపి నాయకుల్లో ఉన్నట్లు తెలుస్తోంది.
రెండు రాష్ట్రాల్లో అని చెప్పినా..
పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణలో కూడా పోటీ చేస్తుందని పవన్ కల్యాణ్ ప్రకటించారు. అయితే, ఆయన ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపైనే దృష్టి కేంద్రీకరించే అవకాశాలున్నాయి. తెలంగాణపై పెద్దగా దృష్టి పెట్టకపోవడం వల్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు వచ్చే నష్టం పెద్దగా లేదు. ప్రజారాజ్యం విషయంలో జరిగిన పొరపాట్లు జనసేన విషయంలో జరగకూడదనే పట్టుదలతో పవన్ కల్యాణ్ ముందుకు సాగుతున్నారు.
నారా లోకేష్ ప్రవేశంతోనే....
తెలుగుదేశం పార్టీలోనే కాకుండా ప్రభుత్వంలో కూడా చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ ప్రత్యక్ష పాత్రను పెంచుతూ 2019 ఎన్నికల్లో పార్టీని నడిపించే బాధ్యతను పెంచాలని చూస్తున్న తరుణంలో జనసేన తన ప్రకటనను విడుదల చేస్తూ 60 శాతం సీట్లు యువతకు ఇస్తామని ప్రకటించింది. ఇది నారా లోకేష్ నాయకత్వానికి పెద్ద పరీక్ష కానుంది. యువతను ఆకర్షించడానికి నారా లోకేష్ చేసే ప్రయత్నానికి జగన్ నుంచే కాకుండా పవన్ కల్యాణ్ నుంచి కూడా తీవ్రమైన ప్రతిఘటన ఎదురు కానుంది.
వైయస్ జగన్ ఇలా....
పవన్ కల్యాణ్ దూకుడును పసిగట్టిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేయడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించడం తన వ్యూహంలో భాగమేనని అంటున్నారు. టిడిపితో విసిగిపోయిన ప్రజలు పవన్ కల్యాణ్ వైపు చూడకుండా ఉండడానికే ఆ ప్రకటన చేశారని అంటున్నారు. కాగా, అనంతపురం, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో వైయస్ జగన్ తన ప్రాబల్యాన్ని కాపాడుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించే అవకాశాలున్నాయి. పవన్ కల్యాణ్ ప్రామాదాన్ని గుర్తించే చంద్రబాబు రాయలసీమలో వైసిపి నాయకులను తమ పార్టీలోకి ఆహ్వానించి వైసిపిని దెబ్బ తీయాలని చూస్తున్నట్లు చెబుతున్నారు. రాయలసీమలో జగన్ తన ప్రాబల్యాన్ని నిలబెట్టుకుంటే టిడిపికి మరింత గడ్డు పరిస్థితులే ఎదురవుతాయి.