నయీం కేసులో ట్విస్ట్: భాను కిరణ్తోనూ లింక్స్, ఎవరా అధికారి?
నయీంతో సంబంధాలు నెరిపిన ఓ పోలీసు అధికారికి భాను కిరణ్తోనూ సంబంధాలున్నట్లు ప్రచారం సాగుతోంది. తీగ లాగితే డొంక కదిలే పరిస్థితి ఉంది.
హైదరాబాద్: గ్యాంగస్టర్ నయీంతో సంబంధాలు నెరిపిన పోలీసు అధికారులు చిక్కుల్లో పడినట్లే కనిపిస్తున్నారు. నయీంకు సహకరించిన పోలీసు అధికారుల ఇతర వ్యవహారాలు కూడా బయటకు వస్తున్నాయి. సైబరాబాద్ కమిషనరేట్లో పనిచేసి నయీం వ్యవహారంలో వేటు పడిన ఓ అధికారి మద్దెలచెర్వు సూరి హత్య కేసులో నిందితుడు భానుకిరణ్తోనూ సంబంధాలు నెరిపినట్లు తెలుస్తోంది.
హైదరాబాదులోని యూసుఫ్గూడ ప్రాంతంలో కారులో సూరిని భాను కిరణ్ తుపాకీతో కాల్చిన విషయం తెలిసిందే. దానికి ముందు ఆ అధికారి వద్ద భాను ఆయుధ శిక్షణ తీసుకున్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. భాను కిరణ్కు ఆయుధ శిక్షణ ఇచ్చిన పోలీసు అధికారే తాజాగా నయీం వ్యవహారంలో సస్పెండ్ కావడం చర్చకు దారి తీసింది.
గతంలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పనిచేసిన ఆ అధికారి నయీం అక్రమాలకు సహకారం అందించినట్లు తెలుస్తోంది. అప్పట్లో వైఎస్ కేబినెట్లో ఓ కీలకమంత్రి తనయుడికి నమ్మినబంటుగా పనిచేసిన ఆ అధికారి వద్దకు భానుకిరణ్ తరచూ వచ్చేవాడని, అప్పుడే ఆయుధ శిక్షణ ఇచ్చినట్లు తెలుస్తోంది.
నగర శివార్లలో శిక్షణ
పోలీసు అధికారి ఏ మాత్రం జంకూ గొంకూ లేకుండా భాను కిరణ్ను తన వెంట తీసుకెళ్లి హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో పలు మార్లు శిక్షణ ఇచ్చాడని అంటున్నారు. సూరిని హత్య చేయడానికి భానుకిరణ్కు ఆ ఆయుధం సమకూర్చడంలోనూ నయీమే కీలకంగా వ్యవహరించాడనే ఆరోపణలున్నాయి. తనకు సూరి నుంచి ముప్పు తప్పదని భావించిన భానుకిరణ్ సూరిని చంపడానికి మంత్రి తనయుడి సహకారం కోరాడని, ఆ క్రమంలోనే భానుకు ఆయుధ శిక్షణ ఇచ్చే బాధ్యతను ఈ పోలీస్ అధికారికి అప్పగించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.
వేటు పడిన అధికారులు వీరే..
నయీంతో కలిసిభారీ స్థాయిలో సెటిల్మెంట్లకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కుంటున్న ఐదుగురు అధికారులను సస్పెండ్ చేస్తూ తెలంగాణ డిజిపి అనురాగ్ శర్మ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. సస్పెండ్ అయిన అధికారులు సీఐడీ అడిషనల్ ఎస్పీ మద్దిపాటి శ్రీనివాసరావు, సీసీఎస్ ఏసీపీ చింతమేని శ్రీనివాస్, మీర్చౌక్ ఏసీపీ మలినేని శ్రీనివాస్, కొత్తగూడెం సీఐ రాజ గోపాల్, సంగారెడ్డి ఇన్స్పెక్టర్ మస్తాన్ వలి.
సీనియర్ బృందం ఏర్పాటు...
నయీంతో కలిసి సెటిల్మెంట్లు చేసి సస్పెండయిన ఐదుగురు పోలీసుల అధికారులపై, మమరో నలుగురు అధికారులపై మౌఖిక విచారణకు, నయీంతో కలిసి సాగించిన వ్యవహారాలను వెలికి తీసేందుకు సీనియర్ ఐపిఎస్ అధికారి నేతృత్వంలో ఓ బృందాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. నయీం కేసులో అధికారులు కూడబెట్టుకున్న ఆస్తులు, వారి బినామీ ఆస్తుల లెక్కలు తీసి క్రిమినల్ కేసులు కూడా పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. విచారణలో తేలే అంశాలను బట్టి వారిని అరెస్టు చేసే అవకాశాలు కూడా ఉన్నాయనే ప్రచారం సాగుతోంది.
వివరణ తర్వాత...
నయీం కేసులో సస్పెండ్ అిన అధికారులపైనే కాకుండా మరో 16 మంది అధికారుల మీద కూడా విచారణ ఉంటుందని అంటున్నారు. ఇప్పుడు తమ వద్ద ఉన్న అధారాలను బట్టి 16 మందికి చార్జి మెమోలు జారీ చేసినట్లు సమాచారం. ఆ మెమోలకు వారు సరైన వివరణ ఇవ్వకపోతే సస్పెండ్ చేసేందుకు సిద్దమైనట్లు చెబుతున్నారు. ఇదిలావుంటే, సస్పెండ్ అయిన ఐదుగురు అధికారులపై విచారణను ఎదుర్కునే ఐదుగురు అధికారులపైనా పోలీసు శాఖ నిఘా పెంచింది. వారు ఎవరెవరిని కలుస్తున్నారనే విషయాలను ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
ఆ నలుగురి పేర్లు...
నయీం కేసులను విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్కు) కేసుల భారం విపరీతంగా పెరిగింది. దీంతో మరో సీనియర్ ఐపిఎస్ అధికారి నేతృత్వంలో మౌఖిక విచారణ బృందాన్ని ఏర్పాటు చేస్తారని అంటున్నారని, అదనపు ఎస్పీ, డిఎస్పీలు, ఇన్స్పెక్టర్ ర్యాంక్ అధికారులను విచారించేందుకు ఐజి లేదా డిఐడి స్థాయి అధికారికి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. శిక్షణా విభాగం ఐజిగా ఉన్న చారు సిన్హా, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిజిగా ఉన్న ఐజి శివధర్ రెడ్డి, కౌంటర్ ఇంటలిజెన్స్ డిఐజిగా ఉన్న రాజేష్ కుమార్ పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
నయీం దేశభక్తుడు....
సస్పెన్షన్కు గురైన అధికారుల్లో ఓ అధాకరి బాహాటంగానే నయీంను ప్రశంసించాడు. నయీమ్ దేశానికి సేవ చేశాడని, అతడ్ని ఉపయోగించుకుని సీనియర్ ఐపిఎస్ అధికారులు కోట్లు గడించారని అన్నారు. వారిని వదిలి తమపై పడితే అసలు విషయాలు బయటపెడుతామని అన్నారు. నయీం ఎంతో మంది ఉగ్రవాదులను పట్టిచ్చాడని, అతడి పేరు చెప్పుకుని పదవులు పొందిన రిటైర్డ్, ప్రస్తుత ఐపిఎస్ అధికారులను కూడా విచారించాలని అన్నారు. అలా అయితే ఆయుధాలు పట్టిచ్చిన కేసును, సోహ్రబుద్దీన్ ఎన్కౌంటర్ కేసు వంటి పలు సంచలన కేసులను తిరగదోడాల్సి వస్తుందని అన్నారు. అంత ధైర్యం లేకనే పోలీసు శాఖ పరువు పోతుందని తమపై వేటు వేసి చేతులు దులుపుకున్నారని అంటున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.
బెదిరించి భూముల రిజిస్ట్రేషన్..
నయీం అనుచరులమని బెదిరించి తన వ్యవసాయ భూమిని బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఓ రిటైర్డ్ రైల్వే ఉద్యోగి ఘట్కేసర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేడ్చల్జిల్లా ఘట్కేసర్ మండలం ఇస్మాయిఖాన్గూడ గ్రామానికి చెందిన విశ్రాంతి ఉద్యోగి పోతాల రత్నం(68)కు యాదాద్రి జిల్లా భువనగిరిలోని పెంచికపాడులోని సర్వే నంబరు 206, 209లో పది ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. పక్కనే అతని సోదరుడు నారాయణకు భూమి ఉంది. తనకు చెందిన పది ఎకరాల భూమి అమ్మివేయాలని సోదరుడి కొడుకులు చంద్రమోహన్, మురళీమోహన్లు బెదిరించారని ఫిర్యాదు చేశాడు.
ఇలా బెదిరించారు....
2013 అక్టోబరులో మాజీ ఎంపీటీసీ బీరు మల్లయ్య, పింగల్రెడ్డి, చంద్రమోహన్, మురళీమోహన్లు రత్నంను అతని భార్య భారతమ్మలను భువనగిరికి పిలిపించుకొని భూమి అమ్మివేయాలని, తాము నయీం అనుచరులమని బెదిరించారని ఆయన ఫిర్యాదు చేశఆరు. భయపడిన బాధితులు ఎకరాకు రూ.20 లక్షలు చొప్పున రూ.కోటి 80 లక్షలకు 9 ఎకరాలు అమ్మేసినట్లు చెప్పారు. ఆ సమయంలో కేవలం రూ.90 లక్షలు మాత్రమే ఇచ్చారని, మిగతా డబ్బులు అడిగితే నయీం అనుచరులమని బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఆ విషయంపై గురువారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.