అఖిలప్రియపై ముప్పేట దాడి: చంద్రబాబు తలకు బొప్పి
కర్నూల్ జిల్లా నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నిక అంశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల్లో అనూహ్య మలుపులు తీసుకొస్తున్నది.
కర్నూలు/అమరావతి: కర్నూల్ జిల్లా నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నిక అంశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల్లో అనూహ్య మలుపులు తీసుకొస్తున్నది. 2014 ఎన్నికలకు ముందే భూమా శోబానాగిరెడ్డి, ఇటీవల నాగిరెడ్డి హఠాన్మరణంతో వారి కూతురు అఖిలప్రియ రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
కాకపోతే 2014లో హఠాన్మరణం పాలైన శోభా నాగిరెడ్డి స్థానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందిన అఖిలప్రియ.. తండ్రి నాగిరెడ్డితో కలిసి 'సైకిల్' ఎక్కేశారు. అయితే ఫిరాయింపుల చట్టం ప్రకారం పార్టీ మారిన ఎమ్మెల్యే గానీ, ఎంపీ గానీ తన పదవికి రాజీనామా చేయాలి. కానీ అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణలోనూ విపక్షాల నుంచి గెలుపొందిన వారు అధికార పార్టీలో చేరి మంత్రి పదవులు అనుభవించడం కొత్త తరహా రాజకీయంగా మారింది. ఇక భూమా నాగిరెడ్డి ఒకనాడు తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర పోషించిన వారే.
అయితే అఖిలప్రియ రాజకీయాలకు కొత్త కావడంతో పార్టీలోని ఇతర నేతలు గానీ, ఇతర పార్టీల నేతలు గానీ అనుసరిస్తున్న వ్యూహాలు, ఎత్తులతో సతమతం అవుతున్నారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. భూమా నాగిరెడ్డి స్థానే ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీ పడిన శిల్పా మోహన్ రెడ్డి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాట పట్టారు. ఇక భూమాకు అత్యంత ప్రియమైన నేత సుబ్బారెడ్డి కూడా ఎంపిటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లను తనవైపునకు తిప్పుకోవడంతో అధికార తెలుగుదేశం పార్టీ కలవరానికి గురైంది.
శిల్పా మోహన్ రెడ్డి వైఖరితో ఇదీ సమస్య
అనుభవ రాహిత్యంతో రాష్ట్ర మంత్రి భూమా అఖిలప్రియ అనుసరిస్తున్న వ్యవహారశైలిపై తెలుగుదేశం పార్టీ అధిష్టానం గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఆమెకు కేంద్ర మంత్రి సుజనా చౌదరితో పాటు రాష్ట్ర మంత్రి కాల్వ శ్రీనివాసులు కూడా ఫోన్ చేసి మందలించినట్లు సమాచారం. అందరితో సఖ్యతగా ఉండి.. కలిసి మెలిసి పనిచేసుకుపోకుండా ఒంటెద్దుపోకడలు సరికాదని హితవు పలికినట్టు తెలిసింది. ప్రధానంగా మాజీ మంత్రి శిల్పా మోహన్రెడ్డితోపాటు నంద్యాల మునిసిపాలిటీలోని మొత్తం కౌన్సిలర్లు పార్టీ మారడం.. మునిసిపాలిటీపై వైఎస్సార్ కాంగ్రెస్ జెండా ఎగరడం ప్రారంభమయ్యింది.
సీఎం చెప్పినా పట్టనట్లు అఖిల ప్రియ
అదేవిధంగా జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్లు కూడా పార్టీ మారడంతో నంద్యాల అసెంబ్లీ స్థానం పరిధిలో టీడీపీ ఖాళీ కావడం అధికార పార్టీని కలవరపాటుకు గురిచేసింది. ప్రధానంగా నంద్యాల ఉప ఎన్నికలకు ముందు ఇది అధికార పార్టీకి పెద్ద దెబ్బగా మారింది. పదే పదే కలిసి వెళ్లాలని.. స్వయంగా సీఎం స్థాయిలో చెప్పినా అందుకు భిన్నంగా మంత్రిగా ఉండి గొడవలు పెంచడం ఏమిటని ప్రశ్నించినట్టు ఆమెను మందలించారని తెలుస్తున్నది. నంద్యాల సీటు విషయంలో పదే పదే ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందని అసహనం వ్యక్తం చేసినట్టు వినికిడి. మొత్తం మీద శిల్పా మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం అధికార తెలుగుదేశం పార్టీలో కలకలం రేపుతోంది.
చంద్రబాబు వద్దకు మంత్రి పీఏ తీరు
నంద్యాల రాజకీయాలతో పాటు మంత్రి పీఏ వ్యవహరశైలిపైనా తెలుగుదేశం పార్టీ అధిష్టానం గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. నీరు-చెట్టు పనులతో పాటు ఇతర నామినేషన్ పనుల విషయంలో పీఏ భారీగా ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలు నేరుగా సీఎం చంద్రబాబు వద్దకు వెళ్లినట్టు సమాచారం. ఇక ఉద్యోగుల బదిలీల విషయంలో భారీగా మంత్రి నుంచి సిఫారసు లేఖలు పోవడం ఏకంగా సీఎం చంద్రబాబు వరకూ వెళ్లినట్టు తెలుస్తోంది. ఇక భూమా నాగిరెడ్డికి ఆప్తమిత్రుడిగా ఉన్న ఏవీ సుబ్బారెడ్డిని కూడా ఎందుకు కలుపుకుని వెళ్లడం లేదన్న అంశంపైనా మంత్రిని ప్రశ్నించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో అందరినీ కలుపుకుని వెళ్లాలని ఆదేశించినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. మొత్తం మీద శిల్పా మోహన్ రెడ్డి వ్యవహారం అధికార పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది.
టీడీపీ నష్ట నివారణ చర్యలు ఇలా
పరిస్థితి తీవ్రత అర్థం చేసుకున్న రాష్ట్ర మంత్రి అఖిలప్రియ కూడా ఒక మెట్టు దిగారు. తనకు సుబ్బారెడ్డి తన కుటుంబ సభ్యుడని పేర్కొన్నారు. తరాల మార్పిడిలో తేడా మాత్రమే తమ మధ్య ఉన్నదని ఆమె చెప్పారు. ఆయన సహచర్యాన్ని తాను వదులుకోబోనని తేల్చి చెప్పి మరీ దిగి వచ్చారు. తమ కుటుంబ సభ్యులకు సంబంధించిన అంశంలో మీడియా జోక్యం చేసుకోకుండా దూరంగా ఉండాలని ఆమె పేర్కొనడం గమనార్హం. పరిస్థితి తీవ్రత అర్థం చేసుకున్న టీడీపీ అధి నాయకత్వం ఆగమేఘాలపై నష్ట నివారణ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తున్నది.