కొత్త సమస్య, చెదిరిన స్నేహం: బాబు మాట, కేసీఆర్ తూటా
హైదరాబాద్/విజయవాడ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి యుద్ధం జరుగుతోంది. కృష్ణా, గోదావరి నదుల పైన తెలంగాణ ప్రభుత్వం సీడబ్ల్యుసీ అనుమతి లేకుండా ప్రాజెక్టులు కడుతోందని, చంద్రబాబు మండిపడుతుండగా, తాము నిబంధనల మేరకే నిర్మిస్తున్నామని కెసిఆర్ చెబుతున్నారు.
మధ్యలో, వైసిపి అధినేత జగన్.. తెలంగాణ తీరును తప్పుబడుతూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కార్నర్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు పెద్దగా పెదవి విప్పడం లేదు. మొత్తానికి, తెలంగాణ - ఏపీ మధ్య విభజన తర్వాత కూడా జల జగడం కనిపిస్తోంది.
రాష్ట్ర విభజన తర్వాత ఇరు రాష్ట్రాల మధ్య పరిష్కరించుకోవాల్సిన సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటికే పలు అంశాల్లో ఇరు రాష్ట్రాల మధ్య విభేదాలు ఉన్నాయి. ఉద్యోగుల విభజన వంటివి ఎన్నో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఓటుకు నోటు తెరపైకి వచ్చింది. ఇరువురి మధ్య విభేదాలు వచ్చాయి. ఆ తర్వాత దోస్తీ కుదిరింది. ఇప్పుడు ప్రాజెక్టుల విషయంలో మరోసారి ఇరురాష్ట్రాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
బుధవారం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాటల యుద్ధానికి తెరలేపారు. ఎంతకైనా తెగిస్తామని ఒకరు అంటే, హక్కుల పైన రాజీపడేది లేదని మరొకరు చెప్పారు. దామాషా ప్రకారం నీళ్లివ్వాలని ఒకరంటే.. ప్రాజెక్టులపై రాద్దాంతం చేస్తే బెబ్బులిని తట్టిలేపినట్లేనని ఇంకొకరు అన్నారు.
కృష్ణా నీళ్లు మూడు రాష్ట్రాలు దాటుకుని ఏపీకి రావాలని, ఒకప్పుడు రెండే రాష్ట్రాలు అని, ఇప్పుడు తెలంగాణా ఏర్పాటయ్యాక మూడో రాష్ట్రాన్ని దాటుకుని రావాల్సి వచ్చిందని, కొత్త ట్రైబ్యునల్ మేరకు మనకు వెయ్యి టీఎంసీలు రావాలని, 65 టీఎంసీలకు మించి రాలేదని చంద్రబాబు చెప్పారు.
కెసిఆర్ మాట్లాడుతూ... తెలంగాణకు నీటి విషయంలో చంద్రబాబు, జగన్లు చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని, సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకోవడమే వారి లక్ష్యంగా కనిపిస్తోందని, 368 టీఎంసీల కృష్ణా జలాలు, 950 టీఎంసీల గోదావరి జలాలను తెలంగాణ వాడుకోవ చ్చని సమైక్య రాష్ట్రంలోనే ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందన్నారు.
చంద్రబాబు మాట్లాడుతూ... ఏపీ దిగువన ఉందని, మాకు రావాల్సిన నీళ్లు దామాషా ప్రకారం రావాలని, తెలంగాణా సీఎం ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, పై రాష్ట్రాల వారు కూడా నీళ్లు ఆపుకొనే పరిస్థితికి వచ్చారన్నారు.
కెసిఆర్ మాట్లాడుతూ.. గతంలో ప్రాజెక్టులకు వేల కోట్ల రూపాయలను ఇచ్చినా పనులు కాలేదని, పాలమూరు ఎత్తిపోతల సర్వేకు రూ.7 కోట్లు ఇచ్చారని, మాకున్న నీటి కేటాయింపుల ప్రకారమే మేం ప్రాజెక్టులు కడుతున్నామని, ఖమ్మం జిల్లా దుమ్ముగూడెం వద్ద మేలోనే గోదావరిలో పుష్కలంగా జలాలున్నా కొన్నివేల క్యూసెక్కులు సముద్రంలోకి వృథాగా పోతున్నాయని, ఇలాంటి అన్యాయాలను సరిచేసేందుకు మేం ప్రయత్నిస్తున్నామన్నారు.
చంద్రబాబు మాట్లాడుతూ... తెలంగాణ ప్రాజెక్టులు కట్టేస్తే కృష్ణడెల్టాకు ఇబ్బందులు తప్పవని, కృష్ణా నీళ్లు పొలాల్లోకి రాకపోతే సముద్రపు ఉప్పు నీళ్లు చొరబడే ప్రమాదం ఉందన్నారు. రాష్ట్రానికి న్యాయం చేయాలని కోరుతుంటే దానిపై విమర్శిస్తున్నారని, రెండు కొత్త రాష్ట్రాల మధ్య సమస్య తలెత్తుతోందని, సామరస్యంగా పరిష్కరించండని పదేపదే చెప్పానని అన్నారు.
కెసిఆర్ మాట్లాడుతూ... తాము ఎలాంటి ఉల్లంఘనలకూ పాల్పడలేదని, యాగానికి ఆహ్వానించేందుకు నేను అమరావతికి వెళ్లి సీఎం చంద్రబాబును కలిసినప్పుడు గంటసేపు గోదావరి జలాల గురించి చర్చించానని, ఏటా 3,000 నుంచి 4,000 టీఎంసీల జలాలు సముద్రంలో కలుస్తున్నాయని లెక్కలతో సహా చెప్పానని, ఇరు రాష్ట్రాలకు వినియోగంపోనూ ఇంకా మిగులు జలాలుంటాయని వివరించానని అన్నారు.
చంద్రబాబు మాట్లాడుతూ... తెలంగాణా ప్రాజెక్టులు కడుతుంటే మాట్లాడకపోతే ఏపీ పూర్తిగా నష్టపోయే పరిస్థితి వస్తుందని, తెలంగాణా వాటా మేరకు తీసుకుంటే అభ్యంతరం లేదని, ఆంధప్రదేశ్ వాటా కూడా రావాల్సిందేనన్నారు.
రాజకీయ అవసరాల కోసం ఏపీ సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్లు పోటీ పడి తెలంగాణ ప్రజలపై యుద్ధం ప్రకటించారని కేసీఆర్ బుధవారం ధ్వజమెత్తిన విషయం తెలిసిందే. వారు మాత్రమే బతకాలి.. ఇక్కడి వారు బతకొద్దంటూ కుళ్లు రాజకీయాలు చేస్తున్నారన్నారు.
చంద్రబాబు మాట్లాడుతూ... శ్రీశైలం, నాగార్జున సాగర్ ఉమ్మడి ప్రాజెక్టులని, విభజన చట్టం పరిధిలో ఉన్నాయని, అందుకే కేంద్ర ప్రభుత్వ ఉన్నత మండలిని పిలవమని చెప్పానని, ఇద్దరు ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉంటారని, కేంద్రమంత్రి ఆధ్వర్యంలో సమావేశం జరుగుతాయన్నారు.
కెసిఆర్ మాట్లాడుతూ.. తాము సహకరిస్తామన్నా కుట్రలతో ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారన్నారు. తెలంగాణకు నీటి విషయంలో చంద్రబాబు, జగన్లు చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని, సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకోవడమే వారి లక్ష్యమన్నారు.