ఇక్బాల్ అవహేళన+తండ్రి పట్టుదల= సర్ఫరాజ్ ఖాన్
ముంబై: సర్ఫరాజ్ ఖాన్.. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్లో సంచలనంగా మారిన పేరు. గత ఐపిఎల్, ఇటీవల ముగిసిన అండర్-19 టోర్నీ, ప్రస్తుత ఐపీఎల్లో మెరుపులతో స్టార్ అయిపోయిన ఈ యువ ఆటగాడు.. చాలా సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన వాడే కావడం గమనార్హం.
సర్ఫరాజ్ తండ్రి నౌషాద్ రైల్వేలో నాలుగో తరగతి ఉద్యోగం చేసేవాడు. జీతం రూ.2 వేలే. అది కుటుంబాన్ని నడపడానికే సరిపోయేది. అయితే కొడుకును క్రికెటర్ను చేయాలని కలలు కన్న నౌషాద్.. అందుకోసం చిన్న చిన్న వ్యాపారాలెన్నో చేశాడు. అందులో ఫుట్పాత్ పక్కన ట్రాక్ ప్యాంట్లు అమ్మే వ్యాపారం కూడా చేసేవాడు.
నౌషాద్తో పాటు సర్ఫరాజ్ సైతం ఒకప్పుడు వానలో తడుస్తూ ట్రాక్ ప్యాంట్లు అమ్మినవాడే. ఇలా సమకూర్చుకున్న డబ్బులతో సర్ఫరాజ్కు క్రికెట్ శిక్షణ ఇప్పించాడు. అంతేగాక, ప్రస్తుతం సర్ఫరాజ్ ఉంటున్న బెంగళూరు జట్టులోనే సభ్యుడైన ఇక్బాల్ అబ్దుల్లాను క్రికెటర్గా తీర్చిదిద్దింది కూడా నౌషాదే. ఉత్తరప్రదేశ్కు చెందిన ఇక్బాల్కు 225 చదరపు అడుగులుండే తన చిన్న గది లాంటి ఇంట్లో పెట్టుకుని అతడికి శిక్షణ ఇప్పించాడు నౌషాద్.
ఇక్బాల్ హేళనతో సర్ఫరాజ్ తండ్రిలో పెరిగిన పట్టుదల
అయితే, ఇక్బాల్కు క్రికెటర్గా పేరొచ్చాక సర్ఫరాజ్కు సాయం చేయమంటే.. 'నాకు సామర్థ్యం ఉంది కాబట్టి ఎదిగాను. నీ కొడుక్కి కూడా ప్రతిభ ఉంటే.. దాన్ని ప్రపంచానికి చూపించు' అంటూ తేలిగ్గా మాట్లాడాడట ఇక్బాల్. ఈ విషయాన్ని నౌషాద్ స్వయంగా వెల్లడించాడు. ఈ మాటతో పౌరుషం తెచ్చుకుని.. సర్ఫరాజ్ను టీమ్ఇండియా ఆటగాడిగా చేయడమే లక్ష్యంగా కష్టపడ్డాడు నౌషాద్.
తండ్రి కలను అర్థం చేసుకున్న సర్ఫరాజ్ ఖాన్.. తనకున్న పరిమితుల్లోనే కష్టపడి క్రికెటర్గా ఎదిగాడు. 12 ఏళ్ల వయసులోనే 439 పరుగులు చేసి సచిన్ పేరిట ఉన్న ముంబై స్కూల్ క్రికెట్ రికార్డును బద్దలు కొట్టిన సర్ఫరాజ్.. ఆ తర్వాత అనేక సంచలనాలకు తెరతీశాడు.
'సర్ఫరాజ్కు ఆ రోజుల గురించి చెబితే ఇప్పుడు కూడా ఏడుపొచ్చేస్తుంది. ఇద్దరం కలిసి వానలో తడుస్తూ ట్రాక్ ప్యాంట్లు అమ్మేవాళ్లం. సర్ఫరాజ్ ట్రాక్ ప్యాంట్లను తన భుజాల మీద వేసుకుని అమ్మేవాడు' అంటూ నాటి రోజుల్ని గుర్తు చేసుకున్నాడు నౌషాద్.
కాగా, సర్ఫరాజ్ సైతం టీమిండియాలో చోటు సంపాదించుకోవడమే లక్ష్యంగా కఠోర శ్రమతో పట్టు సాధించాడు. ఈ సీజన్ ఐపీఎల్ లో సర్ఫరాజ్ మరింతగా రాణిస్తే, భారత జట్టులో స్థానం ఎదురుచూస్తుంటుందనడంలో సందేహం లేదని చెప్పొచ్చు.
ఇది ఇలా ఉండగా, సర్ఫరాజే కాదు.. అతడి తమ్ముడు ముషీర్ సైతం ముంబై క్రికెట్లో ఓ సంచలనమే. కేవలం ఆరేళ్ల 9 నెలల వయసులోనే స్కూల్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు ఈ బుడ్డోడు. 114 ఏళ్ల చరిత్ర ఉన్న గైల్స్ షీల్డ్ అండర్-14 టోర్నీలో ఆడిన అత్యంత పిన్న వయస్కుడు అతను. లెఫ్టార్మ్ స్పిన్నర్ అయిన ముషీర్.. గత ఏడాది ఇంగ్లాండ్ పర్యటనకు కూడా వెళ్లడం విశేషం.