బ్లాక్మనీపై కఠినం: విదేశాల్లో దాస్తే ఇక్కడ జఫ్తు, జైలు
హైదారాబాద్: బ్లాక్ మనీ పైన మొదటి నుండి ఓ స్పష్టతతో ఉన్న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లోను దానిని ప్రస్తావించింది. నల్లధనం విషయంలో బీజేపీ ప్రభుత్వం కత్తి దూస్తోంది. తాము అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో నల్లధనంపై చర్యలు తీసుకుంటామని బీజేపీ అధికారంలోకి వచ్చింది. మోడీ ప్రధాని అయిన కొద్ది రోజులకే నల్లధనంపై ఓ దర్యాఫ్తు బృందాన్ని నియమించింది. ఇప్పుడు జైట్లీ నల్లధనంపై మరో కత్తి దూశారు.
నల్లధనం విషయంలో మోడీ ప్రభుత్వం కఠిన చట్టాలను తీసుకు వస్తోంది. విదేశాల్లోని ఆస్తుల వివరాలను, వాటిపై ఆదాయాన్ని దాచినా, సదరు ఆస్తులపై పన్ను ఎగవేసినా తీవ్ర నేరంగా పరిగణిస్తారు. పదేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. ఇది రాజీకి వీలులేని నేరం. సెటిల్మెంట్ కమిషన్కు వెళ్లేందుకు అనుమతించరు. దీనికితోడు మూడురెట్లు పన్ను విధిస్తారు.
విదేశాల్లోని ఆస్తుల మీద వెల్లడించాని ఆధాయానికి గరిష్ఠ పన్నురేటు విధిస్తారు. రాయితీలు వర్తించవు. విదేశాల్లో ఆస్తులుండి.. రిటర్నులు దాఖలు చేయకున్నా, పూర్తి సమాచారం ఇవ్వకున్నా నేరంగా భావిస్తారు. ఏడేళ్ల వరకు శిక్ష పడుతుంది.
విదేశాల్లోని ఆస్తులకు సంబంధించి ఆదాయాన్ని దాచడం, పన్ను ఎగవేయడాలను హవాలా చట్టం కింద తీవ్ర నేరంగా పరిగణిస్తారు. రిటర్న్లలో ఆస్తులు చూపకుంటే జఫ్తు చేసే అధికారం. విదేశాల్లో జఫ్తు వీలులేకుంటే దానికి సమానమైన విలువ కలిగిన దేశీయ ఆస్తులను జఫ్తు చేసేందుకు హవాలా చట్టాన్ని సవరిస్తారు.