యుపి ఫలితాలతో బాబు అలర్ట్: పురంధేశ్వరి ఒక్కరే...
యుపితో పాటు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో చంద్రబాబు అప్రమత్తమైనట్లు కనిపిస్తున్నారు. బిజెపి సంబంధం విషయంలో ఆయన వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
విజయవాడ: ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలర్ట్ అయినట్లు కనిపిస్తున్నారు. దానికితోడు మణిపూర్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్ ఫలితాలతో కూడా ఆయన అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. మోడీ మ్యాజిక్ను పక్కన పెడితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా పనిచేసిందా అనే కోణంలో ఆయన ఆలోచిస్తున్నట్లు సమాచారం.
అధికారంలో ఉన్న పార్టీలో ఓడిపోవడం చంద్రబాబును ఆలోచనలో పడేసినట్లు చెబుతున్నారు. కాగా, వచ్చే కర్నాటక ఎన్నికల్లోనూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఓటమి పాలయ్యే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది. కాంగ్రెసు స్థానంలో బిజెపి అధికారంలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
దానికితోడు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో బిజెపిలో దూకుడు పెంచుతోంది. దీన్ని గ్రహించిన చంద్రబాబు బిజెపి విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని భావిస్తున్నట్లు సమాచారం. అందుకు అనుగుణమైన చర్యలు తీసుకోవాలని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు.
దక్షిణాదిపై అమితా షా కన్ను
ఐదు రాష్ట్రాల ఫలితాల నేపథ్యంలో బిజెపి అధ్యక్షుడు అమిత్ షా దక్షిణాదిపైనా దృష్టి సారిస్తున్నారు. దీంతో అన్ని స్థాయిల్లోనూ బిజెపితో సఖ్యతతో మెలగాలని చంద్రబాబు భావిస్తున్నారు. బిజెపితో వివాదాలకు దిగవద్దని, వచ్చే ఎన్నికల్లోనూ బిజెపి కలసి వెళ్లాలని నిర్ణయించుకున్నామని రెండురోజుల క్రితం జరిగిన పశ్చిమ గోదావరి జిల్లా సమీక్షలో తొలిసారిగా ఆయన చెప్పారు.
బిజెపితో బంధం ఇలా...
ఇప్పటివరకు జిల్లా నుంచి మండల స్థాయి వరకు మాత్రమే కాకుండా రాష్ట్ర స్థాయిలోనూ తమ నాయకులకు తెలుగుదేశం ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వడం లేదని బిజెపి నాయకులు అప్పుడప్పుడు విమర్శలు చేస్తున్నారు. ఈ విషయాన్ని కూడా చంద్రబాబు గుర్తించినట్లు చెబుతున్నారు. బిజెపి కార్యకర్తలకు పనులు చేయకపోవడంతోపాటు, వారికి కేటాయించి రేషన్ దుకాణాల నుంచి ఇతర సౌకర్యాలు తొలగించడం, అగ్రనేతలకు గతంలో ఉన్న గన్మెన్లను తొలగించడం వంటి చర్యలతో బిజెపికి టిడిపికి క్షేత్రస్థాయిలో దూరం పెరిగింది. దీంతో ఇక ముందు బిజెపి నాయకులకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నట్లు చెబుతున్నారు. అదే సమయంలో మోడీ మ్యాజిక్ను వచ్చే ఎన్నికల్లో కూడా వాడుకోవడానికి అది పనికి వస్తుందని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం.
వెంకయ్యతో ఉన్న సంబంధాల వల్లనే
జాతీయ స్థాయిలో చంద్రబాబుకు తమ అగ్రనేతలతో ఉన్న సంబంధాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో తమను లెక్కచేయడం లేదని బిజెపి సీనియర్ నాయకులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో ఉన్న సన్నిహిత సంబంధాల వల్ల తమ పార్టీ రాష్ట్ర నేతలను పట్టించుకోవడం లేదని వారు గుర్రుగా ఉన్నారు.
చంద్రబాబుపై సీనియర్ల గుర్రు
ఎన్నికల నాటికి పొత్తులు ఎలా ఉంటాయో తెలియదని ఇటీవల పురంధేశ్వరి వ్యాఖ్యానించారు. ఈ అభిప్రాయాన్ని పలువురు బిజెపి సీనియర్ నేతలు కలిగి ఉన్నట్లు చెబుతున్నారు. టిడిపితో ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగానే బిజెపిలో చేరిన కావూరి సాంబశివరావు, కన్నా లక్ష్మినారాయణ వంటి సీనియర్ నాయకులు పెద్దగా మాట్లాడడం లేదని అంటున్నారు. దానికితోడు కేంద్రం నుంచి నిధులు తీసుకుంటున్నా వాటి గురించి ప్రచారం రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చెప్పడం లేదని బిజెపి నాయకులు విమర్శిస్తున్నారు. ఆ విషయాన్ని ఎప్పటికప్పుడు తమ నాయకత్వానికి ఫిర్యాదు చేస్తూ, తమను ఇబ్బందులు పెడుతున్న విషయాన్ని చంద్రబాబు పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
పురంధేశ్వరితోనే వ్యక్తిగతంగా...
బిజెపిలో పురంధ్రీశ్వరి మినహా మిగిలిన బిజెపి నాయకులెవరితోనూ చంద్రబాబుకు పెద్దగా వ్యక్తిగత విభేదాలు లేవు. దీంతో బిజెపి నాయకులతో సఖ్యతగా ఉంటూ, స్థానికంగా తలెత్తే తలనొప్పులు తగ్గించుకోవాలని, తద్వారా ఎన్నికల నాటికి పూర్తి ధీమాతో వ్యూహరచన చేయడానికి వీలవుతుందని చంద్రబాబుతో టిడిపి సీనియర్ నాయకులు అన్నట్లు తెలుస్తోంది.