ప్రియాంకకు ఝలక్, వెంటనే వ్యూహం మార్చిన అఖిలేష్: రంగంలోకి సోనియా
యూపీలో సమాజ్ వాది పార్టీ, కాంగ్రెస్ పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై నీలి నీడలు కమ్ముకున్నాయి. కాంగ్రెస్ అధిక సీట్లు డిమాండ్ చేసినందుకే పొత్తు కుదరటం లేదని ఎస్పీ ప్రకటించింది. ఎస్పీ ఏకపక్షంగా వ్యవహరిస్
లక్నో: యూపీలో సమాజ్ వాది పార్టీ, కాంగ్రెస్ పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై నీలి నీడలు కమ్ముకున్నాయి. కాంగ్రెస్ అధిక సీట్లు డిమాండ్ చేసినందుకే పొత్తు కుదరటం లేదని ఎస్పీ ప్రకటించింది. ఎస్పీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. దీంతో రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై చర్చలు ఆగిపోయాయి.
కాంగ్రెస్ అధినాయకత్వం 120 సీట్లు డిమాండ్ చేస్తే ఎలా ఇస్తామని ఎస్పీ సీనియర్ నాయకులు నరేష్ అగర్వాల్ అన్నారు. కాంగ్రెస్ తన మొండిపట్టు ద్వారా బీజేపీకి సాయం చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తుందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.
అక్కడా 'బీజేపీ' రాజకీయం!: బీహార్ తరహా షాకివ్వనున్న అఖిలేష్
ఇరు పార్టీల సీనియర్ నాయకులు శనివారం రాత్రి పొద్దుపోయేంత వరకు చర్చలు జరిపినా ఫలితం కనిపించలేదు. ప్రియాంక రంగంలోకి దిగినా ఫలితం దక్కలేదంటున్నారు. సోనియా గాంధీ కూడా శనివారం నాడు రంగంలోకి దిగారు.
రంగంలోకి ప్రియాంక వచ్చినా ఫలితం లేదు
రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు జరిగేందుకు ప్రియాంక గాంధీ కూడా ఆఖరు క్షణం వరకు ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది. ఆమె శనివారం సాయంత్రం వరకు ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్కు పదకొండు ఎస్సెమ్మెస్లు చేసినా ఆయన స్పందించలేదంటున్నారు.
లక్నోకు ఆజాద్.. ఆ రెండు నియోజకవర్గాల్లో..
దీంతో ఏఐసిసి ప్రధాన కార్యదర్శి, ఉత్తరప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ హుటాహుటిన లక్నో వెళ్లారు. 120 సీట్లతో పాటు రాష్ట్రంలో మైనారిటీ ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాలలోని నియోజకవర్గాలను తమకు కేటాయించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.
దీనితోపాటు అమేథీ, రాయబరేలీ లోక్సభ నియోజకవర్గాలలోని అన్ని అసెంబ్లీ సీట్లను తమకు కేటాయించాలంటోంది. దీనిని అఖిలేశ్ అంగీకరించటం లేదు.
వంద సీట్లు ఇస్తామని..
గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించిన స్థానాలతోపాటు మరో డెబ్బై నియోజకవర్గాల్లో ఎస్పీ అభ్యర్థులు పోటీ చేస్తారని, మిగతా 85 నుంచి వంద సీట్లను కాంగ్రెస్కు ఇస్తామని తాము చేసిన ప్రతిపాదనను కాంగ్రెస్ తిరస్కరించిందని అగర్వాల్ వెల్లడించారు. రాష్ట్రంలో కాంగ్రెస్కు పెద్దగా బలం లేదని, అయినా తమకు ఎక్కువ సీట్లు కేటాయించాలని ఆ పార్టీ నేతలు అనటం విచిత్రంగా ఉందని ఎస్పీ చెబుతోంది.
విజ్ఞప్తికి రాహుల్ నో
ఎస్పీ, కాంగ్రెస్ పార్టీల మధ్య కుదిరే సీట్ల సర్దుబాటు గురించి పత్రికలకు వివరించేందుకు లక్నో రావాలన్న ఎస్పీ విజ్ఞప్తిని రాహుల్ గాంధీ తిరస్కరించినట్లు తెలుస్తోంది. పొత్తు కుదరకపోవటానికి ఇది కూడా ఒక కారణమని ఎస్పీ నాయకులు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎస్పీపై ఆధారపడి ఉన్నది తప్ప తమ పార్టీ కాంగ్రెస్పై ఆధారపడి లేదని అగర్వాల్ చెప్పారు.
నేతలతో రాహుల్ చర్చలు
కాంగ్రెస్కు వంద సీట్లు మాత్రమే ఇస్తామని, ఇంతకు మించి ఒక్క సీటు కూడా ఇవ్వలేమని నరేష్ అగర్వాల్ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ శనివారం మధ్యాహ్నం తమ నివాసంలో పార్టీ సీనియర్ నాయకులతో సమావేశమై ఎస్పీతో జరుపుతున్న సీట్ల సర్దుబాటు చర్చల గురించి సమీక్షించారు. ఆ పార్టీతో పొత్తుకుదరని పక్షంలో ఏం చేయాలి, ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలనేది కూడా వారు చర్చించారు.
సొంత పార్టీలో విభేదాల తగ్గటంతో వ్యూహం మార్చిన అఖిలేష్
కాంగ్రెస్కు 103 స్థానాలు కేటాయిస్తామని చెబుతూ వచ్చిన ఎస్పీ నేతలు... సొంత పార్టీలో వర్గ విభేదాలు సమసిపోయిన నేపథ్యంలో తమ వ్యూహాన్ని మార్చారు. తాజాగా 85 సీట్లు మాత్రమే కాంగ్రెస్కు కేటాయించగలమని చెబుతున్నారని అంటున్నారు. అయితే, ఈ సంఖ్యపై కాంగ్రెస్ నుంచి సానుకూల స్పందన రాలేదు.
పొత్తు కుదిరితే..
2012లో కాంగ్రెస్ గెలిచిన స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించటంపై ప్రశ్నించగా... పొత్తు కుదిరితే ఆయా చోట్ల నుంచి పార్టీ అభ్యర్థులను ఉపసంహరించుకుంటామని ఎస్పీ నేతలు చెబుతున్నారు. ఈ పరిణామంపై యూపీ కాంగ్రెస్ అధ్యక్షులు రాజ్బబ్బర్ మాట్లాడుతూ... పొత్తుపై తాము ఆశావహంగానే ఉన్నామన్నారు.
అజంఖాన్కు టిక్కెట్
వివాదాస్పద మంత్రిగా పేరున్న అజంఖాన్కు ఎప్పటి మాదిరిగానే రాంపూర్ స్థానాన్ని, అతని కుమారుడు అబ్దుల్లా ఆజంకు స్వర్(రాంపూర్ జిల్లా) టికెట్ను కేటాయించారు. వివాదాస్పద వ్యక్తులకు టికెట్లు ఇవ్వటాన్ని వ్యతిరేకించే అఖిలేశ్ తాజా జాబితాలో బీఎస్పీ నాయకుడు బ్రహ్మదత్ ద్వివేదీ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న విజయ్ సింగ్కు (ఫరూఖాబాద్) టికెట్ ఇచ్చింది.
అతీఫ్ అహ్మద్కు షాక్
మాఫియా నేపథ్యం నుంచి రాజకీయాల్లో ప్రవేశించిన అతిఖ్ అహ్మద్కు తాజా జాబితాలో చోటు కల్పించలేదు. అతనికి బదులుగా కాన్పూరు కంటోన్మెంట్ స్థానానికి మొహద్ హసన్ రూమికి అవకాశమిచ్చారు. 210 స్థానాలకు గాను ముస్లిం వర్గానికి 59 టికెట్లు (28శాతం) కేటాయించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేలున్న 8 స్థానాల్లోనూ ఎస్పీ తన అభ్యర్థులను ప్రకటించింది. అఖిలేష్ తన బాబాయి శివపాల్ యాదవ్కు టిక్కెట్ ఇచ్చారు.