బాబు స్వరపరీక్ష చెల్లుతుందా: జగన్ వ్యూహమేమిటి?
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఓ ప్రైవేట్ సంస్థతో చేయించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి వాయిస్ టెస్ట్ న్యాయస్థానాల్లో చెల్లుబాటు అవుతుందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. తమ పార్టీ అధినేత వైయస్ జగన్ ప్రమేయంతోనే ఆళ్ల రామకృష్ణా రెడ్డి రంగంలోకి దిగారనేది సుస్పష్టం. ఈ వ్యవహారంలో జగన్ వ్యూహమేమిటనేది కూడా చర్చనీయాంశంగా మారింది.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకునోటు కేసు వ్యవహారంలో చంద్రబాబు పాత్రపై విచారణ చేయాలని ఎసిబి కోర్టు ఆదేశాలు ఇవ్వడం మరోసారి సంచలనానికి కారణమైంది. దీంతో చంద్రబాబుకు చిక్కులు తప్పవని ఒక వర్గం మీడియా ప్రచారం సాగిస్తోంది. అయితే ఈ కేసు న్యాయస్థానాల్లో నిలువదని మరికొంత మంది వాదిస్తున్నారు.
చంద్రబాబును నైతికంగా, రాజకీయంగా దెబ్బ తీయాలనేదే జగన్ ప్రధాన వ్యూహంగా కనిపిస్తోంది. ఈ విషయంలో మాత్రం జగన్ ఏదో మేరకు ఫలితం సాధించే అవకాశాలున్నాయని అంటున్నారు. మరో విషయం ఏమిటంటే, కోర్జు తాజా ఆదేశాలతో ఎసిబి చంద్రబాబు స్వరపరీక్షకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అది జరిగితే కేసు మరో మలుపు తిరగవచ్చు. ఎసిబి కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు వెళ్లాలని చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లుగా కూడా చెబుతున్నారు. అప్పుడు ఏ విధమైన మలుపు తీసుకుంటుందనేది మరో ప్రశ్న.
పిటిషనర్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఒక అంతర్జాతీయ కంపెనీకి బాబు వాయిస్ టేపులను పరీక్షకు పంపగా, అది చంద్రబాబు గొంతేనని తేలిందన్న వాదన చట్టాల ముందు నిలిచే అవకాశాలు లేదన్న చర్చ జరుగుతోంది. ఆడియో టేపులను సాక్ష్యాలుగా పరిగణించకూడదన్న గత తీర్పులను వారు గుర్తు చేస్తున్నారు. అది కోర్టు ఆదేశాలతో చేయించిన పరీక్ష కానందున, ఏ విధంగా సాక్ష్యంగా పనికివస్తుందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
అయితే, కేసు నిలుస్తుందా నిలువదా అనే విషయాన్ని పక్కన పెడితే రాజకీయంగా, నైతికంగా చంద్రబాబును దెబ్బ తీయడానికి మాత్రం పనికి వస్తుందని భావిస్తున్నారు. టేపులో చంద్రబాబు వాయిస్ ఉన్నందున ఆయనకు చిక్కులు తప్పవని, ఆయనకూ నోటీసులిచ్చి, కోర్టు పిలిపిస్తుందన్న మరో వాదన ముందుకు వచ్చింది. అయితే, అందులో చంద్రబాబు మీకు ఓటేసినందుకు డబ్బులు ఇస్తామని చెప్పలేదని, స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోమని మాత్రమే చెప్పారని టిడిపి వర్గాలు అంటున్నాయి.
కేసు చెల్లదని ఉన్నత న్యాయస్థానమయిన హైకోర్టు స్పష్టం చేసిన తర్వాత, మళ్లీ అదే కేసులో ఎసిబి కోర్టు తీర్పు ఇవ్వడం చెల్లదని అంటున్నారు. ఈ విచారణకు ఎసిబి పరిధి లేదని హైకోర్టు న్యాయమూర్తి శంకర్రావు ఇచ్చిన తీర్పును తమ వాదనకు మద్దతుగా ఉదహరిస్తున్నారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలుకు వెళ్లిన సందర్భంలో, దానిపై స్టే ఇచ్చి ఉంటే కథ మరోలా ఉండేదని చెబుతున్నారు.
ఓటు వేయడం ప్రజాప్రతినిధుల అధికార విధి కానప్పుడు అక్కడ అవినీతి నిరోధక చట్టం వర్తించదని వారంటున్నారు.ప్రైవేటు కంపెనీలు ఇచ్చిన స్వర నమూనా పరీక్షల నివేదికల ఆధారంగా విచారణ చేయడం కుదరదని, అదే కోర్టు స్వయంగా ఆదేశిస్తేనో, ప్రభుత్వమే స్వయంగా ఆదేశించి ఆ నివేదికను కోర్టుకు సమర్పిస్తే మాత్రమే చెల్లుబాటవుతుందని న్యాయవాదులు చెబుతున్నారు.
అయితే, రేవంత్రెడ్డి దగ్గర స్వాధీనం చేసుకున్న 50 లక్షల వ్యవహారమే న్యాయపరంగా ఇబ్బందిపెట్టవచ్చని చెబుతున్నారు. ఆ డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయి? ఏ ఖాతా నుంచి వచ్చాయి? స్టీఫెన్సన్తో రేవంత్ రెడ్డి మధ్య జరిగిన సంభాషణ, వారిరువురి మధ్య భేటీ - ఇలాంటి అంశాలన్నీ పునర్విచారణ ద్వారా మళ్లీ ప్రజల్లోనూ మీడియాలోనూ చర్చ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ చర్చ సాగుతోంది.
ఈ రీత్యా చూసినప్పుడు వైయస్ జగన్ వ్యూహం ఫలితాలు ఇచ్చినట్లే భావించాలి. చంద్రబాబును చిక్కుల్లో పడేయడం ద్వారా, ఆయనకు ప్రజల్లో ఉన్న ఆదరణకు గండి కొట్టడం ద్వారా రాజకీయంగా ఆధిపత్యం సాధించాలనే జగన్ వ్యూహం కొంత మేరకు ఫలించే అవకాశం ఉంది.