రేవంత్ డిఫెన్స్లో టిడిపి: కెసిఆర్ ముందస్తు ఆలోచన?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ముందస్తు ఎన్నికలకు వెళ్తారా? శాసన సభను రద్దు చేస్తారా? అనే చర్చ సాగుతోంది. కెసిఆర్ ముందస్తుకు వెళ్లవచ్చుననే వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ చర్చ సాగుతోంది.
కెసిఆర్ గతంలోను ముందస్తు హెచ్చరికలు చేసినట్లుగా వచ్చాయి. మూడు నెలల క్రితం ఎమ్మెల్యే కోటా కింద జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ 5 సీట్లు గెలవాలని, లేదంటే అసెంబ్లీని రద్దు చేస్తానని కెసిఆర్ ఎమ్మెల్యేలతో వ్యాఖ్యానించినట్లుగా వచ్చింది.
తాజాగా, కెసిఆర్ అసెంబ్లీని రద్దు చేసి, ముందస్తుకు వెళ్తారా? ఆయన లక్ష్యం ఏమిటనే చర్చ సాగుతోంది. అసెంబ్లీని రద్దు చేసి ముందస్తుకు వెళ్లాలని, తద్వారా వంద సీట్లు సాధించాలని, టిడిపిని తెలంగాణలో లేకుండా చేయాలని ఆయన ఉవ్వీళ్లూరుతున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
తమ ప్రభుత్వం పైన ప్రజల్లో సానుకూలత ఉందని ఆయన భావిస్తున్నారని తెలుస్తోంది. విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య పలు అంశాల్లో విభేదాలు కొనసాగుతున్నాయి. ఇవి తమకు లాభం చేకూర్చుతాయని కెసిఆర్ భావిస్తుండవచ్చునని అంటున్నారు.
అయితే, కెసిఆర్ పార్టీ నేతలతో చెప్పే ముందస్తు వ్యూహం కూడా కావొచ్చనే వారు లేకపోలేదు. గత సార్వత్రిక ఎన్నికల్లో టిఆర్ఎస్ పెద్ద మెజార్టీతో గెలవలేదు. ఇతర పార్టీలకు చెందిన నేతలు కారు ఎక్కుతున్నారు. ఈ నేపథ్యంలో పలువురు అసంతృప్తికి గురవుతున్నారు.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలను తన గుప్పిట్లో పెట్టుకునేందుకే కెసిఆర్ ఇలాంటి హెచ్చరికలు చేస్తున్నారేమో అనే వారు కూడా లేకపోలేదు. తెలంగాణలో టిడిపికి మనుగడ లేకుండా చేయాలని కెసిఆర్ పట్టుదలతో ఉన్నారు.
అయితే, త్వరలో జరగనున్న జిహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలను బట్టి కూడా కెసిఆర్ ముందడుగు వేయవచ్చునని చెబుతున్నారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి చిక్కుకున్న నేపథ్యంలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఆథ్మహక్షణలో పడిందని టిఆర్ఎస్ భావిస్తోంది. ఇలాంటి సమయంలో ఎన్నికలకు వెళ్తే తమకే వంద సీట్లు ఖాయమని కెసిఆర్ అంచనా వేస్తుండవచ్చునని అంటున్నారు.