మోడీ! ఇది మీకు తగునా?: ఏపీ, తెలంగాణకు వద్దని.. యూపీకి ఇచ్చేస్తారా!?
ఉత్తరప్రదేశ్ ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ వ్యూహాత్మకంగా వ్యవహరించారని తెలుస్తోంది. ఒకప్పుడు రుణమాఫీ పేరెత్తితేనే విరుచుకుపడిన మోడీ.. తాజాగా యూపీ ఎన్నికల్లో అదే అంశంతో ఘన విజయం సాధించినట్ల
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ వ్యూహాత్మకంగా వ్యవహరించారని తెలుస్తోంది. ఒకప్పుడు రుణమాఫీ పేరెత్తితేనే విరుచుకుపడిన మోడీ.. తాజాగా యూపీ ఎన్నికల్లో అదే అంశంతో ఘన విజయం సాధించినట్లు తెలుస్తోంది. అయితే, ఏపీ, తెలంగాణలోని టీడీపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు అధికారంలోకి రావడానికి కూడా రుణమాఫీ హామీనే దోహదం చేసిందని చెప్పవచ్చు.
కాగా, అధికారంలోకి వచ్చాక రుణమాఫీ హామీని నెరవేర్చేందుకు ఉభయ రాష్ట్రాల సీఎంలు ఆర్థిక సాయం కోరేందుకు వెళితే మోడీ పెద్దగా ఆసక్తి చూపలేదు. 'అదేం కుదరదు' అంటూ తేల్చి చెప్పారు. ఆర్థిక సాయం కాకున్నా, కనీసం రీషెడ్యూలింగ్కో, చెల్లింపుల వాయిదాకో ఆర్బీఐని ఒప్పించాలన్న కోరికను కూడా ఆయన మన్నించలేదు.
కానీ, ఇప్పుడు తన సొంత లబ్ధి కోసం ఉత్తరప్రదేశ్లో రుణమాఫీ హామీ ఇవ్వడమే కాకుండా దానిని భరించేందుకు కూడా కేంద్రం సిద్ధమైంది. యూపీ రుణభారాన్ని కేంద్రం మోస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి రాధామోహన్ సింగ్ గురువారం లోక్సభలో ప్రకటించారు. అంతేకాదు, రైతులకు రాష్ట్రాలు రాయితీ ఇవ్వాలనుకోవడం అభినందించాల్సిన విషయమని పేర్కొన్నారు.
ఆయన ప్రకటనతో తెలుగు రాష్ట్రాల ప్రజలు భగ్గుమంటున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కూడా రుణమాఫీ ప్రకటించింది రైతులకేనన్న విషయం కేంద్రానికి తెలియదా? అని ప్రశ్నిస్తున్నారు.
అక్కడ అలా..
ప్రజలకు పప్పుబెల్లాలు కూడదన్న అదే మోడీ.. యూపీ ఎన్నికల ప్రచారంలో తానే రుణమాఫీ గురించి ప్రకటించారు. అంతేకాదు.. ఆ భారాన్ని కేంద్రమే మోస్తుందని గురువారం నాడు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్తో సాక్షాత్తూ నిండు లోక్సభ సాక్షిగా ప్రకటన చేయడం గమనార్హం. లోక్దళ్ ఎంపీ దుష్యంత చౌతాలా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా వ్యవసాయ మంత్రి ఈ విషయాన్ని తెలిపారు.
అభినందనీయమని చెప్పారు..
‘ఉత్తరప్రదేశ్లో కొత్తగా ఎన్నికైన బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో రైతుల రుణాలను మాఫీ చేస్తుంది. ఆ ఆర్థిక భారాన్ని కేంద్రం భరిస్తుంది' అని ఆయన విస్పష్టంగా చెప్పారు. అంతేకాదు.. ‘కేంద్రం కొన్ని రాష్ట్రాల పట్ల పక్షపాతంతో వ్యవహరిస్తోంద'న్న చౌతాలా విమర్శను కొట్టిపారేసి.. ‘ఏదైనా రాష్ట్రం రైతులకు రాయితీ ఇవ్వాలనుకోవడం అభినందించదగిన విషయం' అని చెప్పడం గమనార్హం.
ఏపీ, తెలంగాణకు ఇలా..
కాగా, మూడేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కూడా ఇదే రీతిలో రైతుల కోసమే మాఫీ ప్రకటిస్తే కనీసం పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు వ్యవహరిస్తున్న తీరుపై రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిపై రెండు రాష్ట్రాల ప్రభుత్వాలూ కేంద్రాన్ని నిలదీయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
అన్ని రాష్ట్రాల్లో మాఫీ చేయాలి: విపక్షాలూ
వ్యవసాయ రుణాల మాఫీ ప్రధాని హామీ ఇచ్చిన ఉత్తర ప్రదేశ్కే పరిమితం చేయకుండా దేశమంతటా అమలు చేయాలని లోక్సభలో విపక్షాలు డిమాండ్ చేశాయి. అయితే.. తన 90 నిమిషాల ప్రసంగంలో ఎక్కడా రాధామోహన్ సింగ్ ఇతర రాష్ట్రాల్లో రుణమాఫీని కేంద్రం భరించే ప్రస్తావనే తేకపోవడం గమనార్హం. దీంతో.. ‘మోడీ ఈ దేశానికి ప్రధానమంత్రా? లేక యూపీకా?' అని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఉభయ తెలుగు ప్రభుత్వాలు కేంద్రాన్ని కలిసి ఈ విషయంలో నిలదీయాలని డిమాండ్ చేస్తున్నారు.
క్రమశిక్షణ తప్పుతోంది..
‘వ్యవసాయ రుణాల మాఫీ వల్ల రుణగ్రహీతల్లో (అంటే రైతుల్లో) క్రమశిక్షణ కట్టు తప్పుతుంది. ఒకసారి ఇలాంటి మాఫీ పొందినవారు తదుపరి కూడా ఇదే తరహా మాఫీలుంటాయన్న ఆశతో భవిష్యత్తు రుణాలను కూడా చెల్లించకుండా ఎగవేస్తారు. మున్ముందు తీసుకునే రుణాల మాఫీ కోసం వచ్చే ఎన్నికల వరకూ ఎదురుచూస్తారు. దీనివల్ల క్రమశిక్షణ దెబ్బతినడం ఖాయమని ఇటీవల ఎస్బీఐ ఛైర్ పర్సన్ అరుంధతీ భట్టాచార్య పేర్కొన్నడం గమనార్హం.