చంద్రబాబు గుండెల్లో గుబులు: తల్లీచెల్లె తోడుగా.. మారిన జగన్
ఇంకా దాదాపు 20 నెలల వ్యవధి ఉండగానే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల శంఖారావం పూరించారు.నారా చంద్రబాబు నాయుడి గుండెల్లో గుబులు పుట్టించడానికి సిద్దమయ్యారు.
హైదరాబాద్: ఇంకా దాదాపు 20 నెలల వ్యవధి ఉండగానే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల శంఖారావం పూరించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి గుండెల్లో గుబులు పుట్టించడానికి సిద్దమయ్యారు.
గుంటూరు ప్లీనరీ వేదికగా ఆయన ఎన్నికల హామీలను కూడా గూప్పించారు. వచ్చే ఎన్నికలను కేవలం ఇమేజ్ మీద, తండ్రి మరణానికి సంబంధించిన సానుభూతి మీద ఆధారపడి కాకుండా ప్రణాళికాబద్దంగా అడుగులు వేయడానికి నిర్ణయియంచుకున్నట్లు అర్థమవుతోంది.
సీతయ్య ఎవరి మాటా వినడనే ఇమేజ్ను తుడిపేసుకోవడానికి కూడా ఆయన ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతోంది. తల్లి విజయమ్మను, సోదరి షర్మిలను కూడా రంగంలోకి దింపే ఉద్దేశంతో ఉన్నట్లు కనిపిస్తున్నారు. ప్రశాంత్ కిశోర్ను వ్యూహకర్తగా ఎంపిక చేసుకుని, ఆయనను అందరికీ పరిచయం కూడా చేశారు.
పరిపక్వత సాధించారా...
వైయస్ జగన్ అనుభవరాహిత్యంతో అపరిపక్వత లేని రాజకీయ నాయకుడిగా ఇంత కాలం పార్టీని నడిపారనే అభిప్రాయం ప్రబలంగా ఉంటూ వచ్చింది. ఆయన సుదీర్ఘ కసరత్తు తర్వాత తండ్రి ఇమేజ్ మీద కాకుండా తన సొంత కాళ్ల మీద నిలబడి చంద్రబాబుపై పోరాటం చేయడానికి నిర్ణయించుకున్నట్లు అర్థమవుతోంది. సలహాలు, సూచనలు స్వీకరించి, అవసరమైన మార్పులు చేర్పులు చేసుకోవడానకి కూడా ఆయన సిద్ధపడినట్లు తెలుస్తోంది.
Recommended Video
ఆ రెండు సంఘటనలు....
గరగపర్రు, చాపరాయి పర్యటనలు వైయస్ జగన్ ఇమేజ్ను పెంచాయి. సామాజిక వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణ నేపథ్యంలో గంగపర్రు పర్యటనలో జగన్ పరిపక్వతను, సంయమనాన్ని పాటించారని ఆయన ప్రత్యర్థుల నుంచి కూడా ప్రశంసలు అందుకున్నారు. సంఘటనకు చంద్రబాబును తప్పకుండా ఇరు వర్గాల మధ్య సామరస్యాన్ని కుదిరే మాటలు చెప్పడం ఆయన పరిపక్వత సాధించారని చెప్పడానికి నిదర్శనమని అంటున్నారు. అలాగే, అత్యంత కష్టానికి ఓర్చి చాపరాయికి వైరల్ ఫీవర్ బాధితులను పరామర్శించడానికి వెళ్లడం కూడా జగన్కు కలిసి వచ్చింది. రోడ్డు కూడా లేదంటూ సంబంధిత మంత్రి కామినేని శ్రీనివాస రావు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో తలుచుకుంటే ఏదైనా చేయవచ్చునని జగన్ నిరూపించినట్లయింది.
పవన్ కల్యాణ్ రాక ముందే....
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో రాక ముందే జగన్ అడుగులు ముందుకు వేయడం కూడా కలిసి వస్తుందని అంటున్నారు. పవన్ కల్యాణ్ రంగంలోకి దిగిన తర్వాత పోరాటం ఇరువురికి మధ్య జరిగే అవకాశం కూడా లేకపోలేదు. అందుకే తనకు పోటీ లేకుండా చేసుకోవడానికి ముందే ఆయన జాగ్రత్తపడ్డారని చెబుతున్నారు. ప్రశాంత్ కిశోర్ సూచన మేరకు ఆయన పవన్ కల్యాణ్తో జత కట్టే అవకాశం ఉన్నట్లు ప్రచారం కూడా సాగుతోంది. అయితే, అది ఏ మేరకు సాధ్యపడుతుందనేది ఇప్పుడే చెప్పలేం. ఒకవేళ పొత్తుకు సిద్ధపడకపోయినా తాను ముందే అడుగులు వేస్తే పవన్ కల్యాణ్ను ఆత్మరక్షణలో పడేయవచ్చునని ఆయన అనుకుని ఉండవచ్చు. అంతేకాకుండా మొదటే ప్రజలను తనకు అనుకూలంగా మార్చుకునే వ్యూహం కూడా అందులో ఉందని అంటున్నారు.
షర్మిలకు తగిన స్థానం....
సోదరి షర్మిల కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోనే కాకుండా వచ్చే ఎన్నికల్లో కీలక పాత్ర పోషించే అవకాశాలున్నట్లు పార్టీ ప్లీనరీ సమావేశం తెలియజేస్తోంది. ప్లీనరీలో షర్మిల ప్రధాన పాత్ర పోషించడమే కాకుండా ఘాటైన వ్యాఖ్యలతో ముందుకు వచ్చారు. ఇంత కాలం తెర వెనక ఉండిపోయిన ఆమెను కూడా రంగంలోకి దించడానికి జగన్ సిద్ధపడినట్లు తెలుస్తోంది.
విజయమ్మ కూడా....
గత ఎన్నికల్లో విశాఖపట్నం పార్లమెంటు సీటు నుంచి పోటీ చేసి ఓడిపోయిన తర్వాత విజయమ్మ పార్టీలో అంత చురుగ్గా పాల్గొనడం లేదు. ప్లీనరీలో ఆమె గొంతు విప్పారు. వచ్చే ఎన్నికల్లో ఆమె కూడా కీలకమైన పాత్ర పోషిస్తారని దాన్ని బట్టి అర్థమవుతోంది.
తండ్రి ఇమేజ్కు దూరంగానే....
తండ్రిపై ప్రజల్లో ఉన్న ఆదరాభిమానాలపై, ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలపై ఆధారపడకుండా తానేమిటో చెబుతూ, అధికారంలోకి వస్తే తానేం చేస్తానో వివరిస్తూ జగన్ ముందుకు సాగేందుకు సిద్ధపడినట్లు అర్థమవుతోంది. పాదయాత్ర ద్వారా ప్రజలను తన వైపు తిప్పుకోవడానికి ఆయన సిద్దపడినట్లు కూడా అనుకోవచ్చు. మొత్తంమీద వచ్చే ఎన్నికల్లో విజయానికి సర్వశక్తులూ ఒడ్డడానికి ఆయన సిద్ధపడ్డారని చెప్పవచ్చు.